అభినయంలో ఆమెకు ఆమే సాటి.. అయినా ఆమె సూపర్ స్టార్ కాలేదు.. కోట్లు కూడబెట్టలేదు.. ఈరోజున కూటిన మొహం వాస్తోంది. ఇంకెవరు ఆమె పావలా శ్యామల. ‘ఇంటి పేరు కస్తూరివారు ఇంట్లో గబ్బిలాల కంపు’ అన్న చందంగా ఆమె పరిస్థితి తయారైంది. ఆమె అసలు పేరు నేతి శ్యామల.
ఆమె ఇంటి పేరులోని నెయ్యి నేతి బీర చందమే. కరోనా పుణ్యమా అని పస్తులతోనే కాలం గడపాల్సి వస్తోంది. ఆమె ఒకనాడు నాటక రంగాన్ని శాసించింది.. సినిమా రంగాన్ని శ్వాసించింది. అయినా పూట గడవడమే గగనంగా ఉందామెకు. ఇప్పుడు కరోనా అనే కాదు.. సినిమా రంగంలోనూ ఆమెది ఒడుదొడుకుల జీవితమే. నటనలో అందెవేసిన చేయి అయినా వేషాలు దొరికితేనే ఇల్లు గడిచేది. ఈరోజున దయనీయమైన స్థితిలో కాలం గడుపుతోంది. అమాయకురాలైన కూతురుతో ఎంతో కాలంగా ఒంటరి జీవితాన్ని ఆమె గడుపుతోంది.
ఆమెకు ఆత్మాభిమానం ఎక్కువ.. సాయం చేయబోయి డబ్బులు ఇస్తే తీసుకునేది కూడా కాదు.. కుదిరితే వేషం ఇప్పించమని అడిగేది. ఈరోజున ఇంటి అద్దె కూడా కట్టలేని దీన స్థితిలో ఆమె ఉంది. ఆమె సినిమా కష్టాల జీవితం అంతా నాటకీయంగానే సాగింది. నాటకాల పిచ్చి ‘పావలా’ అనే ఇంటి పేరును ఇచ్చింది. గణేష్ పాత్రో రాసిన పావలా అనే నాటకంలో ఆమె పోషించిన పాత్ర ఆ పావలానే ఇంటి పేరును చేసింది. ఇవాళ పావలా లేకపోయినా పావలా శ్యామల మాత్రం మనముందే ఉన్నా ఏమీ చేయలేని దుస్థితి.
ఆమె జీవితమే ఓ నాటక రంగం
శ్యామల సొంతూరు గుంటూరు జిల్లా అమరావతి. తండ్రి వ్యాపారం నిమిత్తం వివిధ పట్టణాల్లో ఉండాల్సి వచ్చేది. అలా ఆమె జీవితం కూడా అన్ని ఊళ్లూ తిరగాల్సి వచ్చింది. అప్పట్లో కళలంటే స్త్రీలు కూడా ఆసక్తి చూపేవారు కాబట్టి చిన్నప్పటి నుంచే నాటికలపై ఆసక్తి ఏర్పడింది. లయన్స్ క్లబ్ ఆమెను ప్రోత్సహించేది. కానీ 13 ఏళ్లకే పెళ్ళయ్యింది. ఆ తర్వాత మూడేళ్లకే భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటికే ఒక కూతురు ఉంది. కాబట్టి నాటకాల్లో వేషాలు వేస్తూ కుటుంబాన్ని పోషించాల్సి వచ్చింది. అలా అప్పట్నుంచి నాటకాలు, సినిమాలు, టీవీ సీరియల్స్.. ఇలా ఆమె జీవితం సాగిపోయింది. కూతురు కూడా మానసికంగా ఎదగలేదు.
‘చదువుకునే వయసులో నా బిడ్డ మేడపై నుంచి కిందపడింది. తలకి గాయమై పెద్ద నరం చిట్లిపోయింది. దాంతో జ్ఞాపకశక్తి పోయింది. విశాఖపట్నంలో ఉన్న ఇంటిని అమ్మి పాపకు చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. పావుగంటకోసారి కళ్లు తిరిగి పడిపోతుంది. చివరకు మందులు కూడా పని చేయడం లేదు. ఇంతకంటే బాగు చేయడం కష్టమని డాక్టర్లు అన్నారు. నేను సంపాదించిన డబ్బులన్నీ నా కూతురు కోసమే ఖర్చు చేశా’ అందామె ఓ సందర్భంలో. ఒంటరిగా కూతురును తీసుకుని వేషాలు వెతుక్కుంటూ ఆమె చాలా కష్టాలు పడింది.
నాటకాల్లో నటించేటప్పుడు వెలివేసిన బంధువులు సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు దగ్గరయ్యారట. మళ్ళీ కష్టాలు మొదలవ్వడంతో మొహం చాటేశారట. ‘మమ్మల్ని పలకరించే దిక్కు లేదు. ఇంటి అద్దె కట్టలేకపోతున్నాం. ఓనర్ అద్దె కట్టకపోతే ఖాళీ చేయమంటున్నాడు. నా కిడ్నీలు పాడై మంచంలో ఉన్నా. ఆ సమయంలో ఇంటి ఓనర్ కరెంటు, నీళ్ళు ఇవ్వలేదు. ఆ సమయంలో దిల్రాజు 50 వేలు ఇస్తే పాత బాకీ కట్టి వేరే ఇంటికి మారా’ అంటూ వాపోయింది శ్యామల. సినిమా రంగంలో ఇబ్బందుల్లో ఉన్న కళాకారులను ఆదుకోడానికి మా అసోసియేషన్ కూడా ముందుకు రావడం లేదు.
