సినిమా రంగంలో ఓటీటీ అనేది కీలక భూమికకు వేదికైంది. ఒకవిధంగా చెప్పాలంటే సినిమా పరిశ్రమ అంతా ఓటీటీ మయం కాబోతోంది. రాబోయే పది రోజుల్లో 10 భారతీయ చిత్రాలు ఓటీటీలో విడుదల కాబోతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. వీటిలో ఎక్కువగా థియేటర్లో కాకుండా ఓటీటీలోనే విడుదలయ్యేవి ఉన్నాయి. ఈ నవంబరు 19వ తేదీ నుంచి నెలాఖరు వరకూ వరుసగా 10 చిత్రాలు ఓటీటీలో విడుదల కాబోతున్నాయి. నవంబరు 19న ఆరు చిత్రాలు వివిధ ఓటీటీల్లో విడుదల కానున్నాయి.
హిందీ చిత్రం ‘ధమాకా’ 19న నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదల కాబోతోంది. రామ్ మాద్వానీ థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో కార్తీక్ ఆర్యన్ డౌన్ ఆన్ లక్ టీవీ ప్రెజంటర్ అర్జున్ పాఠక్ గా నటించాడు. అతను నిర్వహించిన టీవీ షో ప్రత్యక్ష ప్రసారంలో ముంబయి నగరాన్ని బాంబులతో పేల్చి వేస్తానని ఓ తీవ్రవాది బెదిరించడంతో హీరో ఎలా ప్రతిస్పందించాడు అన్నదే ఈ చిత్ర కథ. ఈ సమస్యను అతను ఎలా పరిష్కరించాడన్నది ఇందులో చూడవచ్చు. నెట్ ఫ్లిక్స్ దీన్ని స్ట్రీమింగ్ చేయబోతోంది.
క్యాష్ అనే హిందీ సినిమా డిస్నీప్లస్ హాట్ స్టార్ లో విడుదల కాబోతోంది. డీమానిటైజేషన్ నేపథ్యంలో వ్యంగ్య కామెడీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అమోల్ పరాశర్ ఈ చిత్రంలో ఓ హస్లర్గా నటించాడు. ప్రజలు తాము దాచుకున్న డబ్బును చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా కొత్త కరెన్సీగా మారిస్తే త్వరగా డబ్బు సంపాదించవచ్చనుకుంటాడు. దీని కోసం ఓ గ్యాంగ్ స్టర్ సహకారం తీసుకుంటే ఏం జరిగిందనేదే అసలైన కథ. మరో సినిమా పొన్ మానిక్ వేల్. ఇది తమిళ సినిమా. ఇది కూడా డిస్నీప్లస్ హాట్ స్టార్ లోనే విడుదలవుతోంది. ఇది యాక్షన్ థ్రిల్లర్. ప్రభుదేవాతో పాటు నివేదా పేతురాజ్ నటించారు.
ఇందులో ప్రభుదేవాది పోలీస్ ఆఫీసర్ పాత్ర. మరో సినిమా ‘చురులి’. ఇది మలయాళం సినిమా. దీన్ని సోనీ లివ్ స్ట్రీమింగ్ చేయబోతోంది. ఇది సైన్స్ ఫిక్షన్, సస్పెన్స్ మిస్టరీ సినిమా. ఇటీవలే విడుదలైన తెలుగు సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ కూడా ఈ నెల 19న నెట్ ఫ్లిక్స్, ఆహా ఓటీటీల ద్వారా విడుదలవుతోంది. ‘అద్భుతం’ అనే మరో తెలుగు సినిమా ఈ నెల 19న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా విడుదల కాబోతోంది. తేజ సజ్జా (జాంబీ రెడ్డి), శివాని రాజశేఖర్, సత్య, తులసి, మిర్చి కిరణ్, శివాజీ రాజా, మండవ సాయి కుమార్ కీలక పాత్రల్లో నటించిన రొమాంటిక్, సైన్స్ ఫిక్షన్ డ్రామా ఇది. సైన్స్ ఫిక్షన్, ఫాంటసీతో తెరకెక్కింది.
ఇక నవంబరు 25న విక్టరీ వెంకటేష్ నటించిన ‘దృశ్యం 2’ అమెజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా విడుదలవుతోంది. ఇందులో వెంకటేష్, మీనా, నదియా, నరేష్, కృతిక, ఎస్తేర్ అనిల్ తదితరులు నటించారు. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దీనికి దర్శకత్వం వహించారు. మర్డర్ మిస్టరీకి ఇది కొనసాగింపు చిత్రం. 26వ తేదీన ‘చోరీ’ అనే హిందీ చిత్రం కూడా ప్రైమ్ వీడియోస్ ద్వారా విడుదలవుతోంది. ఇది సైకలాజికల్ హారర్ మూవీ. దీంతో పాటు సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొంది థియేటర్లలో విడుదలైన ‘రిపబ్లిక్’ సినిమా కూడా ఈ నెల 26న విడుదలవుతోంది. జీ5 దీన్ని స్ట్రీమింగ్ చేయబోతోంది. ఆకాష్ పూరి, కేతిక శర్మ జంటగా నటించిన ‘రొమాంటిక్’ మూవీ కూడా ఈ నెల 26న స్ట్రీమింగ్ జరగబోతోంది. దీన్ని ఆహా ఓటీటీ స్ట్రిమింగ్ చేయబోతోంది. ఇలా దాదాపు 10 చిత్రాలు విడుదలవుతున్నాయి.
Must Read ;- ఎన్టీఆర్, రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ పారితోషికం ఎంత?