ఆడబిడ్డలకు రక్షణ కరువవుతోంది. అన్నెంపున్నెం ఎరుగని పసికందులనూ వదలట్లేదు కర్కోటకులు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు.. చోద్యం చూస్తున్నారు. కాపాడాల్సిన ప్రభుత్వాలు చట్టాలు చేసి మిన్నకుండిపోతున్నాయి. పోక్సో లాంటి పటిష్ఠమైన చట్టాలున్నా.. అతిక్రమణకు అడ్డదారులెన్నో..! నిందితులను కఠినంగా శిక్షించడం ద్వారా.. చిన్నారుల వైపు కన్నెత్తి చూడాలన్నా.. కామాంధులకు వెన్నులో వణుకు పుట్టేలా చేయాల్సిన కోర్టులు.. చివరికి వారికే వంత పాడుతున్న వేళ.. పసి మొగ్గలకు భద్రతెక్కడ?
హవ్వా! ఏంటీ తీర్పులు..
‘బాలిక ఛాతీ భాగాన్ని తాకడం లైంగిక వేధింపుల కిందికి రాదు. బాలిక వేసుకున్న టాప్ ను తొలగిస్తే, ఆమె దుస్తుల్లోకి తన చేతిని చొప్పిస్తే మాత్రమే లైంగిక వేధింపుల కిందికి వస్తుంది. అంతేగానీ, నేరుగా శారీరక స్పర్శ లేని చర్య లైంగిక వేధింపుల కిందికి రాదు. కామ దృష్టితో చర్మాన్ని చర్మంతో స్పృశించడాన్ని మాత్రమే వేధింపులుగా పరిగణనలోకి తీసుకుంటాం. మిగిలిన చర్యలన్నీ వేధింపులు కావు’ ఇది.. ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పు. ఓ 12 ఏళ్ల బాలికను లైంగిక వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలతో జైలు శిక్ష పడిన ఓ వ్యక్తి కేసును విచారించిన జస్టిస్ పుష్ప నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ నెల 17న వెలువరించిన తీర్పు. ఇదే జడ్జి.. ఇలాంటి తీర్పే.. అంతకు కొద్ది రోజుల ముందు మరొకటి వెలువరించారు. ‘బాలిక ముందు ప్యాంటు జిప్పు విప్పడం.. ఆమె చేయి పట్టుకోవడం లాంటి చర్యలు పోక్సో చట్టం పరిధిలోకి రావు’ అని తీర్పు చెప్పి నిందితుడిపై మోపిన పోక్సో సెక్షన్లను కొట్టేశారు. గత ఏడాది ఓ 50 ఏళ్ల వ్యక్తి ఓ ఐదేళ్ల బాలిక ముందు ప్యాంటు జిప్పు విప్పి, చేయి పట్టుకున్న కేసులో జస్టిస్ పుష్ప.. ఈ తీర్పునిచ్చారు.
Must Read ;- లిఫ్ట్ ఇస్తామని తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు
చర్మాన్ని తాకకుండా ఏదైనా చేయచ్చా..
ఓ మగ జడ్జి ఈ తీర్పునిచ్చి ఉంటే.. జాతి పక్షపాతం అని అనుకోవచ్చు. కానీ, దురదృష్టవశాత్తూ ఈ తీర్పునిచ్చింది ఓ మహిళా జడ్జి. ఆమెకు ఆ రెండు కేసుల్లోనూ నిందితులు చేసిన చర్యలు నేరంగా కనిపించలేదు. అంటే.. జడ్జిగారి దృష్టిలో బాలికల చర్మాన్ని ముట్టుకోకుండా ఏమైనా చేయొచ్చా? ఇది పరోక్షంగా అత్యాచారాలను ప్రేరేపించడం కాదా? ఈ రోజుల్లో జరుగుతున్న లైంగిక నేరాల్లో సగానికి పైగా మొదటి కేసులో లాంటి నేరాలే! మరి అది నేరం కాదంటే.. వారి తర్వాతి చర్య అత్యాచారమేగా! అది కూడా జరిగిపోయాకే నిందితుడిని శిక్షిస్తారా! అప్పటివరకు అలాంటి వారినందరినీ వదిలేస్తూ పోతారా? నిజానికి ఇవి.. దేశం సిగ్గు పడాల్సిన తీర్పులు. ఇప్పటికే పసిమొగ్గలపై జరుగుతున్న అకృత్యాలతో.. ఓ పసి బిడ్డను ముద్దు చేయాలన్నా ఆలోచించాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితుల్లో బతుకుతున్నాం. ఇప్పుడు ఇలాంటి తీర్పులు కూడా వాటికి తోడైతే.. పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ తీర్పును ప్రామాణికంగా తీసుకుని మరికొన్ని కోర్టులు కూడా ఇదే బాట పడితే.. జరిగే నష్టాన్ని ఊహించగలమా?
