నిజమే. ఇప్పుడిప్పుడే మొదలైన సరికొత్త రాజకీయ చదరంగంలో ఓ మంచి సంప్రదాయానికి చెల్లు చీటి ఇచ్చేశారు. దశాబ్దాల తరబడి మన రాజకీయ వ్యవస్థలో కొనసాగిన ఆ సంప్రదాయినికి ఇప్పటి మన నయా రాజకీయ నేతలు ఇకపై కొనసాగించేందుకు ససేమిరా అంటున్నారు. కారణాలు ఏమైనా గానీ… సదరు మంచి సంప్రదాయం కనుమరుగవుతున్న తీరు అందరినీ ఆలోచనలో పడేసిందని చెప్పక తప్పదు. అయినా సదరు సంప్రదాయం ఏమిటి? అదెలా ఏళ్ల తరబడి కొనసాగింది? అది ఇప్పుడు ఎందుకు కనుమరుగు అయ్యింది అన్న వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి.
భారత దేశ రాజకీయాల్లో ప్రత్యేకించి మన తెలుగు నేల రాజకీయాల్లో ఏ పార్టీకి చెందిన నేత అయినా… పదవిలో ఉండగా ఏదేని కారణంతో మరణిస్తే… ఆ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో సదరు దివంగత నేత కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఒకరికి సీటిచ్చేసి… పార్టీలన్నీ కలసికట్టుగా పోటీ లేకుండా ఏకగ్రీవంగా చట్టసభకు పంపేవి. ఈ సత్సంప్రదాయం ఏళ్ల తరబడి ఎలాంటి అడ్డంకులు లేకుండానే సాగిపోయింది. ఏ పార్టీ అన్న తేడా లేకుండా, అధికారంలో ఉన్న పార్టీ అయినా, విపక్షంలో ఉన్న పార్టీ అయినా ఈ సంప్రదాయాన్ని కొనసాగించాయి. ఇలాంటి వెసులుబాటుతో మరణించిన నేత కుటుంబానికి అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలిచి పూర్తి భరోసా ఇచ్చేవి. ఈ తరహా సంప్రదాయంతో చాలా మంది నేతల కుటుంబాలకు సాంత్వన లభించింది కూడా. ఆయా నేతల రాజకీయ వాసరత్వం మరింత కాలం పాటు రాజకీయాల్లో కొనసాగేలా, సదరు నేత అనుచర వర్గానికి కొండంత అండగా ఈ సంప్రదాయం నిలిచింది. మరి ఇప్పుడు ఎందుకు ఈ సంప్రదాయం కొనసాగడం లేదు? అసలు ఏ కారణాలతో మన నయా రాజకీయ పార్టీలు, నేతలు ఈ సంప్రదాయానికి చెల్లుచీటి ఇచ్చారు?.. ఆయా పార్టీల్లో వచ్చిన మార్పులు, సచ్ఛీల రాజకీయాల స్థానంలో స్వార్థ రాజకీయాలు చొరబడటం ప్రధాన కారణంగా చెప్పుకోవాలి.
అయినా ఇప్పుడు ఈ సత్సంప్రదాయం ప్రస్తావన ఎందుకన్న విషయానికి వస్తే… మొన్న తెలుగు నేల రాజకీయాలతో పాటుగా యావత్తు దేశ రాజకీయాలను ఆకర్షించిన దుబ్బాక ఉప ఎన్నిక ఏ మేర రచ్చరచ్చగా సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఎన్నిక తెలంగాణకు చెందినదైతే… త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లోనూ ఓ కీలక ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నిక కూడా ఓ సిట్టింగ్ ఎంపీ అకాల మరణం కారణంగానే జరుగుతోంది. అదే తిరుపతి పార్లమెంటు స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నిక కూడా హోరాహోరీగానే సాగే అవకాశాలున్నాయి. ఇదివరకు కొనసాగిన సత్సంప్రదాయానికి భిన్నంగానే ఈ ఉప ఎన్నిక జరగబోతున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. దుబ్బాకలో టీఆర్ఎస్ నేత సోలిపేట రామలింగారెడ్డి, ఆ నియోజవకర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతుండగానే అకాల మరణం చెందారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అధికార పార్టీగా ఉన్న టీాఆర్ఎస్ అక్కడ గతంలో కొనసాగిన సత్సంప్రదాయాన్ని కొనసాగిద్దామని మిగిలిన పార్టీలను కోరలేదు. మిగిలిన పార్టీలు కూడా సోలిపేట కుటుంబానికి బాసటగా నిలిచే క్రమంలో ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఏకగ్రీవంగా గెలిపిద్దామని ముందుకు రాలేదు. మొత్తంగా ఉప ఎన్నిక అనివార్యంగా మారగా… టీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. సోలిపేట కుటుంబానికి షాకిచ్చేలా నయా పాలిటిక్స్ కు దిమ్మతిరిగేలా దుబ్బాక ప్రజలు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించారు.
ఇక ఏపీలోని తిరుపతి లోక్ సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక విషయానికి వస్తే… ఇక్కడ 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బల్లి దుర్గాప్రసాదరావు విజయం సాధించారు. ఇటీవలే అనారోగ్య కారణాలతో ఆయన చనిపోయారు. పాత సత్సంప్రదాయం కొనసాగే పక్షంలో దుర్గా ప్రసాదరావు కుటుంబంలోని ఎవరినో ఒకరిని ఆ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎంపిక చేసి లోక్ సభకు పంపాల్సి ఉంది. అయితే ఆ పరిస్థితులేమీ ఇప్పుడు కనిపించడం లేదు. చనిపోయిన దుర్గా ప్రసాదరావు కుటుంబానికి అండగా నిలిచే క్రమంలో అందరం కూడబలుక్కుని ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఏకగ్రీవం చేద్దామని ఇప్పటిదాకా వైసీపీ నుంచి ఎలాంటి పిలుపూ రాలేదు. సదరు పిలుపు ఉప ఎన్నిక జరిగేలోగా ఆ పార్టీ నుంచి వచ్చే అవకాశమూ కనిపించడం లేదు. వెరసి దుబ్బాక మాదిరే తిరుపతి లోక్ సభకు కూడా హోరాహోరీ పోరు తప్పేలా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నుంచి ఈ దిశగా ఏదైనా పిలుపు వస్తుందేమోనన్న భావనతో విపక్ష టీడీపీ ఇప్పటిదాకా తిరుపతి ఉప ఎన్నికపై ఎలాంటి వైఖరీ ప్రకటించలేదు. అయితే కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపీ మాత్రం నోటిఫికేషన్ విడుదల కాకముందే తిరుపతి బరికి తొడ కొట్టేసిన చందంగా తాను ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించేసింది. సొంతంగా ఆ పార్టీకి బలం లేకున్నా.. తెలుగు నేల రాజకీయాల్లో ఎప్పటినుంచో కొనసాగుతున్న సత్సంప్రదాయానికి తూట్లు పొడుస్తూ… ఉప ఎన్నికకు సై అని ప్రకటించేసింది. ఈ తరహా విపరీత ధోరణులు భవిష్యత్తులోనూ కొనసాగడం ఖాయంగానే కనిపిస్తున్నాయి. మొత్తంగా ఏళ్ల పాటు కొనసాగిన ఆ సత్పంప్రదాయం శాశ్వతంగా కనుమరుగైనట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.











