ఇద్దరికీ అధికారమే పరమావధి. ఆ దారిలో ఎవరినీ లెక్క చేయరు. వాళ్లనుకున్నదే చేసుకుంటూ పోతారు. 5 వందలకు పైగా ఎంపీలున్న ఈ అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని కనుసైగతోనే శాసించాలనుకుంటారు. అధికారం నిలబెట్టుకోవడానికి రూల్స్ మారుస్తారు.. రూల్స్ బ్రేక్ చేయిస్తారు. రాజకీయ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా లీడర్లను పార్టీలు మార్పించేస్తారు. తమ బలాన్ని బలవంతంగా పెంచుకుంటారు. వారే స్వర్గీయ ఇందిరాగాంధీ.. నరేంద్ర మోదీ. వీరిద్దరికి పోలికేంటి అనుకుంటున్నారా.. చాలా ఉన్నాయి..!
మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ వేరు
వీరిద్దరూ దాదాపు ఒకటే. కాకపోతే ట్రీట్ మెంట్ వేరు. మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ వేరు. మారిన పరిస్ధితులకు అనుగుణంగా ఇందిరాగాంధీ అప్పట్లో ప్రవర్తిస్తే.. ఇప్పుడు నరేంద్ర మోదీ ఆమెకు అప్డేట్ వర్షన్లా వ్యవహరిస్తున్నారు. ఇద్దరిదీ నియంతృత్వమే. ఇద్దరిదీ వన్ సైడ్ ఆలోచనలే. అప్పట్లో ఇందిరాగాంధీకి ఆయుధాలు తక్కువ.. ఆధిపత్యం ఎక్కువ. ఇప్పుడు నరేంద్ర మోదీకి ఆయుధాలు చాలా ఉన్నాయి.. ఆధిపత్యం దానంతటదే వచ్చేస్తుంది.
ఈ తరానికి అర్థం కాని ఎమర్జెన్సీ
ఎమర్జెన్సీ అంటే ఏంటని.. ఇప్పటి తరం ప్రశ్నిస్తూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే.. ఎమర్జెన్సీ అంటే నువ్వేమీ అడక్కూడదు.. నువ్వేమీ మాట్లాడకూడదు.. అలా చెప్పింది చేసుకుపోవాలంతే. నాకు ఆ హక్కు ఉంది.. ఈ హక్కు ఉంది.. అంటూ రెచ్చిపోతే తాట తీసి జైల్లో వేస్తారు. కోర్టులు కూడా ఏమీ చేయలేవు. అదే ఎమర్జెన్సీ. అదేంటి ఇప్పుడు కూడా అలాగే ఉందిగా అని అడక్కండి. అప్పటికి ఇప్పటికి తేడా ఉంది. 1975 జూన్ 25 నుంచి ఎమర్జెన్సీని ఇందిరాగాంధీ తీసుకొచ్చారు. అది మార్చి 21, 1977 వరకు కొనసాగింది. అంటే 21 నెలలపాటు అన్నమాట. మేడమ్ ఎమర్జెన్సీని తీసుకొచ్చింది కేవలం తనపై ఒక కోర్టు ఇచ్చిన తీర్పు అమలైతే ఆవిడ పదవి పోతుంది.. పదవి పోకుండా ఉండటానికే ఎమర్జెన్సీని తీసుకొచ్చారు. ఇలా ఎమర్జెన్సీ తీసుకురావడం వెనుక చాలా కథే జరిగింది. నెహ్రూ తర్వాత ప్రధానిగా పదవి చేపట్టిన ఇందిరాగాంధీ తన స్టయిల్ ఏంటో కొద్దిరోజుల్లోనే కాంగ్రెస్ నేతలకు తెలిసొచ్చేలా చేశారు. అంతా ఆవిడే డిసైడ్ చేసేవారు.. ఏ మాటకు ఎదురు లేకుండా చూసుకున్నారు. మిగతా మంత్రులు, మిగిలిన లీడర్లు డమ్మీలు అయిపోయారు.
Must Read ;- పతనావస్థలో శతాధిక పార్టీ!
బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు
వాటికి తోడు బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు వంటివి ఎకానమీని మలుపు తిప్పాయి. బ్యాంకుల జాతీయకరణ వెనక కూడా మంచి ప్లాన్ ఉంది. అప్పట్లో మన పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు భారీగా పెట్టే పరిస్ధితి లేదు. బ్యాంకులను జాతీయకరణ చేసి.. బ్యాంకుల్లో ఉన్న ప్రజల సొమ్మును వారికి లోన్లుగా ఇచ్చే ఏర్పాటు చేశారు ఇందిరాగాంధీ. దీని వలన దేశం పారిశ్రామికంగా ఎంతో కొంత అభివృద్ధి చెందిన్నది వాస్తవం. టాటా, బిర్లా వంశస్తులు అలాగే ఎదిగారు. కాని వారంతా తమ సొమ్ముతోనే ఎదిగారన్న వాస్తవం ఎంతమందికి తెలుసు? ఇక ఇందిరాగాంధీ తన సొంత ఇమేజ్ను పెంచుకున్నారు. బంగ్లాదేశ్ను విముక్తి చేయడానికి పాకిస్తాన్తో భారత్ చేసిన యుధ్ధం కూడా ఇందిరకు ఇమేజ్ పెంచింది. దీంతో 1971లో భారీ మెజారిటీతో గెలిచారు. ఇక తర్వాత న్యాయస్థానాల్లో ఏ ఆటంకం వచ్చినా..వెంటనే రాజ్యాంగ సవరణ చేసేయటం మామూలైపోయింది. అలా కోర్టులను కూడా ఇందిర డామినేట్ చేసేశారు.
జనంలో అసంతృప్తి మొదలు
1974 వచ్చేసరికి.. జనంలో అసంతృప్తి మొదలైంది. గుజరాత్లో విద్యామంత్రి వైఖరికి వ్యతిరేకంగా స్టూడెంట్స్ ఉద్యమం ఉధృతమై ఆ ప్రభుత్వమే పతనమవ్వటానికి దారి తీసింది. తర్వాత బీహార్ లో జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. అదే సమయంలో జార్జి ఫెర్నాండెజ్ నాయకత్వంలో రైల్వే కార్మికులంతా సమ్మెకు దిగారు. ఈ ఉద్యమాలన్నిటి మీద ఇందిరాగాంధీ ఉక్కుపాదం మోపారు. సమ్మెలో పాల్గొన్న రైల్వే కార్మికులను పీకేయటమే కాదు.. వారిని క్వార్టర్లలో కూడా ఉండకుండా ఖాళీ చేయించారు. ఇందిరాగాంధీ చూడటానికి స్మార్టే గాని.. ఇలాంటి విషయాల్లో చాలా వయలెంట్ అని అప్పుడే అందరికీ అర్ధమైంది. అంతలోనే అనుకోని విధంగా రాజకీయం, చరిత్ర రెండూ మలుపు తిరిగాయి.
అలహాబాద్ కోర్టులో రాజ్ నారాయణ్ కేసు
1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీపై పోటీ చేసి ఓడిపోయిన రాజ్ నారాయణ్ .. ఆమె అధికారాన్ని దుర్వినియోగం చేసి గెలిచారని అలహాబాద్ కోర్టులో కేసు వేశారు. దానిపై విచారణ జరిపిన కోర్టు 1975 జూన్ 12న తీర్పు ఇచ్చింది. అంటే ఎమర్జెన్సీ ప్రారంభానికి సరిగ్గా 13 రోజుల క్రితం. ఈ తీర్పే ఎమర్జెన్సీ ఆలోచనకు అంకురం అనుకోవచ్చు. ఇందిరాగాంధీ అధికారం దుర్వినియోగం చేసే గెలిచారని.. ఆ ఎన్నిక చెల్లదని.. ఆమె ఎంపీగా అనర్హురాలని ప్రకటించింది. దీనికి ముందు చరిత్రలోనే తొలిసారి ప్రధాని హోదాలో ఉన్న ఇందిరను కోర్టులో నిలబెట్టి క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఈ తీర్పుతో ఇందిరాగాంధీ షాక్ తిని సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా అదే తీర్పు వచ్చింది. అది 25 జూన్ 1975న. ఆ తీర్పు ఆర్డర్ కాపీ రాక ముందే .. జయప్రకాష్ నారాయణ ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు సైతం ఇందిర మాట వినకూడదని.. న్యాయం వైపు నిలబడాలనే నినాదం ఇచ్చారు. ఆ నినాదాన్నే చూపించి ఇందిరాగాంధీ చకచకా పావులు కదిపారు. రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అహ్మద్కు ప్రతిపాదన పంపి.. వెంటనే ఎమర్జెన్సీ విధించేశారు. అంతే అంతా మారిపోయింది.
