2014 ఎన్నికల్లో ఏపీలో విక్టరీ కొడుతుందనుకున్న వైసీపీ చంద్రబాబు పాలనా దక్షత ముందు చతికిలబడింది. గెలిచి తీరతామన్న ధీమాతో ఉన్న జగన్.. ఫలితాలను చూసి నోరెళ్లబెట్టారు. తాను సీఎం కావాలంటే.. తన సత్తాకు మరేదో కావాలని ఆయన గ్రహించారు. అలా ఆలోచిస్తున్న సమయంలో 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ కేంద్రంలో స్పష్టమైన మెజారిటీతో అధికారం దక్కించుకున్న తీరు గుర్తుకు వచ్చింది. ఎన్నికల్లో మోదీ చేపట్టిన ప్రచార తీరు, ఆ ప్రచార తీరునున హోరెత్తించిన ఐపాక్ వ్యవస్థాపకుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా గుర్తుకు వచ్చారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పీకేను ఆశ్రయించిన జగన్.. తన పార్టీకి కూడా వ్యూహాలు రచించి ఇవ్వాలని, అందుకోసం ఎంత మొత్తం నిధులైనా వెచ్చించేందుకు తాను సిద్ధమని చెప్పేశారు. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉండగానే.. ఇలా వచ్చిన బంపర్ ఆఫర్ ను పీకే క్షణాల్లోనే ఓకే చేశారు. ఆ వెంటనే రంగంలోకి దిగిపోయారు కూడా. ఆ తర్వాత వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే వారి జాబితాను తీసుకున్న పీకే.. వారిని వైసీపీ వారియర్స్గా అభివర్ణిస్తూ రంగంలోకి దింపేశారు. వెరసి వైసీపీ సోషల్ మీడియా వింగ్ను పీకే ఓ రేంజిలో బలోపేతం చేశారు. ఆ వింగ్ వేసిన జాకీలతోనే 2019 ఎన్నికల్లో జగన్ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టేసింది. వెరసి తాను అనుకున్న ఫలించగానే.. సీఎం కుర్చీ ఎక్కేసిన జగన్.. తనకు జాకీలేసి లేపిన సోషల్ మీడియాను మాత్రం పట్టించుకోలేదనే చెప్పాలి.
ఈ అవార్డులు లక్ష్యమిదే
తాజాగా 2019 ఎన్నికల్లో తన పార్టీ గెలుపు కోసం పనిచేసిన సోషల్ మీడియా యాక్టివిస్టులకు ‘వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వారియర్స్’ పేరిట ప్రత్యేకంగా మెమొంటోలను రూపొందించి ఆయా యాక్టివిస్టులకు పంపిణీ చేయడం జగన్ ఇప్పటికే మొదలెట్టారు. ఈ మెమొంటోలు ఇప్పటికే చాలా మందికి చేరిపోయాయి కూడా. ఈ మెమొంటోలను అందుకున్న ఓ యాక్టివిస్టు.. అత్యుత్సాహంతో దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైసీపీ ప్రీప్లాన్ను బట్టబయలు చేశారు. సీఎంగా జగన్ రెండున్నరేళ్ల పాలనను పూర్తి చేసుకోకుండానే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అదే సమయంలో టీడీపీ సోషల్ మీడియా అంతకంతకూ యాక్టివ్గా మారిపోతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మున్ముందు తనకు మరింత ముప్పేనని 2024 ఎన్నికల్లో తాను గెలవడం కష్టమేనని జగన్ గ్రహించారట. ఈ భావన వచ్చిందే తడవుగా.. మరోమారు పీకేను రంగంలోకి దించేసిన జగన్.. పీకే టీమ్తో పాటు తన పార్టీ సోషల్ మీడియా వింగ్లో పనిచేసిన వారందరికీ మెమొంటోలను పంపుతూ వారిని కూడా రంగంలోకి దించే పనిని మొదలుపెట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వారియర్స్ వస్తారా?
జగన్ ఎన్ని ప్లాన్లు వేసినా.. గతంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారు ఇప్పుడు పార్టీ నుంచి పిలుపో, లేదంటే మెమొంటోనో వచ్చినంతనే తిరిగి యాక్టివేట్ అవుతారా? అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ అంటే విపరీతమైన అభిమానంతోనే గతంలో పీకే టీమ్ ఆశ్వానం పలకగానే వారంతా పార్టీ సోషల్ మీడియా వింగ్లోకి వచ్చి చేరారని, వారి జీవనోపాధిని కూడా వదులుకుని మరీ శక్తివంచన లేకుండా పనిచేశారని వైసీపీ అనుకూల వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు కూడా జగన్ పిలవంగానే వారంతా తిరిగి క్రియాశీలకం అవుతారని కూడా వారు వాదిస్తున్నారు. అయితే 2019 ఎన్నికలు ముగియగానే.. తమను పూచిక పుల్లల్లా చూసిన జగన్.. పార్టీకి పనిచేసిన కారణంగా తమపై కేసులు నమోదు అయినా తమను పట్టించుకోలేదని వారియర్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఈ నేపథ్యంలో వారియర్స్లో మెజారిటీ మంది పార్టీకి దగ్గరయ్యే సమస్యే లేదని వాదిస్తున్నారు.
అన్నీ చేదు జ్ఞాపకాలేగా
నాడు జగన్ తరఫున పీకే టీమ్ ఆహ్వానం అందగానే.. ఎక్కడో బెంగళూరులో ఏదో సాఫ్ట్ వేర్ సంస్థలో కీలక స్థానంలో ఉద్యోగం చేస్తున్న తిరుపతికి చెందిన ఓ యువకుడు ఆ ఉద్యోగాన్ని వదిలేసి మరీ వైసీపీ విజయం కోసం పని చేశారు. అయితే ఆ తర్వాత అతడు తీవ్ర అనారోగ్యానికి గురైతే.. పట్టించుకున్న నాథుడే లేకపోయాడు. ఈ క్రమంలో అతడు చనిపోయినా కూడా వైసీపీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ ఘటనపై వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులంతా నిరసన వ్యక్తం చేయగా.. జగన్ కేవలం ఓ సంతాప ప్రకటనను విడుదల చేసి చేతులు దులుపుకున్న తీరు కూడా ఇప్పటికీ వారికి గుర్తుకు వస్తూనే ఉందట. ఇక జగన్ సీఎం అయ్యారని, తాము ఏం చేసినా తమకేమీ కాదన్న రీతిలో మొన్నామధ్య హైకోర్టు న్యాయమూర్తులపైనా కొందరు దూషణలతో కూడిన కామెంట్లు చేశారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయడం, సీబీఐ ఏకంగా ఆరుగురిని అరెస్ట్ చేసిన వైనం తెలిసిందే కదా. ఈ ఉదంతంలోనూ వీరికి కనీసం న్యాయ సహాయం కూడా చేసేందుకు వైసీపీ ముందుకు రాలేదట. ఈ అంశాలన్నింటినీ గుర్తు చేసుకుంటున్న వైసీపీ సోషల్ మీడియా వారియర్స్.. తమను యోధులుగా ప్రకటించి ఆకాశానికెత్తేసినా.. మెమొంటలతో దువ్వినా వైసీపీ దరి చేరేందుకు సిద్ధంగా లేరన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Must Read ;- ఆ ఇద్దరి ఎంట్రీతో సాయిరెడ్డికి కత్తెర











