ప్రతి ఏడాది కూడా సంక్రాంతి వస్తుందంటే చాలు కొత్త సినిమాల సందడి ఒక రేంజ్ లో ఉండేది. తెలుగు హీరోల్లో సంక్రాంతి సెంటిమెంట్ చాలామంది హీరోలకు ఉంది. సంక్రాంతి పండుగకు తమ సినిమా థియేటర్లో ఉండాలనే ఉద్దేశంతో చాలామంది స్టార్ హీరోలు అప్పటికి తమ సినిమాలు సిద్ధమయ్యేలా ప్లాన్ చేసుకుని బరిలోకి దిగేవారు. సంక్రాంతి బరిలో తమ హీరో సినిమానే విజేతగా నిలబడాలనే ఆసక్తి అభిమానుల్లో ఎక్కువగా కనిపించేది. ఏ సినిమా వసూళ్లు ఎంత అనేదే వాళ్ల చర్చల్లో ముఖ్యమైన అంశంగా వినిపించేది. కానీ ఈ సారి ఆ సందడి అంతగా ఉండే అవకాశాలు లేవనే అనిపిస్తోంది.
కరోనా కారణంగా తెలుగు రాష్ట్రాల్లోను థియేటర్లు మూతబడ్డాయి. కొన్ని రోజుల క్రితమే కొన్ని మల్టీ ప్లెక్స్ లు తెరుచుకున్నాయి. ఈ నెల చివరికి పూర్తిస్థాయిలో థియేటర్లు తెరుచుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. సాయిధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా ‘క్రిస్మస్’ కానుకగా వస్తుందంటూ విడుదల తేదీని ప్రకటించారు .. థియేటర్లలోనే విడుదలవుతుందని స్పష్టం చేశారు. ఇక రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ‘క్రాక్’ సినిమా కూడా సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దాంతో మిగతా సినిమాలు కూడా సంక్రాంతి బరిలోకి దిగుతాయని ప్రేక్షకులు ఉత్సాహపడ్డారు.
Also Read ;- అందరి చూపులు నిహారిక కొణిదెల వివాహ వేడుకపైనే!
అయితే ప్రేక్షకుల ఆశలపై ఐస్ నీళ్లు చల్లే వార్తలే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముందుగా సంక్రాంతి బరిలోకి దిగడానికి ఆసక్తిని చూపించిన ప్రాజెక్టులు కొన్ని ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాయని తెలుస్తోంది. అందుకు కారణం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సమయానికి థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకుంటాయా? 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం ఉంటుందా? అనే సందేహాలకి సమాధానం దొరక్కపోవడమే. ఈ కారణంగానే రామ్ హీరోగా చేసిన ‘రెడ్’ .. నితిన్ కథానాయకుడిగా రూపొందిన ‘రంగ్ దే’ విడుదల పరంగా వెనక్కి వెళ్లాయని అంటున్నారు. ఇక చైతూ – సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘లవ్ స్టోరీ’ కూడా పక్కకి తప్పుకుందని అంటున్నారు.
కొత్త సినిమాలను ఆహ్వానించడానికి నగరాల్లోని కొన్ని మల్టీ ప్లెక్స్ లు సిద్ధంగా ఉన్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో రన్ చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నాయి. కానీ ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టాలంటే పూర్తిస్థాయిలో థియేటర్స్ తెరుచుకోవాలి. సింగిల్ స్క్రీన్లు కూడా ఓపెన్ కావాలి. కరోనా సంగతి తీసుకుంటే దాని ప్రభావం ఇంతవరకూ తగ్గలేదు. వ్యాక్సిన్ వస్తేనే తప్ప జనంలో భయం పోయే పరిస్థితి లేదు. కరోనా కారణంగా ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయనేది అంచనా వేయడానికి లేనట్టుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రిస్క్ చేయడం అవసరమా? అనే ఆలోచన నిర్మాతల్లో ఉంది. అందువలన ఈ సారి థియేటర్ల దగ్గర సంక్రాంతి సందడి ఆశించిన స్థాయిలో ఉండదనే విషయం స్పష్టమవుతోంది.
Must Read ;- దుబాయ్ లో మొదలైన నితిన్ మూవీ