వ్యతిరేక రాజకీయ నేతలందరూ జైలుపాలు
ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ తనకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ నేతలందరినీ జైలుపాలు చేశారు. హక్కులు లేవు.. కోర్టులు లేవు.. ఆమె చెప్పిందే వేదంలా నడిచింది. తనకు నష్టం చేసినవారిని.. నష్టం చేస్తారనుకున్నవారిని కూడా ఉక్కుపాదంతో తొక్కిపారేశారు. ఎప్పుడైతే నిర్బంధం తీవ్రంగా ఉంటుందో.. అప్పుడే తిరుగుబాటు కూడా వస్తోంది. జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో జనతాపార్టీ ప్రజల్లోకి వెళ్లింది. చివరకు 1977లో ఎమర్జెన్సీ ఎత్తేసి ఎన్నికలకు వెళితే.. ఇందిరాగాంధీ ఘోరంగా ఓడిపోయారు. జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది. కాని వారిలో గ్రూపులు రావడం.. వీక్ అవడం.. త్వరగానే ఆ ప్రభుత్వం పడిపోయి.. మళ్లీ ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చారు. ఇక ఆ తర్వాత ఇందిరాగాంధీ పాలిష్గా నియంతృత్వాన్ని చూపించారు. అధికారాన్ని ఉపయోగించి ప్రత్యర్థులను ఎలా తిప్పలు పెట్టాలో … అది కూడా పైకి కనపడకుండా ఎలా చేయాలో నేర్చుకున్నారు.
Also Read ;- సైనికుల అదుపులో మయన్మార్ గాంధీ
వాటినే అప్ డేటెడ్ వర్షన్స్గా..
ఆవిడ ఎమర్జెన్సీ విధించారు.. ఈయన విధించలేదు. అంతే తేడా.. మిగతాదంతా సేమ్ టు సేమ్. అవును ఇందిరాగాంధీ రూడ్గా వ్యవహరించి.. తర్వాత తెలుసుకుని తెలివిగా అణగదొక్కే స్ట్రాటజీలను తీసుకున్నారు. వాటినే అప్ డేటెడ్ వర్షన్స్గా మార్చుకుని ఇప్పుడు నరేంద్ర మోదీ వాడుతున్నారు. ఏ రాష్ట్రంలో అయినా మెజారిటీ రాకపోతే ఎమ్మెల్యేలను లాగేస్తారు. దానికి ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వరు. అదేమంటే అభివృద్ధి అంటారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేస్తారు. ఉత్తరాఖండ్, గోవా, మధ్యప్రదేశ్, రాజస్తాన్ లాంటి రాష్ట్రాల్లో అదే పని చేశారు. కొన్నిటిలో సక్సెస్ అయ్యారు.. కొన్నిటిలో కుదరలేదు. కాని అన్నిటిలోనూ తీవ్రంగా ప్రయత్నించారు.
ఏ ప్రాంతీయ పార్టీ నేతనైనా లొంగదీసుకోవాలంటే ముందు వారి మీదున్న కేసులేమిటో చూస్తారు. వాటి కథ ఏంటో తెలుసుకుని.. వారికి తెలియని విషయాలు కూడా తెలిసేలా చేసి.. వీరికి లొంగిపోయేలా చేసుకుంటారు. అందుకే వారు ఆ రాష్ట్రంలో ఒకలా మాట్లాడతారు.. ఢిల్లీకి వెళ్లాక మరోలా మాట్లాడతారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ లను చూస్తే మనకా విషయం ఈజీగా అర్ధమైపోతుంది. ఇక బంగ్లాదేశ్ చొరబాట్లు వంటి అంశాన్ని తీసుకుని.. సెంటిమెంట్లు రెచ్చగొట్టి.. ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేశారు. ఇప్పుడు బలంగా రాటుదేలారు. ఇప్పుడిప్పుడే అక్కడ వారిని తప్పించేవారే లేరు. అసోం, త్రిపుర, మేఘాలయ అన్నిటిలోనూ మోదీదే హవా ఇప్పుడు.
సర్జికల్ స్ట్రయిక్ చేస్తే చాలు
అప్పుడంటే ఇందిరాగాంధీ యుద్ధం చేయాల్సి వచ్చింది. వాజ్ పేయి కార్గిల్ వార్ చేయాల్సి వచ్చింది. కాని మోదీకి ఆ అవసరం లేదు. జస్ట్ ఒక సర్జికల్ స్ట్రయిక్ చేస్తే చాలు.. కావాల్సినంత .. కావాల్సిన మీడియా బోలెడంత ఉంది.. అక్కడ దానిని కరెక్టుగా స్ట్రయిక్ చేస్తారు.. ఇక అంతే జాతీయభావం ఉప్పొంగుతుంది.. మోదీగారి ఛాతీ కూడా ఉప్పొంగుతుంది. వారి బలం మరింత పొంగుతుంది. ఎక్కడ ఏ కార్డు అవసరమైతే ఆ కార్డు వాడుతూ.. రాజకీయంగా బలం పెంచుకోవటమే టార్గెట్గా నరేంద్ర మోదీ వ్యవహరించారు.. వ్యవహరిస్తున్నారు.
