సినిమా రంగంలో అజరామర ప్రేమ కథలు ఎన్నో వచ్చాయి. చిరస్థాయిగా నిలిచిపోయేది విషాదాంత ప్రేమ కథలే. చరిత్రలో నిలిచిపోయిన ప్రేమ కథల్ని తెరపై ఆవిష్కరించిన తారల జీవితంలోని ప్రేమ మాత్రం తెరవెనకే ఉండిపోయింది.
తారల ప్రేమను తెర మీద ఆవిష్కరిస్తే మరో అజరామర ప్రేమ కథే అవుతుంది. అలాంటి ప్రయత్నాన్ని మాత్రం ఇంతవరకూ ఎవరూ చేయలేదు. ఇంతకీ ఆ జంట ఎవరో తెలుసా? బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్, వీనస్ ఆఫ్ ఇండియన్ స్క్రీన్ మధుబాల. వెండి తెరపై దేదీప్య మానంగా వెలిగిన మధుబాల జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. దిలీప్ కుమార్ ఇటీవల కన్నుమూశారు. మరి వీరి మధ్య ప్రేమ కథ ఎలాంటిదో తెలుసుకుందాం.
ప్రేమికుల రోజుతో ‘మధు’ బంధం ప్రేమికుల రోజు అంటే ఫిబ్రవరి 14 అనే అందరికీ తెలుసు. అలాంటి ప్రేమికుల రోజునే మధుబాల పుట్టింది.
11 మంది సంతానంలో ఆమె ఐదవది. అమాయకత్వంతో కూడిన అందం ఆమెది. కానీ చిన్నప్పటి నుంచి అనారోగ్యం ఆమెను వెంటాడింది. దిలీప్ కుమార్ విషయానికి వస్తే అతని నవ్వు శవానికి కూడా ప్రాణం పోస్తుందంటారు. పఠాన్ కుటుంబంలో పేదరికంలో పుట్టాడు దిలీప్ కుమార్. ‘బసంత్’ అనే సినిమా ద్వారా బాల నటిగా సినిమా రంగ ప్రవేశం జరిగింది. హీరోయిన్ గా ఆమెను తెరకు పరిచయం చేసింది మాత్రం దర్శకుడు కేదార్ శర్మ. రాజ్ కుమార్ హీరోగా రూపొందిన ‘నీల్ కమల్’ చిత్రమది. ఈ సినిమా తర్వాతే ఆమెను అందాల దేవతగా అందరూ గుర్తించారు.
దిలీప్ గుండెల్లో విరిసిన ప్రేమ గులాబీ
దిలీప్ కుమార్, మధుబాల మధ్య ప్రేమ గులాబీ రంగు లేఖతో మొదలైందని చెబుతుంటారు. వీరిద్దరూ ‘తరానా’ సినిమాలో జంటగా నటించారు. 1951లో ఈ సినిమా విడుదలైంది. వీరి మధ్య ప్రేమకు ఈ సినిమానే కారణమైంది. వీరి ప్రేమ వ్యక్తమైంది కూడా ఈ సినిమా షూటింగ్ సమయంలోనే. తనకు తెలియకుండానే దిలీప్ తో ఆమె ప్రేమలో పడిపోయింది. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే మేకప్ మన్ తో ఓ గులాబీ రంగు ప్రేమ లేఖను ఆమె దిలీప్ కు పంపిందని చెబుతారు. దాన్ని ఆమె ఉర్దూలో రాసింది.