సుప్రీంకోర్టు ఏం చెబుతోంది..!
ఓ మహిళను ఆమె అంగీకారం లేకుండా.. తదేకంగా చూసినా కూడా నేరమేనని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టంగా చెప్పింది. ముట్టుకోకుండా.. ఆ మహిళ చూసే విధంగా తన అంతర్గత అవయవాలు ప్రదర్శించినా నేరమేనని సుప్రీం తేల్చి చెప్పింది. చూసినా, చూపించినా నేరమైనప్పుడు.. ముట్టుకుంటే నేరం కాదా! చర్మానికి చర్మాన్ని తాకిస్తేనే ముట్టుకున్నట్టని జడ్జిగారు దేన్ని ప్రామాణికంగా తీసుకుని నిర్ణయించారో ఆమెకే తెలియాలి. మరి రెండో కేసులో 5 ఏళ్ల చిన్నారిని 50 ఏళ్ల వ్యక్తి ముట్టుకున్నా ‘పోక్సో’ కాదని తేల్చేశారు. మరి దీనికి ప్రామాణికం ఏంటో జడ్జిగారికే తెలియాలి. గతంలో సుప్రీం చెప్పిన విషయాలను ఆమె ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు!
Also Read ;- మైనర్ బాలికపై అఘాయిత్యం.. నిందితున్ని తప్పించే ప్రయత్నాల్లో అధికార పార్టీ..
స్పందించాల్సిన తీరు ఇదేనా..!
ఓ మహిళ అయి ఉండి.. బాలికలపై జరుగుతున్న అకృత్యాలపై స్పందించాల్సిన విధానం ఇదేనా.. అంటూ మాజీ న్యాయమూర్తులు ఆమె తీర్పులను తప్పుబడుతున్నారు. ఈ వికృతమైన తీర్పులు మరెన్ని అకృత్యాలకు దారితీస్తాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు వెంటనే స్పందించి.. ఈ రెండు తీర్పులను సస్పెండ్ చేయడమే కాకుండా.. ఇలాంటి వికృతమైన తీర్పులిచ్చిన జస్టిస్ పుష్పపై విచారణ జరిపించాల్సిందిగా కోరుతున్నారు. కడుపులో పడ్డప్పటి నుంచే వేధింపులు ఎదుర్కొంటున్న ఆడబిడ్డకు రక్షణ కల్పించాల్సిన కోర్టులే ఇలాంటి తీర్పులిస్తుంటే.. మొత్తంగా న్యాయ వ్యవస్థపైనే నమ్మకం పోయే ప్రమాదం ఉంది.
ఎవరీ జస్టిస్ పుష్ప?
జస్టిస్ పుష్ప వీరేంద్ర గనేడీవాలా.. 1969లో మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించిన ఈమె.. బీకాం, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం చదివారు. 2007లో జిల్లా జడ్జిగా ముంబైలోని సిటీ సివిల్ కోర్టు, జిల్లా ఫ్యామిలీ కోర్టులో పనిచేశారు. ఆ తర్వాత ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిగా నాగ్పూర్ లో, రిజిస్ట్రార్ జనరల్ గా బాంబే హైకోర్టులో పనిచేశారు. 2018లో బాంబే హైకోర్టులో జడ్జిల నియామకం సందర్భంగా వ్యతిరేక నివేదికలు రావడంతో ఆమెను పక్కనబెట్టారు. 2019లో బాంబే హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు.
Also Read ;- వంచనకు గురై.. 18 మంది మహిళలను చంపిన సైకో కిల్లర్!