ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు మరో ఏడాదిన్న సమయం పట్టనుంది. జనగణన పూర్తయ్యేవరకు జిల్లాలు, మున్సిపాల్టీలు, పంచాయతీల సరిహద్దులు మార్చడంపై నిషేధం ఉన్నందున ఈ జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జనగణన ప్రారంభం కావాల్సి ఉన్నా కొవిడ్ కారణంగా జాప్యం జరిగింది. 2020 ఏప్రిల్లో జనగణన ప్రారంభించేందుకు 2019లోనే కేంద్రం దాదాపు రూ.8754 కోట్లు కేటాయించింది. అదే సమయంలో పౌర జాబితా నవీకరణకు కూడా దాదాపు రూ.3941కోట్లు కేటాయించింది. అయితే 2020 ఫిబ్రవరి నుంచి కరోనా కారణంగా లాక్ డౌన్లు విధించడం, ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఇంకా జనగణన ప్రారంభం కాలేదు. వచ్చే నెలలో ప్రారంభం కానుందని చెబుతున్నారు. అది పూర్తయి తుది లెక్కలు తేలేవరకు సరిహద్దులు మార్చడంపై ఆంక్షలు ఉండనున్నాయి. విజయవాడకు చెందిన సమాచార హక్కు కార్యకర్త, జర్నలిస్టు ఇనుగంటి రవి కుమార్ అడిగిన సమాచారానికి బదులిచ్చిన కేంద్ర హోంశాఖ ఆద్వర్యంలో పనిచేసే జనగణన రిజస్టార్ జనరల్ జనగణన పూర్తి అయ్యే వరకూ కొత్త జిల్లాలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ గ్రామాలను ఏర్పాటు చేయొద్దని గతంలో ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు.
26 జిల్లాల ఏర్పాటుకు..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు మొదలు పెట్టింది. లోక్సభ నియోజకవర్గానికి ఒక జిల్లా చొప్పున ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. దీంతో పాటు అరకుకు సంబంధించి ప్రత్యేక జిల్లాల ఏర్పాటు కూడా ప్రతిపాదనలో ఉంది. 2020లో జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. అయితే జిల్లాలను మార్చే ప్రక్రియపై కేంద్రం ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. అనుమతి అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్రేక్ పడింది. జనగణన షెడ్యూల్ విడుదలైన తరువాత కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల పాలనాపరిధిని మార్చడం, జిల్లాలను రద్దు చేయడం, సబ్ డివిజన్ల విలీనం లేదా విభజన, పురపాలక, గ్రామాల సరిహద్దుల విలీనం లేదా సరిహద్దులు మార్చడం, పేర్లు మార్చడంపై నిషేధం ఉంటుంది.
పదేళ్లకోసారి..
భారత్లో 1872లో తొలిసారిగా జనగణన మొదలైంది. తరవాతి కాలంలో బ్రిటీషు పాలనలోనే కులాలవారీగా, ఉప కులాల వారీగా జనాభా వివరాల సేకరణ జరిగింది. దీంతోపాటు జీవనోపాధి, ఆర్థిక అంశాలపైనా వివరాలు సేకరించేవారు. నిజాం పాలనలో ఆయా పట్వారీల పరిధిలో ఈ లెక్కలు ఉండేవని చెబుతారు. అప్పటి నుంచి 1951వరకు 7సార్లు మాత్రమే జనగణన జరిగింది. 1951నుంచి ప్రతిపదేళ్లకోసారి చేస్తున్నారు. 2021లో ముగియాల్సిన జనగణన కొవిడ్ కారణంగా వాయిదా పడింది. వచ్చే ఏప్రిల్ లో మొదలుపెట్టినా జనగణన నెలరోజుల్లో పూర్తియినా.. తుది లెక్కలు తేలడం, కేంద్రం ఆమోదం తెలపడం, జాతీయ రికార్డుల్లో నమోదు, తదితర ప్రక్రియలకు సమయం పట్టనుంది. అంటే 2022 ఏప్రిల్ నాటికి క్లారిటీ రానుందని చెబుతున్నారు.