Must Read ;- దేవదాసు.. ఇది క్లాసిక్ మాత్రమే కాదు, ఓ చరిత్ర

అందులో ఆమె ఏం రాసిందో తెలుసా?.. ‘మీరు కావాలనుకుంటే ఈ రోజాను తీసుకోవచ్చు.. వద్దనుకుంటే తిరిగి ఇచ్చేయవచ్చు’.. ఇదీ ఆమె పంపిన ప్రేమ సందేశం. అందాల సుందరి ప్రేమను వ్యక్తం చేస్తే ఎవరు మాత్రం తిరస్కరిస్తారు. దిలీప్ ఆమె ప్రేమను స్వీకరించారు. ఇక తర్వాత వీరి ప్రేమపై పుకార్ల వరద పారింది. ఏ ప్రేమ కథలో నైనా విలన్ ఉండక తప్పదు. ఇందులో విలన్ ఆమె తండ్రి అతౌల్లా ఖాన్. ఇంటికి మంచి ఆదాయ వనరు
మధుబాల మాత్రమే. దిలీప్ తో ఆమె ప్రేమలో పడటం అతనికి ఇష్టం లేదు. వీరి పెళ్లికి అతను ససేమిరా అన్నాడు. దాంతో దిలీప్ ఆమె ముందు ఓ ప్రతిపాదన ఉంచాడు. అదేమిటంటే అతన్ని మధుబాల పెళ్లిచేసుకుంటే తండ్రితో ఆమె సంబంధ బాంధవ్యాలను తెంచుకోవాలి. ఇద్దరూ విడిపోవడానికి ఇదే కారణం. దిలీప్ తో మొదలైన మధుబాల ప్రేమ కిషోర్ కుమార్ తో జరిగిన పెళ్లితో శుభం కార్డు పడింది.
ఎన్నో పుకార్లు షికార్డు
మధు బాల ప్రేమ దిలీప్ తో పెనవేసుకుపోయినా ఆమె గురించి ఎన్నో పుకార్డు షికారు చేశారు. చిత్ర నిర్మాత కమల్ అమ్రోహి, దర్శకుడు కేదార్ శర్మ, నటుడు ప్రేమ్ నాథ్ లతోనూ ఆమె చెట్టపట్టాలేసుకు తిరుగుతోందని వదంతులు రాజ్యమేలాయి. చివరికి మల్టీ టాలెంట్ పర్సన్ కిషోర్ కుమార్ వద్ద ఆమె ప్రేమ ప్రయాణం ఆగిపోయింది. ఎన్ని ప్రేమలున్నా ఆ మొఘల్ ఏ ఆజమ్’ బంధమే వేరు. రాజ దర్భారులో సలీమ్ ‘ప్యార్ కియాతో డర్ నా క్యా’ అంటూ ధైర్యంగా ప్రకటించినప్పుడు సెహెన్ షా అక్బర్ ను అనార్కలి ధిక్కరించి ఉండొచ్చు.

అది రీల్ ప్రేమ కాబట్టి అలా జరిగిందేమో.. రియల్ ప్రేమ వేరు కదా అందుకే తండ్రి మాటను మధు బాల జవదాటలేకపోయింది.1956లో ‘ధాకే కి మల్మాల్’ లో హీరోయిన్ గా నటిస్తున్న మధుబాల దగ్గరకు వచ్చి పెళ్లిపై దిలీప్ కుమార్ అనేక సార్లు ప్రతిపాదనలు తెచ్చినా ఫలితం లేకపోయింది.1957లో వచ్చిన ‘నయా దౌర్’ షూటింగ్ సందర్భంగానే వీరి ప్రేమకు ఫుల్ స్టాప్ పడిపోయింది.
గ్వాలియర్ సమీపంలో షూటింగ్ జరగాలి. అదే ప్రాంతంలో జబీన్ జలీల్ నటించిన మరో సినిమా షూటింగ్ జరుగుతోంది. దాంతో అక్కడి గుంపు ఆ సినిమా యూనిట్ లోని మహిళలపై దాడి చేసి బట్టలు కూడా చించివేసింది. మధుబాల తండ్రి అక్కడ షూటింగ్ వద్దని అన్నారు. కాని నిర్మాత దివంగత బి.ఆర్. చోప్రా వినలేదు. పైగా అందులో నటించాల్సిన మధుబాలను తప్పించి ఆ స్థానంలో వైజయంతిమాలను తీసుకున్నారు. దాంతో మధుబాల తండ్రి దర్శకుడిపై కేసు పెట్టారు. బాల్ కోర్టుకు చేరింది. దిలీప్ కుమార్ బి.ఆర్. చోప్రాకు అండగా నిలిచారు.
Also Read ;- అసమానం.. అజరామరం దిలీప్ కుమార్ నటన
దిలీప్ లోని అహంకారమే ప్రేమను భగ్నం చేసిందా?
