తెలంగాణలో సీఆర్ బిస్వాల్ కమిటీ రూపొందించిన పీఆర్సీ నివేదిక లో పేర్కొన్న అంశాలపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగులకు 7.5శాతం ఫిట్ మెంట్ ను సిఫారసు చేయడం, కనీస వేతనం రూ.19వేలుగా నివేదికలో సిఫారసు చేశారన్న అంశంపై ఉద్యోగసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వంపై ప్రతిపక్షాలూ దుమ్మెత్తి పోస్తున్నాయి. ఉద్యోగులను అవమానించేలా పీఆర్సీ నివేదిక ఉందని పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పలు మార్లు ఉద్యోగసంఘాల నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఉద్యోగసంఘాలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని వివరించే యత్నం చేస్తున్నా.. ఉద్యోగ సంఘాలు అంగీకరించడం లేదని తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో రాజకీయపక్షాల్లో మరో చర్చకూడా నడుస్తోంది. గతంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలను రాజకీయ నాయకులు, కొన్ని ఉద్యోగసంఘాల నాయకులు తెరపైకి తెస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో ఉద్యోగులు అడగకుండానే ముందుగానే కేసీఆర్ 43శాతం ఫిట్ మెంట్ ప్రకటించారని గుర్తుచేస్తున్నారు. 2014 పీఆర్సీ కమిషన్ 29శాతం సిఫారసు చేస్తే కేసీఆర్ 49శాతం పెంచుతూ నిర్ణయం తీసుకోవడం, ఏపీలో 44శాతం ఫిట్ మెంట్ ప్రకటించడం అప్పట్లో చర్చ జరిగింది. అప్పట్లో కేసీఆర్ మాట్లాడుతూ ఊహించినదానికంటే ఎక్కువగానే తాము ఫిట్ మెంట్ ఇస్తామని, ఉద్యోగుల విషయంలో తాము ఎప్పుడూ అన్యాయం చేయబోమని వ్యాఖ్యానించారు. ఆ సమయంలోనూ కేసీఆర్ కి కొందరు అభిమాన ఉద్యోగులు పాలభిషేకాలు చేశారు. తరువాత ఆ మధ్య ఆర్టీసీ సమ్మె విషయంలోనూ అదే జరిగింది. ఓ వైపు హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలున్న నేపథ్యంలో కేసీఆర్ ఆర్టీసీ యూనియన్ల విషయంలో సాఫ్ట్ గా వ్యవహరిస్తారని ఊహించారు. అయితే కేసీఆర్ మాత్రం తన భిన్నవ్యూహాన్ని అమలుచేశారు.
Must Read ;- కేసీఆర్కి నిరుద్యోగుల పరీక్ష.. పదవీ విరమణ వయస్సు పెంపుపై మల్లగుల్లాలు
ఓవైపు దసరా పండుగ ఉంటే మీరు సమ్మెకు ఎలా దిగుతారు అని జనాన్ని ఆకర్షించే ప్రకటనతోపాటు సమ్మెను కొన్నాళ్లపాటు కొనసాగనిచ్చారు. ఒకరకంగా ఉద్యోగుల్లో భయాన్ని కూడా కల్పించారని అప్పట్లో వ్యాఖ్యలు వినిపించాయి. తరువాత హఠాత్తుగా ఆర్టీసీ యూనియన్ల డిమాండ్లు అంగీకరించారు. అదే సమయంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. సమ్మెకు సారథ్యం వహించిన అశ్వథ్థామరెడ్డిని దాదాపుగా సైడ్ చేసేశారు. ఆర్టీసీలోని కొందరు కార్మికులు, ఉద్యోగులతో డిన్నర్ చేశారు. అంతా తెలంగాణ కుటుంబసభ్యులమే అని వ్యాఖ్యానించారు. ఒక్కదెబ్బకు మూడు పిట్టలు అన్న చందంగా ఛార్జీల పెంపు, తనకు వ్యతిరేకంగా ఉన్న యూనియన్ల ఐక్యత విచ్ఛిన్నం, ఉద్యోగుల్లో సానుకూలత ఉండేలా చేశారు. అప్పుడూ పాలాభిషేకాలు జరిగాయి.
ఇక అంగన్ వాడీ కార్యకర్తల వేతనాలు, పోలీసు శాఖలో పనిచేసేవారి వేతనాల విషయంలోనూ ఇదే జరిగింది. తొలుత నిరసనను బయటకు వచ్చేలా చేయడం.. ఆ నిరసన తారస్థాయికి చేరి ఆగ్రహంగా మారుతుందన్న సమయంలో కేసీఆర్ తనదైన శైలిలో వ్యూహం అమలుచేయడం కామన్ అనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు పీఆర్సీ విషయంలోనూ కేసీఆర్ అదే విధానం అమలుచేస్తారన్న చర్చ ఉద్యోగ సంఘాల్లోనే ఉంది. దీంతోనే ఉద్యోగ సంఘాలు పీఆర్సీ నివేదికపైనే వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్ ని పల్లెత్తుమాట కూడా అనేందుకు ముందుకు రావడం లేదు.
మరోవైపు దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు, కేటీఆర్ ని సీఎం చేస్తారన్న ప్రచారం, బీజేపీ దూకుడు, జమిలి ఎన్నికలు వంటి అంశాలు రానున్న కాలంలో పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులతో వైరం పెట్టుకునే ఆలోచన చేసే పరిస్థితి లేదని, ఉద్యోగులు అంగీకరించేలా ఓ పర్సెంటేజీ ఇప్పటికే ఖరారైందనే చర్చ కూడా నడుస్తోంది. అదే జరిగితే.. కేసీఆర్ కు మళ్లీ పాలాభిషేకాలు జరుగుతాయనే చర్చ నడుస్తోంది. అంతేకాకుండా నిరుద్యోగ భృతి, ఉద్యోగాల నోటిఫికేషన్లపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే శుభవార్త వింటారని వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి ఉద్యోగుల విషయం కేసీఆర్ ఎలా వ్యవహరించనున్నారనేది అర్థం చేసుకోవచ్చని, ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచితే ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత వచ్చినా.. ప్రస్తుతం అమలుచేస్తున్న వ్యూహంతో ఆ వ్యతిరేకత రాకుండా చూడొచ్చనే చర్చ నడుస్తోంది.
ఫిబ్రవరి 17న..
సీఎం కేసీఆర్ పుట్టినరోజైన ఫిబ్రవరి 17న పలు ప్రకటనలు రానున్నాయనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఈ సారి ఘనంగా నిర్వహించేందుకు కొందరు నాయకులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎల్ బీ స్టేడియంలో వేడుకలు నిర్వహించనున్నారని, ఇప్పటికే రిజర్వ్ చేశారని కూడా తెలుస్తోంది. ఆరోజు నిరుద్యోగులకు సంబంధించి వరాలుకూడా ప్రకటిస్తారని, పీఆర్సీపైన కూడా ఆ రోజు నిర్ణయం తీసుకుంటారని కొందరు నాయకులు చెబుతుండగా అంతవరకు జాప్యం చేస్తే వ్యతిరేకత వస్తుందని, రెండుమూడు రోజుల్లోనే నిర్ణయం వస్తుందని మరికొందరు ఉద్యోగసంఘాల నాయకులు చెబుతున్నారు.
Also Read ;- పట్టాభిషేకానికి మనసా, కర్మేణా సిద్ధమవుతున్న కేటీఆర్!