వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఎడాపెడా ప్రజలకు నిధులు పంచిపెట్టే పథకాలతో దూసుకువెళ్లిపోతున్నదనే సంగతి అందరికీ తెలుసు. సాధారణంగా ప్రభుత్వం వద్ద పుష్కలంగా నిధులు ఉన్నప్పుడు.. ఇలాంటి సొమ్ము వితరణ పథకాలు ఎన్ని ప్రారంభించినా వాటి గురించి పట్టించుకునే వారెవ్వరూ ఉండరు. కానీ.. ఖజానా ఖాళీగా ఉండగా.. నెలవారీగా సంక్షేమ పథకాల ముసుగు కింద పంచిపెట్టాల్సిన సొమ్ములే వేల కోట్ల రూపాయలకు మించుతున్నప్పుడు.. రాష్ట్రం పరిస్థితి ఎటు పోతుందోనని ఎవ్వరికైనా భయం కలుగుతుంది. ‘మరి ప్రభుత్వం నిధుల కోసం ఏం చేస్తోంది?’ ఈ ప్రశ్నకు సమాధానంగా వివిధ శాఖలకు చెందిన సొమ్ములను పథకాలకోసం మళ్లిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వంనుంచి నిర్దిష్టంగా కొన్ని పథకాల అమలు కోసం విడుదల అవుతున్న నిధులను కూడా.. దారి మళ్లించి.. తాము తలపెట్టిన వాటికోసం ఖర్చు చేస్తున్నారని.. దీనివల్ల అంతిమంగా సంతులత దెబ్బతింటుందనే వాదనలు కూడా ఉన్నాయి. కానీ ప్రభుత్వానికి వేరే గత్యంతరం లేదు. నిధులు ఖాళీ అవుతున్నాయి. అప్పులు పుట్టే పరిస్థితి కూడా సన్నగిల్లిపోతోంది. అందుకే ఇతర శాఖల్లో ఇతర వనరుల నుంచి వచ్చిన నిధులను కూడా తాము డబ్బులు పంచిపెట్టే సంక్షేమ పథకాలకు పెట్టేస్తోంది.
చివరికి దేవుడి సొత్తుకూ టెండర్!
ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పథకం పేరిట ఒక స్కీం ప్రారంభించింది. పేదలకు ఆర్థికంగా చేయూత అందించడం, ఆ నిధులను వారు ఎందుకోసమైనా ఖర్చు చేసుకోవచ్చు అని వెసులుబాటు ఇవ్వడం ఈ పథకం లక్షణం. అయితే ఇందుకోసం దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన నిధులను మళ్లించడమే వివాదం అవుతోంది. ఏకంగా సుమారు 15 కోట్ల రూపాయలను ఆసరా పథకం కోసం మళ్లిస్తూ విడుదలైన ఉత్తర్వులు ఇప్పుడు బయటకు లీక్ అయ్యాయి.
దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటే.. అచ్చంగా దేవుడి సొత్తు అనే అర్థం. రాష్ట్రంలోని అనేక దేవాలయాల ద్వారా సమకూరే ఆదాయమే ఈ శాఖ ఖాతాల్లో ఉంటుంది. ఈ శాఖ కు ప్రభుత్వం ప్రకటించిన వైఎస్సార్ ఆసరా పథకానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా సరే.. ఆసరా పథకాన్ని ప్రారంభించినప్పుడే.. ఈ శాఖ నుంచి కూడా నిధులు మళ్లించారు.
వైఎస్సార్ ఆసరా పథకానికి సంబంధించి సెప్టెంబరు 7వ తేదీన ఫైనాన్స్ శాఖ విడుదల చేసిన జీవో ప్రకారం.. సెప్టెంబరు 8న రెవెన్యూ శాఖ ఈ నిధులను మళ్లించే ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు కాస్త ఆలస్యంగా వెలుగుచూశాయి. వైఎస్సార్ ఆసరా పథకం ఖర్చుల కోసం 14.99 కోట్ల రూపాయలు మళ్లించారు. ఈ సొమ్మును ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కొర్పారేషన్కు ఖాతాకు బదలాయించాల్సిందిగా ఉత్తర్వులు వచ్చాయి.
దేవుడి సొత్తు 15 కోట్ల రూపాయలు తీసేసుకున్నారనే విమర్శలు రాకుండా.. ఈ సొమ్మును బ్రాహ్మణ కార్పొరేషన్ ముసుగులో తీసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆసరా పథకం అని పేరు పెట్టినప్పుడు అందుకు నిధులకోసం వివిధ ప్రభుత్వ శాఖలనుంచి నిధులను సమీకరించడం వేరు. అంతో ఇంతో ఆయా శాఖల కార్యకలాపాలకు కొంత సారూప్యత ఉంటంది. కానీ.. ఎలాంటి సంబంధం లేని దేవాదాయ శాఖ నుంచి బ్రాహ్మణ కార్పొరేషన్ పేరుతో నిధులు మళ్లించడం ఏమిటో ఏలినవారికే తెలియాలి.
Must Read ;- అమూల్ ఎక్కువ ధర చెల్లించడం పచ్చి అబద్ధం
ఇప్పటికే ఆరోపణలు అనేకం
ఏపీలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తాము సంక్షేమంగా భావించిన కొన్ని తరహా పథకాలకోసం విచ్చలవిడిగా నిర్ణయాలు తీసుకుంటున్నదనే విమర్శలు చాలా ఉన్నాయి. చివరికి ఉపాధిహామీ పనులు, ఇతరత్రా కేంద్రంనుంచి విడుదల అయ్యే అనేక పథకాలకు సంబంధించిన నిధులను కూడా.. గుట్టు చప్పుడు కాకుండా.. సొమ్ము పంచి పెట్టే పథకాలకే ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా కేంద్రనిధులను అవి ఉద్దేశించిన వాటికోసం కాకుండా, ఇతర పథకాలకు తరలిస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు పలు సందర్భాల్లో ఆరోపించారు. కేంద్రానికి లేఖలు కూడా రాసిన సందర్భాలున్నాయి. ఆ క్రమంలో దేవాదాయ శాఖ సొమ్ములను కూడా మళ్లించిన వైనం ఇది. ఈ ఉత్తర్వులు బయటకు రావడంతో ప్రభుత్వం కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టుకున్నట్టు కనిపిస్తోంది.
Also Read ;- ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సస్పెన్షన్.. కారకుడిని వదిలేశారని పూజారుల అసంతృప్తి