Telangana Political Scenario :
ఇప్పటి వరకు స్థబ్తుగా ఉన్న తెలంగాణ రాజకీయాలు ఈ నెల నుంచి హాట్ హాట్గా మారనున్నాయి. అన్ని పార్టీల వారు 2023 ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా వ్యూహ రచన చేస్తూ ప్రజల మందుకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రదాన పార్టీలైన టీఆర్ఎస్,బీజేపీ, కాంగ్రెస్లతో పాటు వైఎస్ షర్మిల కూడ కొత్త పార్టీతో తెలంగాణలో ఎంటరవుతున్నారు. టీడీపీ ఉన్నప్పటికీ ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు. ప్రత్యర్థుల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా ఎంచుకుని అన్ని పార్టీలు ప్రజల్లో పట్టు సాధించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా వైరి పక్షాలను ఇరుకున పెడుతూ ఆధిపత్యం సాధించటానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా వచ్చే సాధారణ ఎన్నికల వరకు రాజకీయాలు కొనసాగే అవకాశాలున్నాయి.
పట్టు సడలకుండా టీఆర్ఎస్
ఏడేళ్లకు పైగా తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పట్టు సడలకుండా పయత్నిస్తోంది. దుబ్బాకలో ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వెనుక బాటు తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు,నాగార్జునసాగర్లో విజయంతో తమకు తిరుగేలేదనుకొంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరడంతో కొంత ఢిఫెన్స్లో పడింది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటలను ఓడించాలన్న పట్టుదలతో ఇప్పటి నుంచి అక్కడ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. రేవంత్ను టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించగానే కేసీఆర్ వైఖరిలో కొంత మార్పు వచ్చిందన్న వాదనలు ఉన్నాయి. ఇప్పటి వరకు పట్టించుకోని ఉద్యోగులు, నిరుద్యోగ యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది.
టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమంటూ బీజేపీ
దుబ్బాకలో గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాల తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయ మంటూ బీజేపీ జబ్బలు చరిసింది. అయితే ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఎన్నికల్లో పరాజయంతో ఢీలా పడింది. దీంతో బీజేపీది బలుపు కాదు వాపే అన్న విమర్శలు మొదలయ్యాయి. దీంతో ప్రజల్లో పట్టు సాధించేందుకు అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 9 నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈటల వ్యక్తిగత ఇమేజ్కు పార్టీ బలం కూడ తోడై హుజురాబాద్లో విజయం సాధిస్తే మళ్లీ పార్టీలో జోష్ నెలకొనే అవకాశం ఉంది.
డీలా పడిన కాంగ్రెస్కు రేవంత్తో ఊపిరి
2018 సాధారణ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ పూర్తిగా డీలా పడింది. ప్రజల్లో మంచి పట్టు ఉండి మాటలతో ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియతులవడంతో కాంగ్రెస్ క్యాడర్లో జోష్ పెరిగింది. ఈ రోజు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న రేవంత్ ఇక తనదైన స్టైల్లో ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతూ, ప్రజల్లో పట్టు సాధించటానికి కృషి చేయనున్నారు. రేవంత్ పగ్గాలు చేపట్టిన తర్వాత గతంలో కంటే తెలంగాణలో కాంగ్రెస్ మెరుగు పడుతుందనడటంలో ఎలాంటి సందేహం లేదు.
రాజన్న రాజ్యమంటూ షర్మిల
తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామంటూ మాజీ సీఎం,దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల రేపు కొత్త పార్టీకి శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. వైఎస్ అభిమానులకు న్యాయం చేసేందుకు ఆమె పార్టీ పెడుతున్నట్లు చెబుతున్నా అధికార పార్టీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకే ఆమెతో పార్టీ పెట్టిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కేసీఆర్, రేవంత్రెడ్డిలపై ఆమె ఎంత ఘాటుగా విమర్శలు చేసినా ఓట్లను ఏమాత్రం రాబట్టుకుంటారనేది ఏదైనా ఎన్నికల్లో తేలేది.
ఇలా మొత్తం మీద ఈ రెండున్నరేళ్లు తెలంగాణలో రాజకీయాలు రంజురంజుగా మారనున్నాయి.
Must Read ;- రేవంత్ స్టైల్.. కాంగ్రెస్కు టానిక్ ప్లాన్!