ఐదు రోజుల పెళ్లి అనే మాటకు కాలం చెల్లిపోయినా ఇంకా సంపన్న వర్గాల్లో మాత్రం ఇది కనిపిస్తూనే ఉంది. తాజాగా మూడు రోజుల పెళ్లి ముచ్చట వైరల్ అవుతోంది. అది మరెవరిదో కాదు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ పెళ్లి. ప్రేయసి నటాషా దలాల్ తో వరుణ్ వివాహం జరగబోతోంది. ఈ పెళ్లి వేడుకలు నిన్నటి నుంచే ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 నుంచి 24 వరకూ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.

వీరిద్దరిపై ఎప్పట్నుంచో పుకార్లు షికార్డు చేశాయి. మా మధ్య అలాంటిది ఏమీ లేదు అని మొదట్లో కొట్టి పారేసినా ఇప్పుడు అధికారికంగా వార్తలు వచ్చేశాయి. పెళ్లి ఘనంగా అంటే తండోపతండాలుగా బంధుమిత్రులను ఆహ్వానించి కాదట.. పరిమితంగా అతిథులు హాజరవబోతున్నారు. ప్రధానంగా 50 మంది సినీ సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. వీరిలో కరణ్ జోహార్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, శిల్పాశెట్టి, రెమో డిసౌజా, శశాంక్ కైతాన్, రాజ్ కుంద్రా లాంటి వారున్నారు.

ముంబయి శివారులో ఉండే అలీబాగ్ లోని మాన్ సన్ హౌస్ ను ఈ పెళ్లి కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. కోవిడ్ తర్వాత బాలీవుడ్ లో ఇది మొదటి వివాహం అనే చెప్పాలి. వీరి తర్వాత మరికొందరు సెలబ్రిటీలు పెళ్లి కోసం క్యూలో ఉన్నారు. ముఖ్యంగా రణ్ బీర్ కపూర్ – ఆలియా భట్, అర్జున్ కపూర్ – మలైకా అరోరా కూడా ఓ ఇంటివారు కాబోతున్నారు. ఇప్పటికే సెలబ్రిటీలంతా అక్కడికి చేరుకున్నారు.
Must Read ;- అర్జున్ కఫూర్, మలైకా పెళ్లి చేసుకోబోతున్నారా.?











