ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చే హామీకి, అధికారంలోకి వచ్చాక అమలు చేసే పనులకు సంబంధం లేకుంటే.. ఏ పార్టీకైనా ఎన్నికల్లో పరాభవం తప్పదు. అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కావచ్చు.. స్థానిక సంస్థల విషయంలో కావచ్చు. రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీని నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపించినప్పుడు ఆ హామీ నెరవేర్చాల్సిన బాధ్యత సదరుపార్టీదే. అయితే ఏపీలో మాత్రం అందుకు విరుద్దమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుత అధికార వైసీపీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడుగడుగునా అప్పటి అధికార పార్టీని తప్పుబడుతూనే ఉంది. చివరికి హుద్ హుద్ సమయంలో పరిహారం విషయంలోనూ మినహాయింపు లేదు. హుద్ హుద్ ధాటికి ఉత్తరాంధ్ర అతలాకుతమైంది. ఓ వైపు అప్పటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం చూపెట్టిన పాలనా ధక్షత ఉత్తరాంధ్ర వాసులు ప్రతి తుపాను సందర్భంగా గుర్తుచేసుకుంటూనే ఉంటారనే అభిప్రాయం ఉంది.
జగన్ హామీలు ఇవీ..
తుపాను తరువాత అక్టోబరులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో పర్యటించారు. అందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఫైబర్ బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు 2 లక్షల 50వేల రూపాయలు, వలలు కోల్పోయిన వారికి 50వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొబ్బరితోటలు కోల్పోయిన వారికి చెట్టుకు 5 వేలు పరిహారం డిమాండ్ చేశారు. జీడిమామిడి తోటలకు ఎకరాకు 50 వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. కూలిన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. దెబ్బతిన్న ఇళ్లకు 50 వేల రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి బాధితుని ఇంటికి తక్షణ సాయంగా 5 వేల రూపాయలు పరిహారం ఇవ్వాలని కోరారు. తుపాను బాధితులకు 25 కిలోల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులు, మత్స్యకారులకు పరిహారం వెంటనే ఇవ్వకుంటే అదే సంవత్సరం నవంబరు 5న రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్వో కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అందరికీ రూ.500 పరిహారం ఇవ్వడం లేదెందుకని ప్రశ్నించారు. వర్షాలు పడుతున్న సమయంలో..పది రోజులపాటు పనులు ఆగిపోయాయని, పనులకు పోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి పరిహారం ఒకేసారి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మానవత్వంతో స్పందించాలని డిమాండ్ చేశారు. గ్రామాలు మునిగిపోయాయని, ప్రతి ఇంట్లో పది పన్నెండు రోజులు నీళ్లు ఇళ్లలో ఉంటే ఎలా బతకగలుగుతారు అని ప్రశ్నించారు. రైతులకు భారీగా నష్టం వచ్చిందని చెప్పిన జగన్.. పంట నష్టం అంచనాతో ఏం పని అని ప్రశ్నించారు. ఎన్యూమరేషన్ తో ఏం పని అని ప్రశ్నించారు. అధికారులు వచ్చి తప్పుడు లెక్కలు రాస్తారని, అదేమైనా రాకెట్ సైన్సా అని వ్యాఖ్యానించారు. హుద్ హుద్ తోపాటు, తిత్లీ తుపాన్ల సందర్భంగా కూడా వైసీపీ ఇలాంటి విమర్శలే చేసింది. అయితే అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. అంతా ‘నిబంధనల’ ప్రకారం అనే మాట తెరపైకి వచ్చింది.
Also Read ;- మీ మాట చెల్లకపోతే ఇలా చేస్తారా? జగన్కు అక్షింతలు
మొన్నటికి మొన్న అక్టోబరులో గోదావరి వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణమే రూ.5 లక్షల పరిహారం అందించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు (ముంపునకు గురైన ఇళ్లు) 25 కేజీల బియ్యం, ఒక కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో ఆలుగడ్డలు తప్పనిసరిగా పంపిణీ చేయాలన్నారు. పునరావాస శిబిరాల్లో ఉన్నవారికి తిరిగి వెళ్లేటప్పుడు ఒక్కొక్కరికి రూ.500 ఇవ్వాలని ఆదేశించారు.
తాజాగా నివర్ తుపాను వచ్చింది. భారీగా నష్టాన్ని మిగిల్చింది. నివర్ బాధితులకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున పరిహారంగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం జరిగింది. వీటితోపాటు నిబంధనల ప్రకారం మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తామని, రాయితీపై విత్తనాలు అందజేస్తామని నవంబరు 27న జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు.
నిమ్మల విమర్శ..
కాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. గతేడాది ఆగస్ట్ 8, 2019న వరదలు వచ్చినప్పడు కూడా ముఖ్యమంత్రి, ఇదే విధంగా ఏరియల్ సర్వేతో సరిపెట్టి, బాధిత కుటుంబాలకు రూ.5 వేల సాయం అందిస్తామని, ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు నిర్మిస్తామని, పంటలు నష్టపోయిన వారికి పరిహారం అందచేస్తామని చెప్పారన్నారు. ఇప్పటికీ అమలు కాలేదని వ్యాఖ్యానించారు.
Must Read ;- జగన్కు దెబ్బే : కమలదళంలోకి వైసీపీ కీలక నేత!