తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు జల వివాదం దూరాన్ని పెంచింది. అప్పటిదాకా కలిసిమెలిసి సాగిన ఇరు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ లు ఈ ఏడాది జనవరి నుంచి అసలు కలవనే లేదు. కనీసం ఎదురు పడను కూడా లేదు. అయితే ఇప్పుడు వారిద్దరూ తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురు పడబోతున్నారు. ఈ నెల 26న ఢిల్లీలో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశం కానున్నారు. దేశంలో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలు పది ఉంటే.. వాటిలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ ఈ సమావేశానికి హాజరు కాక తప్పదు. అంతేకాకుండా అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశాన్ని ఏ ఒక్క సీఎం కూడా గైర్హాజరయ్యే ప్రసక్తే లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సమావేశం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారమే హస్తిన ఫ్లైట్ ఎక్కనున్నారు. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఇంకా ఖరారు కాకున్నా.. ఆదివారం సాయంత్రంలోగా ఆయన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడం ఖాయమేనని చెప్పక తప్పదు.
ఇద్దరు కలుస్తారా?
ఒకే సమావేశానికి హాజరవుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ లు ఎదురు పడక తప్పదు. ఎదురెదురుగానో, పక్కపక్కగానో కూర్చోకా తప్పదు. ఇలాంటి నేపథ్యంలో వారిద్దరి మధ్య మాటలు కలవకా తప్పదు. ఇక అమిత్ షా నేతృత్వాన జరిగే ఈ సమావేశంలో జగన్, కేసీఆర్ లు ఎడముఖం పెడముఖం పెట్టే ఛాన్సే లేదు. కనీసం కర్టసీ కోసమైనా ఇద్దరు నేతలు పలకరించుకోక తప్పదు. 9 నెలలుగా ఇద్దరు సీఎంల మధ్య మాటలు లేకున్నా.. సోమవారం (సెప్టెంబర్ 26) నాడు మాత్రం పలకరించుకోక తప్పదు. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం తప్పించి కేసీఆర్, జగన్ ల మధ్య ఇతరత్రా వైరుధ్యాలు గానీ, శత్రుత్వం గానీ లేదనే చెప్పాలి. జగన్ పిలిస్తే కేసీఆర్ అమరావతి వెళ్లారు. కేసీఆర్ పిలిస్తే జగన్ ప్రగతి భవన్ కు వెళ్లారు. ఇక కేసీఆర్ ఆహ్వానం మేరకు తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కూడా హాజరై జగన్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. సో.. ఒక్క జల వివాదం తప్పించి వీరిద్దరి మధ్య ప్రత్యేకించి శత్రుత్వమేమీ లేదనే చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో ఆసక్తికర ఊహాగానాలు మొదలయ్యాయి.
అమిత్ షా కలుపుతారా?
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై ఇటు జగన్ తో పాటు అటు కేసీఆర్ కూడా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఇద్దరు సీఎంలు ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వద్ద ప్రత్యేకంగా కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యను ఎలాగోలా పరిష్కరించేద్దాంలే అంటూ ఇటీవలే తనను కలిసిన కేసీఆర్ కు అమిత్ షా హామీ కూడా ఇచ్చారన్న వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో తన వద్ద సమావేశానికి వస్తున్న జగన్, కేసీఆర్ లను కూర్చోబెట్టి అమిత్ షా జల వివాదాన్ని పరిష్కరిస్తారా? అన్న దిశగా ఆసక్తికర ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తమ మధ్య స్నేహాన్ని దూరం చేసిన జల వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇటు జగన్ తో పాటు అటు కేసీఆర్ కూడా ఆసక్తిగానే ఉన్నారు. ఈ క్రమంలో అమిత్ షా చొవర తీసుకుంటే సరేసరి.. లేదంటే.. జగన్, కేసీఆర్లే ప్రత్యేకంగా భేటీ అయి ఈ సమస్యను పరిష్కరించుకునే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి..
Must Read ;- జగన్ కు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసినట్టే!