దేశంలోని పలు వ్యవస్థలను దశలవారీగా ప్రస్తావిస్తూ.. ఆయా వ్యవస్థలపై సమయానుకూలంగా స్పందిస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ తనదైన శైలి ధర్మాగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కేసుల దర్యాప్తులో కీలక సంస్థలే బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ ఎన్వీ.. ప్రజా ప్రతినిధులపై నమోదవుతున్న కేసుల విచారణల్లో చోటుచేసుకుంటున్న జాప్యంపైనా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దేశంలో కొత్తగా రూపుదిద్దుకుని.. చట్టసభల్లో చర్చలు లేకుండానే అమల్లోకి వచ్చేస్తున్న కొత్త చట్టాలపై జస్టిస్ ఎన్వీ రమణ తనదైన శైలి ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సరిగ్గా దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టులో జాతీయ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన చేయడం గమనార్హం.
జస్టిస్ ఎన్వీ ఏమన్నారంటే..?
జాతీయ జెండా ఆవిష్కరించిన సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ‘‘చట్టాలను సరిగ్గా తయారు చేయడం లేదు. వాటిపై సరైన చర్చలూ జరగడం లేదు. దేశంలో ఇది అత్యంత దారుణమైన విషయం. నేటి ప్రభుత్వాలు చేస్తున్న చట్టాల్లో ఎన్నెన్నో లోపాలుంటున్నాయి. దాని వల్ల ప్రజలు, కోర్టులు, ఇతర భాగస్వాములకు ఇబ్బందులు కలుగుతున్నాయి. చట్టాల రూపకల్పనలో ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. అసలు చట్టాలను తయారు చేసే ఉద్దేశమేంటో కూడా తెలియడం లేదు. దేశ స్వాతంత్య్రోద్యమం నుంచి దేశ తొలి చట్టసభ ప్రతినిధుల దాకా న్యాయవాదులు ఎనలేని కృషి చేశారు. ఆనాడు చట్టసభల్లో న్యాయవాదులు ఎక్కువగా ఉండేవారు. సభలో చర్చలు అర్థవంతంగా, నిర్మాణాత్మకంగా సాగేవి. తీసుకురాబోయే చట్టాలపై సవివరాలతో చర్చ జరిగేది. అయితే, కాలం మారుతున్నకొద్దీ అది మొత్తం మారిపోయింది. చర్చల్లో పస ఉండడం లేదు. అసలు ఆ చట్టాల ఉద్దేశం కోర్టులకూ తెలియడం లేదు. వాటికి అభ్యంతరం చెప్పే అధికారమూ కోర్టులకు లేకుండా పోయింది. కాబట్టి ఇక నుంచి న్యాయవాదులంతా ఇళ్లకే పరిమితం కాకుండా ప్రజాసేవకూ ముందుకు రావాలి. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ వంటి మహామహులు న్యాయవాదులే’’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
మోదీ సర్కారు మేల్కొంటుందా?
దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జస్టిస్ ఎన్వీ రమణ చేసిన ఈ వ్యాఖ్యలు నరేంద్ర మోదీ సర్కారును ఉద్దేశించినవేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. మోదీ సర్కారుతో పాటు పార్లమెంటు సమావేశాల్లో ఆయా అంశాలపై చర్చలకే అవకాశం లేకుండా నిరసనలకు దిగిన విపక్షాలకు కూడా జస్టిస్ ఎన్వీ రమణ చురకలు అంటించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. చట్టాలను రూపొందిస్తున్న మోదీ సర్కారు వాటిపై చర్చలు లేకుండానే అమలులోకి తీసుకొస్తున్న వైనాన్ని ప్రధానంగా ప్రస్తావించిన జస్టిస్ ఎన్వీ రమణ.. ఆయా అంశాలపై జరుగుతున్న నిర్ణయాలపై చర్చలు జరిగేలా వ్యూహాలు రచించడంలో విపక్షాలు కూడా విఫలమవుతున్న వైనాన్ని తూర్పారబట్టారనే చెప్పాలి. సరిగ్గా భారత స్వాతంత్య్ర దినోత్సవం సందేశంగా సీజేఐ హోదాలో జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు ఇటు మోదీ సర్కారుతో పాటు అటు విపక్షాలూ మేల్కొంటాయా? అన్న దిశగా ఆసక్తికర చర్చ నడుస్తోంది.
Must Read ;- జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాగ్రహంతోనైనా సీబీఐ మారాలి