జేబు సంస్థలుగా సీబీఐ, ఈడీలు
సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు జేబు సంస్థలుగా మారిపోయాయి.. అల్సేషియన్ డాగ్స్ లాగా.. ఎవరి మీద ఎప్పుడు దాడి చేయమంటే అప్పుడు దాడి చేస్తాయా సంస్థలు. ఎవరిని లొంగదీసుకోవాలో.. ఎవరిని తొక్కిపారేయాలో వారి మీదకు వీరితో అటాక్ చేయిస్తారు. అప్పట్లో ఇందిరాగాందీ పోలీసులను మాత్రమే ఎక్కువగా వాడారు. కాని ఇప్పుడు.. పోలీసులు కేవలం సాయం చేయటానికే మిగతా కథంతా సీబీఐ, ఈడీ చూసుకుంటాయి. అలా అయిపోయింది పరిస్థితి.
ప్రణాళిక సంఘం ఉంటే.. అన్ని రాష్ట్రాలకు నిధులు వెళ్లిపోతాయి. అలా కాకుండా తమ దయాదాక్షిణ్యాల మీదే వెళితే.. రాజకీయ ప్రయోజనం ఉంటుంది. అందుకే దాన్ని రద్దు చేసి నీతి అయోగ్ అనే వ్యవస్ధను తెచ్చారు. దాని పేరుతో ప్రత్యేక హోదాను ఏపీకి రాకుండా చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ఆటంకాలు కలిగిస్తున్నారు. ఇవన్నీ రాజకీయంగా ఇక్కడ పట్టు పెంచుకోవడం కోసమే. తమకు అధికారం ఇస్తే చేస్తామని ఓపెన్ గానే బీజేపీ నేతలు చెబుతున్నారంటే … వారి ఆలోచన ఏంటో అర్ధం చేసుకోవచ్చు. రైల్వే కార్మికులను ఇందిరాగాంధీ తీవ్రంగా ఇబ్బందిపెడితే.. నేడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులను కూడా మోదీ ప్రభుత్వం అదే స్థాయిలో ఇబ్బందిపెడుతోంది. దొంగ కేసులు, బెదిరింపులతో నేతలను లొంగదీసుకోవాలని చూస్తోంది. మీడియాలో వ్యతిరేక ప్రచారం చేయించి.. ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తోంది.
న్యాయవ్యవస్ధలో సైతం
ఆఖరికి న్యాయవ్యవస్ధకు అదే పరిస్థితి వచ్చింది. అప్పట్లో ఇందిరాగాంధీ సైతం జడ్జీల నియామకంలో జోక్యం చేసుకున్నారు. కావాల్సినవాళ్లను పెట్టుకునే ఫార్ములాను ఫాలో అయ్యారు. ఇప్పుడు మోదీ సైతం అదే ఫాలో అవుతున్నారు. జనరల్ సొసైటీకి సంబంధించిన విషయాల్లో కోర్టులు బాధ్యతగా వ్యవహరించినట్లు కనపడతాయి.. అదే సమయంలో రాజకీయ సంబంధమున్న కేసుల్లో మాత్రం తేడా చూపిస్తాయనే అపవాదు ఉంది.
అలా అప్పట్లో ఇందిరాగాంధీ అన్నిటిని కంట్రోల్ చేయడానికి ఎమర్జెన్సీని వాడుకుంటే.. నరేంద్ర మోదీ ఆ ఎమర్జెన్సీ విధించకుండానే.. అదే పని చేస్తున్నారు. అన్నిటిని కంట్రోల్ చేస్తున్నారు. ఇతర నేతలు చేసిన, చేస్తున్న తప్పులే వారికి ఆయుధాలుగా మారుతున్నాయి. వాటిని వాడుకుంటూ చరిత్రను తమకు నచ్చినట్లుగా మలుపులు తిప్పుతూ రాజకీయాలను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇందిరలా జాతీయస్థాయిలో శాసించిన నేత.. ఆమె తర్వాత నరేంద్ర మోదీ మాత్రమే.