ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పేదవారికి సెంటు భూమి పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబరు 25న రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. కోర్టు స్టే ఉన్న ప్రాంతాలను మినహాయించి, మిగిలిన చోట్ల స్థలాలు పంపిణీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. డి ఫామ్ పట్టా ద్వారా ఇంటి స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన రోజునే, తొలి దశలో 15 లక్షల ఇళ్ల నిర్మాణాలకు కూడా శంకుస్థాపన చేయాలని సీఎం నిర్ణయించారు.
అనేక వివాదాలు దాటుకుని…
పేదవాడికి సెంటు భూమి పంపిణీ అనేక అవాంతరాలు దాటుకుని ఎట్టకేలకు పట్టాలెక్కిందనే చెప్పాలి. ఈ పథకం కోసం ఏపీ ప్రభుత్వం రూ.7 వేల కోట్లతో 24 వేల ఎకరాల భూమి కొనుగోలు చేసి, మట్టి రోడ్లు వేసింది. ఇంటి స్థలం పొందిన పేదలు అమ్ముకునేలా పట్టా ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అయితే దీనిపై కొందరు కోర్టులను ఆశ్రయించడంతో సెంటు భూమి పంపిణీకి బ్రేకులు పడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లోని భూములు వివాదాల్లో ఉండటం, దేవాదాయ శాఖ భూములను పంచవద్దని కోర్టు ఆదేశాలు జారీచేయడంతో సెంటు భూమి పంపిణీ నిలిచిపోయింది. కోర్టు వివాదాల్లో ఉన్న వాటిని మినహాయించి, డి ఫామ్ పట్టా ఇవ్వడానికి కోర్టులకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. దీంతో ఏపీ ప్రభుత్వం డి పామ్ ద్వారా పేదలకు సెంటు భూమి ఇవ్వాలని తాజాగా నిర్ణయించింది.
ఎందుకీ దూకుడు
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఫిబ్రవరిలో ఎన్నికలుంటాయని కమిషనర్ ఇప్పటికే ప్రకటించారు. ఎన్నికలకు నాలుగు వారాల ముందు నుంచి కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించారు. కోడ్ అమల్లోకి వచ్చేలోగా ప్రభుత్వం ఇంటి స్థలాలు కేటాయించడం ద్వారా స్థానిక ఎన్నికల్లో విజయానికి మార్గం సుగమం చేసుకోవాలని వైసీపీ అధినేత భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Must Read ;- భూముల స్వాహాకు పథకం.. ఆక్రమణలు, బదలాయింపులంటూ చర్యలు