ఏవీఎస్ మా సెక్రటరీ గా ఉన్న సందర్భంలో సినీ కళాకారుల సంక్షేమం కోసమంటూ తారల క్రికెట్ నిర్వహించి దండిగా డబ్బులు వసూలు చేశారు. అప్పుడు కూడా మా అసోసియేషన్ దృష్టికి శ్యామల కష్టాలు వచ్చినా స్పందన మాత్రం లేదు. నువ్వు సభ్యురాలివి కాదు కాబట్టి తామేమీ చేయలేమని చేతులెత్తేశారట. ‘ఈ ప్రపంచంలో మహిళ ఒంటరిగా బతకడమంటే చాలా కష్టం. పైగా ఓ చంటి పిల్లతో. మనం ఏదో ఒక విధంగా బతకాలనుకున్నా సమాజం బతకనివ్వదు. సినిమా వాళ్ళకు ఇల్లు అద్దెకివ్వరు. మొగుడు లేడంటే అసలే ఇల్లు ఇవ్వరు.
Must Read ;- ఫ్లూటు జింక ముందా?.. ప్లూటో కరోనా ముందా.. ఏది మందు?
కూతురి కోసమే బతుకు పోరాటం
ఇలా చాలా అవమానాలు తట్టుకున్నా. చనిపోవాలనిపించినా నా కూతురు నా కాళ్ళకు బంధాలు వేసేది. ఆమె కోసమే బతుకుతున్నా. ఎప్పుడు పోతానో నాకే తెలియదు.. నేను పోతే నా కూతురుకు దిక్కెవరు?’ అంటోందామె. నటిగా ఎవరూ అందుకోలేనన్ని అవార్డులను ఆమె నాటక రంగంలోనే అందుకున్నారు. శ్యామల తొలినాటకం ‘దొంగాటకం’. ఈ తొలినాటకమే ఉత్తమ నటి అవార్డును తెచ్చిపెట్టింది. రెండో నాటకం ‘పావలా’. ఈమె నుంచి ఈ పాత్రనూ, పాత్ర నుంచి ఈమెనూ విడగొట్టి చూడలేం. అందుకే నాటకాభిమానులు పావలా శ్యామల అనే పేరు ఇచ్చేశారు.
ఒక్క పావలా లోని పాత్రకే ఆమె 200 అవార్డులు తీసుకుందంటే ఆ నాటకం ఎన్ని ప్రద్శనలు జరిగిందో ఊహించుకోవచ్చు. నాటకంలోగాని, సినిమాలోగాని ఈమె డైలాగ్ చెబితే ఎంతో సహజంగా ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా సినిమాలో బ్రహ్మానందంతో ఈమె కామెడీ సన్నివేశం ఎంతలా కడుపుబ్బ నవ్వించిందో అందరికీ తెలుసు. ఛాలెంజ్, స్వర్ణకమలం, సుస్వాగతం, మనసంతా నువ్వే, ఖడ్గం, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దాంటానా, గోలీమార్.. ఇలా ఎన్నో సినిమాల్లో ఆమె నటించి మెప్పించింది.
పావలా శ్యామల కిడ్నీలకు ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. ఆస్పత్రిలో చేరడానికి డబ్బుల్లేని సమయంలో పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ షూటింగ్ దగ్గరకు వెళితే ఆయన లక్షరూపాయలు ఇచ్చి సాయం చేశారట. అలా ఆస్పత్రిలో చేరింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కరుణతో పది వేల పెన్షన్ వస్తోందట. ఆ పది వేలు ఇంటి అద్దె, కరెంటు, వాటర్ బిల్లులకే సరిపోతుందట. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేసినా ఇంకా ఇవ్వలేదట. సీఎం కేసీఆర్ ఆమెపై మరోసారి దయచూపితే కనీసం ఇల్లయినా దక్కుతుంది.అమెరికా నుంచి అజరురెడ్డి లక్ష రూపాయల సాయం చేశారట. అలాగే బండ్ల గణేష్ కూడా తనను కొంత ఆదుకున్నారని ఆమె అంటోంది.
ప్రస్తుతం ఆమె వయసు మీద పడటం, అనారోగ్యం కారణంగా సినిమా పరిశ్రమకు దూరమైంది. పైగా కరోనా కూడా కావడంతో బతుకు దుర్భరంగా మారింది. ఆమె విషయం తెలుసుకున్న నటి కరాటే కళ్యాణి ఆమె ఇంటికి వెళ్లి పది వేల రూపాయలు అందజేశారు. దాదాపు ఐదు రోజులుగా ఆమె పస్తులున్నట్లు తెలిసి కళ్యాణి చలించిపోయారు. ఎస్.ఆర్.నగర్ బీకేగూడలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. తలాకొంత సాయం చేయడంతో పూట గడుస్తోందని, తనకూ, కూతురికీ కలిపి మందుల కోసం నెలకు రూ.10 వేల వరకూ ఖర్చవుతోందని ఆమె తెలిపింది.
పావలా శ్యామలకు ప్రతి నెలా వచ్చే ఫించన్ కూడా ఇప్పుడు రావడం లేదట. కరోనా వల్ల ఎవరూ సాయం చేయడం లేదట. కూతురు కూడా 18 నెలలుగా అనారోగ్యంతో మంచం పట్టిందట. పావలా శ్యామల కష్టాలు చూస్తుంటే పగవాడికి కూడా ఇలాంటి దుస్థితి రాకూడదని అనిపిస్తోంది కదూ. మానవత్వంలో ఈమె ఎవరైనా సాయం చేస్తే అంతకన్నా కావాలసింది ఏముంటుంది. ఇదీ పావలా శ్యామల జీవితం.
-హేమసుందర్ పామర్తి
Also Read ;- సినీ అభ్యుదయ గేయరచయిత అదృష్టదీపక్ కన్నుమూత