వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఒక ఎత్తయితే, హీరోగా కొనసాగడం మరొక ఎత్తు. కథల ఎంపిక .. పాత్రల ఎంపిక విషయంలో తీసుకునే నిర్ణయాలు, ప్రేక్షకులకు నచ్చి వాళ్లు అందించే విజయాలు కెరియర్ గ్రాఫ్ ను పెంచడంలో ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. ఎక్కడ తేడా కొట్టినా మొదటి చాన్సు ను దక్కించుకోవడం కన్నా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. అందుకే అవకాశాలను అందుకోవడమే కాదు .. అలా వచ్చిన అవకాశం క్రిందికి జార్చేది కాకుండా పైకి పాకిచ్చేది కావాలి. మొదటి సినిమా ఉత్సాహాన్ని పెంచితే, రెండవ సినిమా ఉత్సాహంతోపాటు బాధ్యతను పెంచుతుంది. మొదటి సినిమాకి సంబంధించి తమ లోపాలను సరిచేసుకోవడానికి రెండవ సినిమాకి మించిన అవకాశం ఉండదనే చెప్పాలి.
అలా ఈ లాక్ డౌన్ తరువాత రెండో సినిమాతో ప్రేక్షకులను పలకరించే కుర్రహీరోల జాబితా పెద్దదిగానే వుంది. శ్రీకాంత్ తనయుడు ‘రోషన్’ .. ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాతో కొంతకాలం క్రితం తెలుగు తెరకి పరిచయమయ్యాడు. కథాకథనాల పరంగా .. ట్రీట్మెంట్ పరంగా ఈ సినిమా ఫరవాలేదనిపించుకుంది. ఆయన రెండో సినిమాగా ‘పెళ్లి సందడి‘ సెట్స్ పైకి వెళ్లనుంది. పాతిక సంవత్సరాల క్రితం శ్రీకాంత్ హీరోగా చేసిన ‘పెళ్లి సందడి’ ఆయన స్టార్ డమ్ ను అమాంతం పెంచేసింది. రాఘవేంద్రరావు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఆయన దర్శకత్వ పర్యవేక్షణలోనే రోషన్ ‘పెళ్లి సందడి’ మొదలుకానుంది. గౌరీ రోనంకి దర్శకత్వంలో ఈ సినిమా మొదలుకానుంది. ఈ సినిమాతో హీరోగా రోషన్ నిలదొక్కుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
శ్రీహరి తనయుడు మేఘాంశ్ కూడా తన రెండో సినిమాతో రంగంలోకి దిగాడు. ‘కోతి కొమ్మచ్చి’ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకి, సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించనున్నాడు. మేఘాంశ్ మొదటి సినిమాగా చేసిన ‘రాజ్ దూత్’ పరాజయాన్నే చవిచూసింది. ఆ సినిమాలో నటనపరంగా తనకి లోపాలుగా అనిపించిన విషయాలను సరిచేసుకుని ఆయన రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. డైలాగ్ డెలివరీ .. బాడీలాంగ్వేజ్ విషయాల్లో ఆయన మరింత శ్రద్ధ పెట్టినట్టుగా చెబుతున్నారు. రెండోసారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడని అంటున్నారు.
Must Read ;- దర్శకుల వారసులు హీరోలు గా రాణించలేరా?
ఇక విభిన్నమైన ప్రేమకథాచిత్రాలను నిర్మించిన రాజ్ కందుకూరి, తన తనయుడు ‘శివ కందుకూరి’ని హీరోగా పరిచయం చేస్తూ ‘చూసీ చూడంగానే’ సినిమాను నిర్మించాడు. అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు. ఆ తరువాత శివకందుకూరి రెండు సినిమాలను అంగీకరించాడు. ఒకటి ‘మనుచరిత్ర’ కాగా, మరొకటి ‘గమనం‘. ఈ రెండు సినిమాల్లో ‘గమనం’ విడుదలకి ముస్తాబవుతోంది. సుజనరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ప్రేమకి .. ఆశయానికి మధ్య నలిగిపోయే పాత్రలో శివకందుకూరి నటించాడు. వైవిధ్యభరితమైన కథాకథనాలు .. సహజత్వంతో కూడిన సన్నివేశాలతో రూపొందిన ఈ సినిమా, తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందనే నమ్మకంతో ఆయన వున్నాడు.
మెగాస్టార్ చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కూడా తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ‘విజేత’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన కల్యాణ్ దేవ్, ‘సూపర్ మచ్చి’ సినిమాతో మళ్లీ రంగంలోకి దిగుతున్నాడు. పులి వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాలో, కల్యాణ్ దేవ్ సరసన రియా చక్రవర్తి .. రచిత రామ్ కథానాయికలుగా సందడి చేయనున్నారు.
మొదటి సినిమా తరువాత నటనపరంగా మరిన్ని మెళకువలు నేర్చుకున్న కల్యాణ్ దేవ్, ఈ సినిమా విజయంపై పూర్తి విశ్వాసంతో వున్నాడు. ఇలా తమ రెండో సినిమాపై కుర్ర హీరోలంతా ఆశలు పెట్టుకున్నారు .. వాళ్ల ఆశలు ఫలించాలనే ఆశిద్దాం.
Akso Read ;- పవన్ మావయ్య ముందా?.. ‘మెగా’ అల్లుళ్లు ముందా?











