కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 34 రైతు సంఘాలు ఇవాళ భారత్ బంద్ పాటించాయి. రైతుల బంద్కు 18 రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఉదయం పదకొండు గంటల నుంచి 3 గంటల వరకు రవాణా స్థంభించిపోయింది. వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. దేశంలో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. దాదాపు 3 కోట్ల ట్రక్కులు రోడ్డెక్కలేదు. గడచిన మూడు దశాబ్దాల్లో మన దేశంలో సంపూర్ణంగా బంద్ జరగడం ఇదే తొలిసారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో..
తెలుగు రాష్ట్రాల్లో బంద్ స్వచ్ఛందంగా, సంపూర్ణంగా జరిగింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంద్కు మద్దతు ప్రకటించడంతో పాటు, ప్రతి కార్యకర్త బంద్లో పాల్గొనాలని పిలపు నివ్వడంతో సంపూర్ణంగా సాగింది. రైతు సంఘాలు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకే బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చినా, టీఆర్ఎస్ శ్రేణులు తెల్లవారక ముందే బస్టాండ్ల వద్దకు చేరుకుని బంద్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు బీజేపీ రూపంలో ఊహించని షాక్ తగలడంతో బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఒకటయ్యానిపిస్తోంది. కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన మూడు చట్టాలు తేనెపూసిన కత్తుల్లాంటివని మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు. బంద్ను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ణతలు తెలిపారు. రైతులకు వ్యతిరేకంగా చట్టాలు చేసిన ప్రభుత్వాలన్నీ కనుమరుగయ్యాయని బంద్లో పాల్గొన్న మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్లో బంద్ సంపూర్ణంగా కొనసాగింది. మెట్రో రైలు సేవలు కూడా నిలిచిపోయాయి. కార్యాలయాలు మూసివేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, కొప్పుల ఈశ్వర్లను రైతులు నిలదీశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోవడంతో టీఆర్ఎస్ నాయకులకు రైతులు గుర్తుకువచ్చారని రైతులు ఆందోళన చేశారు.
హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దుకాణాలను మూయించాయి. ఇక సూర్యాపేటలో 2 వేల ట్రాక్టర్లతో రైతులు బంద్ పాటించారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిని స్థంభింపజేశారు. భువనగిరిలో బంద్ ఉద్రిక్తతలకు దారితీసింది. సీపీఎం నాయకులు దుకాణాలు మూయించేందుకు ఓ బేకరీపై దాడి చేయారు. బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పరిస్థితి చేయిదాటకుండా అదుపులోకి తెచ్చారు.
వైసీపీ మొసలి కన్నీరు : చంద్రబాబు
కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా ఓటు వేసిన వైసీపీ నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. ఏపీలో టీడీపీ, వామపక్షాలు పెద్ద ఎత్తున బంద్లో పాల్గొన్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖ, అనంతపురం, తిరుపతి బస్టాండ్ల నుంచి బస్సులను కదలనివ్వలేదు. చట్టాలు రద్దు చేసే వరకు పోరాటం సాగిస్తామని వామపక్షాల నేతలు రామకృష్ణ, మధు స్పష్టం చేశారు.
Must Read ;- తాడోపేడో : చట్టాలు రద్దు చేసే వరకు అంగుళమైనా కదలం
గుజరాత్లో హింసాత్మకం
గుజరాత్లో బంద్ హింసాత్మకంగా మారింది. సూరత్, అహ్మదాబాద్ పట్టణాల్లో అల్లరి మూకలు చెలరేగిపోయాయి. అల్లరి మూకల దాడిలో ముగ్గురు చనిపోయారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు గుజరాత్లోని పలు పట్టాణాల్లో కర్ఫ్యూ విధించారు. 5 వేల మంది పారా మిలటరీని రంగంలోకి దింపారు. ఇక రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో బంద్ విజయవంతమైంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భారత్ బంద్కు మద్దతు పలికారు. దీంతో ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్ను గృహ నిర్భంధంలో ఉంచారు. కేజ్రీవాల్ రోడ్డుపైకి వచ్చి రైతులను కలవడంతో బీజేపీలో కలవరం మొదలైందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఘాటుగా విమర్శించారు. మహారాష్ట్రలో బంద్ విజయవంతమైంది. భారత్ బంద్కు శివసేన మద్దతు ప్రకటించడంతో ముంబయి స్థంభించిపోయింది. ఉదయం నుంచే రవాణా నిలిచిపోయింది. దూరప్రాంత రైళ్లు కూడా రెండు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఒక రోజు నిరాహార దీక్షకు దిగారు.
స్థంభించిన కోల్కతా
యూపీ, బీహార్, పశ్చిమబెంగాల్, ఒడిస్సా రాష్ట్రాల్లో బంద్కు సంపూర్ణ మద్దతు లభించింది. బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ బంద్లో పాల్గొనడంతో రైళ్లు కూడా నిలిచిపోయాయి. కోల్కతా స్థంభించి పోయింది. ఉదయం నుంచే రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. ప్రజా రవాణాతో పాటు, ప్రైవేటు వాహనాలు రోడ్డెక్కలేదు. స్వల్ప ఘటనలు మినహా బెంగాల్లోనూ బంద్ ప్రశాంతంగా ముగిసింది. బీహార్, యూపీలో బంద్ను కాంగ్రెస్ శ్రేణులు విజయవంతం చేశాయి. ప్రధాని మోడీ దేశాన్ని దోచుకోవడం ఆపాలని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
చెన్నైలో కర్ఫ్యూ వాతావరణం
తమిళనాడు, కేరళలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. తమిళనాడులో బంద్కు డీఎంకే మద్దతు పలికింది. కార్యకర్తలంతా బంద్ను విజయవంతం చేయాలని డీఎంకే అధినేత స్టాలిన్ పిలుపునిచ్చారు. దీంతో ప్రజారవాణా స్థంభించిపోయింది. చెన్నైలోనూ కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. కేరళలో వామపక్షాలు బంద్ను విజయవంతం చేశాయి. బస్సులు డిపోలకే పరిమితమై ప్రజా రవాణా నిలిచిపోయింది. కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా రైతులు నినదించారు. మొత్తం మీద బంద్ విజయవంతంగా, ప్రశాంతంగా ముగిసిందనే చెప్పుకోవచ్చు. రైతు సంఘాలు పిలుపు నిచ్చిన భారత్ బంద్కు బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ దాదాపుగా మద్దతు ప్రకటించడంతో అన్ని రాష్ట్రాల్లో విజయవంతమయ్యింది.
Also Read ;- కమలదళంలోకి కాంగ్రెస్ నేతలు ఎవరెవరు?