ప్రేమ ఉన్నప్పుడు వైరం ఉండకూడదు. మధు, దిలీప్ ల మధ్య ఎడబాటు అంతకంతకూ పెరిగింది. దీనికి కారణం దిలీప్ కుమార్ లోని అహంకారమే అంది మధుబాల సోదరి మాధుర్. దిలీప్ ను కోల్పోతున్నందుకు మధు ఎప్పుడూ ఏడుస్తూ ఉండేదట. ‘మీ నాన్నను వదులుకుంటేనే నేను నిన్ను పెళ్లాడతా’ అనే వారట దిలీప్ కుమార్. మధు తండ్రి మాత్రం దిలీప్ ను క్షమాపణ కూడా కోరలేదు. అతనితో ఉన్న బంధాన్ని తెంచుకోమని కూడా మధును అనలేదు. మధు తండ్రి కోణంలో చూస్తే వీరి వివాహం ఓ వ్యాపార ఒప్పందం.
దిలీప్, మధుల మధ్య నిశ్చితార్థం కూడా అప్పటికే జరిగిపోయిందట. ఇద్దరూ కలిసి చెట్టపట్టాలేసుకు తిరిగారు. ‘మొఘల్-ఎ-అజామ్’ షూటింగ్ చాలా కాలం సాగింది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఇద్దరి మధ్యా వైరం బయలు దేరింది. ఒక దశలో ఇద్దరి మధ్యా మాటలు కూడా లేవు. ఇద్దరినీ కలపడానికి దర్శకుడు ఆసిఫ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సినీ చరిత్రలో ఐకానిక్ గా భావించే ఈ సినిమా శృంగారభరిత సన్నివేశాల చిత్రీకరణ సమయంలో వీరి మధ్య మాత్రం ద్వేషం తప్ప ప్రేమ లేదు.
ఓ సన్నివేశంలో అనార్కలిని సలీం చెంప దెబ్బ కొట్టాల్సి వచ్చిందట. ఆ సన్నివేశం చిత్రీకరణ సమయంలో దిలీప్ తన కోపాన్ని అణుచుకోలేకపోయాడు. లాగిపెట్టి కొట్టినప్పుడు ఆమె కూడా తన కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేకపోయింది. చివరికి దిలీప్ వివాహం సైరాభానుతో జరిగిపోయింది. ఈ పెళ్లి తనకెంతో సంతోషం కలిగించిందని మధుబాల చెప్పేదని ఆమె సోదరి మాధుర్ ఓ ఇంటర్వ్యూలో అంది. ఎంతో అందమైన అమ్మాయిని దిలీప్ కుమార్ చేసుకున్నా మధు హృదయంలో మాత్రం శూన్యత అలాగే ఉందట.
వెంట్రిక్యులర్ సెప్టల్ లోపంతో మధు బాల బాధపడేది. ఆమె ముక్కు, నోటి నుంచి రక్తం పడేది. దానికి తోడు ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడింది. తరచూ ఆక్సిజన్ అందివ్వాల్సి వచ్చేది. దాంతో ఆమె అసమానమైన అందం మసకబారిపోయింది. 36 ఏళ్ల వయసులో 1969 ఫిబ్రవరి 23న కన్నుమూసింది.ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడు దిలీప్ ఆమెను పరామర్శించడానికి కూడా రాలేదు.
చనిపోయినప్పుడు మాత్రం శ్రద్దాంజలి ఘటించడానికి మద్రాసు నుంచి బయలుదేరి శ్మశాన వాటికకు వచ్చారు. ఆచారం ప్రకారం మూడు రోజుల పాటు తన ఇంటి నుంచి అక్కడికి ఆహారాన్ని కూడా పంపే ఏర్పాటుచేశారు. వీరిద్దరూ భౌతికంగా ఇప్పుడు మన మధ్య లేకపోయినా వీరి ప్రేమ గాథ మాత్రం అభిమానుల గుండెల్లో నిలిచే ఉంటుంది. దీనికి తెరరూపం వస్తే తెలుగులో ‘మహానటి’లాంటి చిత్రమవుతుంది. వధ శాల మీదే మధుబాల జీవితం సాగింది. ఇలాంటి విషాదాంత ప్రేమ కథలే ఎప్పటికీ జనం గుండెల్లో నిలిచి ఉంటాయి.











