ఐపీఎస్ అధికారుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన ప్రత్యేకత. నిందితులను క్షణాల్లో అరెస్ట్ చేసే సత్తా కొందిరికి ఉంటే.. కేసుల విచారణలో కోర్టుల ముందు పక్కా ఆధారాలను సమర్పించి కేటుగాళ్లకు శిక్ష పడేలా చేయడంలో మరికొందరు మెరుగ్గా రాణిస్తారు. మరికొందరైతే.. తామున్న ప్రాంతాల్లో అసాంఘీక కార్యకలాపాలు కొనసాగించాలంటేనే నిందితులు వణికిపోయేలా పనిచేస్తారు. ఈ తరహాలో అన్నింటా మెరుగ్గా రాణించే ఐపీఎస్ లు కూడా ఉంటారు. అలాంటి వారిలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారులు కూడా చాలా మందే ఉన్నారు. ఆ జాబితాలో తెలంగాణ కేడర్ కు చెందిన వీసీ సజ్జన్నార్, స్టీఫెన్ రవీంద్ర, అకున్ సభర్వాల్, శంకభ్రత బాగ్చీ తదితరులున్నారు. వీరిలో సజ్జన్నార్ కు వచ్చినంత క్రేజ్ ఎవరికీ రాలేదనే చెప్పాలి. అయితే అంతకుమించిన రేంజిలో స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేకతను చాటుకున్నారు. స్టీఫెన్ తో పనిచేయించుకోవాలని కోరుకోని ప్రభుత్వాధినేతలు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఈ కోణంలోనే ఆలోచించిన ఏపీ సీఎం జగన్ పిలిచి మరీ కీలక పదవి ఇస్తానంటేన.. తొలుత సరేనన్న స్టీఫెన్ ఆ తర్వాత కేంద్రం అనుమతించినా.. జగన్ వద్దకు వెళ్లేందుకు నిరాకరించారట. తాజా బదిలీల సందర్భంగా ఈ ఆసక్తికర విషయం వెలుగుచూసింది.
కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా..
ఉమ్మడి ఏపీ కేడర్ ఐపీఎస్ గా స్టీఫెన్ రవీంద్రకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విభజన జరిగిన తర్వాత స్టీఫెన్ కు తెలంగాణ కేడర్ దక్కింది. అయితే ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జగన్.. స్టీఫెన్ సేవలను కోరారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఒప్పుకున్నారు. స్టీఫెన్ తెలంగాణ నుంచి రిలీవ్ అయినట్లుగానే కనిపించారు. ఏపీ పోలీసులు నమోదు చేసిన డేటా చౌర్యం కేసులో తనదైన స్పీడు చూపించారు. స్టీఫెన్ ఏపీకి రాగానే.. ఆయనకు ఇంటెలిజెన్స్ చీఫ్ పదవిని ఇవ్వాలని జగన్ ఆశించారు. అయితే ఈ అంతరాష్ట్ర బదిలీపై కేంద్రం బాగా జాప్యం చేసింది. ఈ క్రమంలో కేంద్రం అనుమతించేదాకా తెలంగాణలోనే కొనసాగుతానంటూ స్టీఫెన్ భావించారు. అయితే ఏడాది తర్వాత స్టీఫెన్ ను ఏపీ కేడర్ కు పంపేందుకు కేంద్రం ఓకే చెప్పిందట. ఏడాది పాటుగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న స్టీఫెన్ ఎగిరి గంతేసి ఏపీకి వెళ్లిపోయి.. ఇంటెలిజెన్స్ చీఫ్ పదవిలో చేరిపోవాలి. అయితే అందుకు విరుద్ధంగా పోస్టింగ్ లేకున్నా ఫరవా లేదు గానీ.. తాను ఏపీకి వెళ్లేది లేదని స్టీఫెన్ తేల్చి చెప్పారట. స్టీఫెన్ కు ఇష్టం లేకపోతే ఏపీకి పంపడమెందుకు? సమర్థుడైన ఆయన సేవలను మనమే వినియోగించుకుందాం అన్న కోణంలో యోచించిన కేసీఆర్.. స్టీఫెన్ ను తెలంగాణ కేడర్ లోనే కొనసాగేలా ఒప్పుకున్నారు. ఇది జరిగిన ఏడాది తర్వాత ఇప్పుడు స్టీఫెన్ ను కీలకమైన సైబరాబాద్ కమిషనర్ గా నియమిస్తూ కేసీఆర్ సర్కారు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
స్టీఫెన్ లో మార్పు ఎందుకొచ్చింది?
జగన్ సీఎం అయ్యాక ఏపీ పాలనలో ఎప్పటికప్పుడు పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జగన్ సర్కారు తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించి కోర్టులు నిత్యం అక్షింతలు వేస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు అధికారులు కోర్టు మెట్లెక్కాల్సి వస్తోంది. అటు ఐఏఎస్ అధికారులతో పాటు ఇటు ఐపీఎస్ అధికారులు కూడా కోర్టు విచారణకు హాజరవుతూ.. జగన్ సర్కారు నిర్ణయాలకు చీవాట్లు తింటున్నారు. ఇలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటుగా డీజీపీ కూడా పలుమార్లు కోర్టు మెట్లెక్కారు. అంతేకాకుండా ఏపీలో పోలీసింగ్ సాగుతున్న తీరుపైనా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్, కస్టడీలోనే ఆయనపై సీఐడీ అధికారులు ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగం, ఆ తర్వాత రఘురామ పిటిషన్లతో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పోలీసు అధికారులపై వెల్లువెత్తుతున్న విమర్శలు.. ఇలా వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలను చూసిన తర్వాతే.. జగన్ వద్ద ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసే విషయంలో స్టీఫెన్ పునరాలోచనలో పడిపోయారట. ఏపీలో పోలీసుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు తెలంగాణలో లేవు. ఇదే అంశాన్ని కాస్తంత సీరియస్ గా ఆలోచించిన స్టీఫెన్.. ఇప్పటిదాకా తాను సంపాదించుకున్న ట్రాక్ రికార్డు మొత్తం ఏపీకి వెళితే పాడవుతుందనుకున్నారో, ఏమో తెలియదు గానీ.. ఏపీ కేడర్ కు వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- జగన్ వద్దంటుంటే.. బొత్స కావాలంటున్నారే