ఏపీలో స్థానిక ఎన్నికల పోరు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ మధ్య వార్ గా మారింది. మధ్యలో ప్రతిపక్షాలు నిమ్మగడ్డకు మద్దతుగా గళమెత్తడం, అధికారపార్టీకి చెందిన మంత్రులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మద్దతుగా మాట్లాడటం చూస్తూ ఉంటే ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్యే కాదు, ఎన్నికల కమిషనర్ వర్సెస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మధ్య కూడా పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఎన్నికల ప్రక్రియ మధ్యలో సీఎస్ జోక్యం రాజ్యాంగ విరుద్ధమని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు చెప్పడాన్ని రాజ్యాంగ నిపుణులు కూడా తప్పుపడుతున్నారు.
సాధ్యం కాదంటున్నా ఎన్నికలు పెడతారా?
ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు నిర్వహించాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం సుముఖత చూపితేనే సాధ్యం అవుతుంది. ఎన్నికలు నిర్వహిస్తామని ఇందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్దమేనా అని అడిగే హక్కు ఎన్నికల సంఘానికి ఉంది. అయితే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దంగా ఉందా? లేదా అనేది ప్రభుత్వం వెల్లడిస్తుంది. అంతే కాని ఇప్పుడు ఎన్నికలు జరపండి అంటే పట్టుబడితే సరిపోతుందా అనేది ప్రవ్న. కుదురుతుందా? లేదా? నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది.
ఏపీలో కూడా అదే జరుగుతోంది. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగం నడవదు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తరవాత మాత్రమే రాష్ట్ర యంత్రాంగం ఎన్నికల సంఘం పరిధిలోకి వెళుతుంది. అయితే, ప్రభుత్వం నిర్వహించడానికి సిద్ధమని ఓకే చెబితే మాత్రమే ఆయన నోటిఫికేషన్ విడుదల చేయగలరు. ఏపీలో స్థానిక ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇస్తామని, ప్రస్తుతం రాష్ట్రంలో కోడ్ అమల్లో లేదని స్వయంగా ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పిన తరవాత కూడా న్యాయశాస్త్రంలో పీజీ చేసిన యనమల రామకృష్ణుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అనేక విమర్శలు వస్తున్నాయి.
Must Read ;- నిమ్మగడ్డ వర్సెస్ నీలం సాహ్ని
రాజ్యాంగాన్ని గౌరవించాలి
రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించాలని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చెబుతున్నారు. రాజ్యాంగంలోని 73, 74 ఆర్టికల్స్ ను గౌరవించాలని ఆయన అంటున్నారు. అంటే ఎన్నికల సంఘం ఏది చెబితే అది చేయాలని రాజ్యాంగంలో లేదు. ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సహకరించాలనే మాత్రమే సూచించింది. ఎన్నికల ఏర్పాట్లు చేసుకునేందుకు ప్రభుత్వం కొంత సమయం గడువు అడిగితే ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది.
రాష్ట్ర యంత్రాంగాన్ని ఎన్నికల సంఘానికి బదిలీ చేయాలని 243కె(3) ఆర్టికల్ సూచిస్తోందని యనమల చెప్పేది నిజమే. కానీ అది ఎప్పుడు జరుగుతుంది. ప్రభుత్వం ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేసిన తరవాత, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే కోడ్ అమల్లోకి వస్తుంది. అప్పుడు యంత్రాంగం ఎన్నికల సంఘం చెప్పినట్టు వింటుంది. అలాంటిది ఏమీ లేకుండా సీఎస్ రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని యనమల ఎలా చెప్పగలరు.
ప్రభుత్వం సహకరించకుండా ఎన్నికలు సాధ్యమా?
దేశంలోనయినా, రాష్ట్రంలో అయినా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సహకరించకుండా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. సకాలంలో ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వ యంత్రాంగాన్నే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఎన్నికలు నిర్వహించే ముందు అధికారంలో ఉన్న ప్రభుత్వ అభిప్రాయం తెలుసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. ఎన్నికల ఏర్పాట్లకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేస్తే ఇక ఎన్నికల ప్రక్రియ ప్రారంభించుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు ఎన్నికలు వద్దు అంటే, ఇప్పడే ఎన్నికలు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం పట్టుపట్టినా ఉపయోగం ఉండదు.
స్థానిక సంస్థల ఎన్నికలు కొన్ని రాష్ట్రాల్లో ఐదు సంవత్సరాలు పాటు నిలిచిపోయిన సందర్బాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మరచి యనమల లాంటి న్యాయశాస్త్ర నిపుణుడు సీఎస్ నిర్ణయం రాజ్యాంగ విరుద్దం అని చెప్పడంలో ఔచిత్యం లేదని, ఆయన ఎందుకిలా మాట్లాడుతున్నారోనని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read ;- చేతులెత్తేసిన సర్కార్ : ఎన్నికలు పెట్టలేం!