Also Read ;- వైసీపీది మనీ ఫ్లస్ పవర్.. తిరుపతిలో టీడీపీకి అగ్నిపరీక్ష

30 లక్షల మంది సిబ్బంది అవసరమని..
2011 జనాభా లెక్కల్లో 28లక్షల మంది క్షేత్రస్థాయిలో పనిచేశారు. అసోం మినహా దేశవ్యాప్తంగా ఒకటిరెండు రోజుల వ్యవధిలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సారి 30లక్షల మంది సిబ్బంది అవసరమని అంచనా వేస్తున్నారు. అయిత ఈ సారి పౌర రిజిస్టర్ కూడా ఉండడంతో జనగణన, ఎన్పీఆర్ల తయారీకి తొలిసారిగా యాప్ను, వెబ్సైట్ను వినియోగించనున్నారు. అధికారులకు వివరాలు చెప్పడంతో పాటు.. ప్రజలు సంబంధిత ఆధారాలతో వివరాల నమోదు చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని గతంలో కేంద్రం ప్రకటించింది. రానున్న జనగణనలో ఈ వెసులుబాటు ఉంటుందా లేక ఏమైనా మార్పులు చేస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
లింక్ ఎందుకు..
జనగణనలో దాదాపు 65 అంశాలకు సంబంధించిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అందులో వార్డు/డివిజన్, గ్రామం/మున్సిపాల్టీ, మండల/తాలూకా, జిల్లా/ప్రాదేశికం, రాష్ట్రం వివరాలు కామన్ గా ఉంటాయి. అయితే ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలు సేకరిస్తారు. ఇందుకు సంబంధించి కేంద్రం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ప్రజలు కొన్ని అంశాలను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉండగా కొన్ని అంశాలు ఐచ్చికంగా ఇవ్వచ్చు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు భంగం కలిగించేలా, వివక్షతకు తావిచ్చేలా వివరాలు సేకరించే అవకాశం ఉండదు. కాని ప్రాథమిక వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది.
newఇక్కడ గతంలో జరిగిన జనగణనను ఒకసారి ప్రస్తావించాల్సి ఉంటుంది. గతంలో 2011గా చెప్పే జనగణన ప్రక్రియ 2010లో ప్రారంభమైంది. 2015నాటికి సూక్షస్థాయి నివేదిక స్థాయిలో అంటే.. గృహా స్వరూపం – స్లాబ్, పెంకుటిల్లు, రేకులు, పూరి గుడిసె, శాశ్వత, తత్కాలిక నిర్మాణం లాంటి అంశాలు, మౌలిక సదుపాయాలు, ప్రాంతం, ఆర్థిక వివరాలు,మతం, కులం, భాష, అక్షరాస్యత, వలస సమాచారం గ్రామాలవారీగా క్రోడీకరణకు నాలుగేళ్లు పట్టింది. 2015లో ఈ తుది జాబితా విడుదలైంది. ఈ సమయంలో సరిహద్దులు మార్చడం, పేర్లు మార్చడం లాంటివి చేస్తే.. దేశ వ్యాప్తంగా జనగణన నివేదిక విడుదలకు ఆలస్యం అవుతుంది. గందరగోళానికి కారణం అవుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో జనగణన ప్రాథమిక నివేదిక, తుది నివేదకలకు ఎంత సమయం పడుతుందనే అర్థం అవుతోంది. ప్రాథమిక నివేదిక వచ్చేవరకు కొత్త జిల్లాలు, గ్రామాలు, మున్సిపాల్టీల సరిహద్దులు మార్చడంపై నిషేధం కొనసాగనుంది.
Must Read ;- ఏక్షణంలోనైనా పరిపాలనా రాజధానిని విశాఖకు తరలిస్తాం: బొత్స











