‘లవ్ జిహాద్’ ఈ పదం దక్షిణాది రాష్ట్రాల్లో కొంచెం కొత్తగా ఉన్నా.. ఉత్తరాది రాష్ట్రాల వారికి తెలిసిన విషయమే. ప్రేమ పేరుతో హిందువుల అమ్మాయిలను ముస్లిం యువకులు ప్రేమించి, పెళ్లి చేసుకుని మతమార్పిడులకు పాల్పడుతున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఉత్తరప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మతమార్పిడుల నిరోధక ఆర్డినెన్స్, రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రకారం కల్పించిన మతస్వేచ్ఛకు భంగం కలిగించేదిగా ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలోని ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. తాజాగా యూపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగం కల్పించిన మతస్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉందని న్యాయనిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాజ్యాంగం ఏం చెబుతోంది?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలోని ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని చాలా స్పష్టంగా చెబుతోంది. అంటే ప్రస్తుతం ఒక మతాన్ని ఆచరిస్తున్న వ్యక్తి తనకు ఆ మతం నచ్చకపోతే మరో మతం స్వీకరించవచ్చు. ఇలా ఏ వ్యక్తి అయినా తనకు ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని రాజ్యాంగం స్పష్టం చేసింది. ఇవన్నీ పట్టించుకోకుండా ఆర్డినెన్సు తీసుకురావడం ద్వారా మతమార్పిడులకు చెక్ పెట్టాలని చూడటం రాజ్యాంగ వ్యతిరేకమే. 18 సంవత్సరాలు దాటిన వారు ఏ మతం వారయినా, మరే మతం వారిని వివాహం చేసుకున్నా అది చట్టబద్దమేనని ఉన్నత న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. ఇవన్నీ పట్టించుకోకుండా పెళ్లి తర్వాత మతం మారేట్లయితే.. రెండునెలల ముందు అనుమతి తీసుకోవాలని యూపీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఆర్డినెన్సులో పొందుపరిచింది.
అయితే పెళ్లికి ముందు మతం మారడానికి అనుమతి తీసుకోనక్కర్లేదా అనే అనుమానం రాకమానదు. అనుమతి లేకుండా మతం మారిపోయి. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే అడిగే వారెవరు. రాజ్యాంగం ప్రకారం ఎవరు ఏ మతమైనా పాటించవచ్చు. దానికి ప్రభుత్వ అనుమతి ఎందుకు తీసుకోవాలనే ప్రశ్న తలెత్తుతోంది.
Must Read ;- ఆలయంలో ముద్దులు.. మరో వివాదంలో నెట్ఫ్లిక్స్!
జనం అభిమతాన్ని ఎవరు కాదనగలరు?
ప్రజలు ఎవరి ఇష్టం వచ్చిన మతం వారు పాటించవచ్చని రాజ్యాంగం స్పష్టంగా చెప్పినాక ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లవ్ జిహాద్ కు భయపడాల్సిన పనేముంది. జనం అభిమతాన్ని ఎవరు కాదనగలరు. ఒక మతంలో తనకు మంచి జరగలేదని, మరో మతం తీసుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయని మతం మారే వారిని మనం చూస్తూనే ఉన్నాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి ఏ మతంలో ఉన్న వారు, ఆ మతంలోనే కొనసాగాలని చెప్పలేదు. తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరు చూస్తుంటే వారు మతమార్పిడులను అడ్డుకోవాలని చూస్తున్నారా? లేదంటే రాజ్యాంగం ప్రజలకు కల్పించిన మతస్వాత్రంత్యాన్ని, ఆర్డినెన్సులు తీసుకు వచ్చి హరించివేయాలని చూస్తున్నారా? అనే అనుమానం వస్తోంది.
ఆర్డినెన్సు వెనుక ఏ ప్రయోజనాలు దాగిఉన్నాయి?
ఎక్కడో ఓ ముస్లిం వ్యక్తి హిందూ మహిళలను ప్రేమించి పెళ్లి చేసుకుంటే దాన్ని లవ్ జిహాద్ గా పేరుపెట్టి, తీవ్రవాదం అంటగడుతున్నారు. మరి హిందువులు ఎవరైనా ముస్లిం మహిళను వివాహం చేసుకుంటే అది నేరం కాదా? అది లవ్ జిహాద్ కిందకు రాదా? వివాహ సాంప్రదాయం ప్రకారం ముస్లింలు, హిందువులను చేసుకున్నా, హిందువులు, ముస్లింలను చేసుకున్నా ముందుగా ఎవరో ఒకరు మతం మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే వారు ఏదో ఒక సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవడం వీలవుతుంది. దీన్ని అడ్డుపెట్టుకుని హిందువుల మహిళలకు ఎరవేసి ముస్లిం మతంలోకి మార్చుతున్నారని గగ్గోలు పెట్టడం చూస్తుంటే, బీజేపీ నాయకులు మతాన్ని ఏ విధంగా వాడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.
అయోధ్యలో రామ మందిరం నినాదంతో పునాదులు వేసుకున్న బీజేపీ ఇప్పుడు లవ్ జిహాద్ ఆర్డినెన్సు పేరుతో ఆ పునాదులను మరింత పటిష్టం చేసుకోవాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ హిందూ సమాజాన్ని ఉద్దరించే కోణం ఏ మాత్రం అందులో లేదు. ఎక్కడో కోటికి ఒక సంఘటన జరిగితే హిందూ సమాజాన్ని మొత్తాన్ని, ముస్లిం మతంలోకి మారుస్తున్నారంటూ గగ్గోలు పెట్టడం చూస్తుంటే, బీజేపీ నేతలు జనాలను మతం పేరుతో రెచ్చగొట్టి ఓట్లు దండుకునే వ్యూహం మాత్రమే అందులో కనిపిస్తోంది.
ప్రజల సమస్యలు గాలికి వదిలేసి ఎంతసేపూ హిందూ, ముస్లింల మధ్య వెతికి మరీ వివాదాలు సృష్టించడం వల్ల భారత సమాజానికి మెరుగైన జీవనం లభించదు. ఇప్పటికైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉపాధి, ఉద్యోగాల కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్దిపై దృష్టి సారిగ్గే మెరుగైన సమాజం ఏర్పడుతుంది. లేదంటే ప్రపంచంలోనే అతిపెద్ద లౌకిక రాజ్యమైన భారత్ అపకీర్తిని మూటగట్టుకోవాల్సి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read ;- మరో మతం గొడవ షురూ: రాముడి తరవాత ఇక కృష్ణుడే











