బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ లంగ్ కేన్సర్ బారిన పడ్డారు. తనకు ఊపిరితిత్తుల కేన్సర్ స్టేజ్- 4 దశలో ఉందని సంజూ బాబా స్వయంగా తెలియచేశారు. కొన్ని రోజుల కిందట శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురుకున్న సంజయ్ లీలావతి హాస్పిటల్ లో చేరిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ అనుమానంతో ఆయనకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలలో నెగటివ్ రిపోర్టు రావడంతో అతనికి ఛాతి సంబందించిన పరీక్షలను నిర్వహించారు. సంజయ్ దత్కు ఊపిరితిత్తుల కేన్సర్ స్టేజ్- 4 దశలో ఉన్నట్లు వైద్యులు నిర్దారించారు.
వైద్య చికిత్స నిమిత్తం పనికి కొంత విశ్రాంతి ఇస్తున్నట్టు పేర్కొన్న ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు తనకు మద్దతుగా ఉన్నారని, పుకార్లను నమ్మవద్దని కోరాడు. మీ ప్రేమాభిమానాలతో త్వరలోనే కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు. మెరుగైన చికిత్స కోసం ఆయన త్వరలోనే విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు తమ సంఘీభావం ప్రకటించారు. కేన్సర్ మహమ్మారిని జయించిన యువరాజ్ సింగ్ ఓ సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సంజయ్ దత్… మీరు ఓ ఫైటర్. ఇప్పుడు కూడా మీరు అదే దృక్పధంతో ఉండండి. మానసికంగా మీరు దృఢంగా ఉండాలి. మీరు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను” అంటూ యూవీ ట్వీట్ చేశాడు. తమ అభిమాన నటుడికి కేన్సర్ సోకడంతో సినిమా అభిమానులు విషాదంలో మునిగిపోయారు. జులై 29న సంజూ బాబా తన 61వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఆ రోజున మోస్ట్ అవైటింగ్ మూవీ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ అదిరా పాత్రలో నటిస్తున్న సంజయ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.










