పరమశివుడు అభిషేకప్రియుడు .. దోసెడు నీళ్లతో అభిషేకం చేస్తే చాలు మురిసిపోతాడు .. అంకితభావంతో అడవిపూలను అర్పిస్తే చాలు పరవశించిపోతాడు. తోచినది నైవేద్యంగా సమర్పిస్తే తోబుట్టువులా వెన్నంటి ఉంటాడు.
భక్తులు తమ కష్టాలు చెప్పుకుంటే చాలు కరిగిపోతాడు .. వరాల వర్షం కురిపించడం కోసం పరుగు పరుగున వస్తాడు. అలాంటి సదాశివుడికి కార్తికమాసం అత్యంత ప్రీతికరమైన మాసంగా చెబుతారు. కార్తిక మాసం నుంచే చలిరోజులు మొదలవుతాయి. మంచుకొండల్లోని మహాశివుడు ఈ చలిరోజులను ఇష్టపడతాడు. ఈ కాలంలో లభించే పూలను .. పండ్లను సమర్పించిన భక్తుల పట్ల ఆయన ప్రత్యేకమైన ప్రేమను చూపుతాడు. శివుడికి ఈ మాసంలో చేసే పూజలు మాత్రమే కాదు, అభిషేకాలు కూడా విశేషమైన ఫలాలను అందిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
శివాలయాల్లో పంచామృతాలతోను .. పండ్ల రసాలతోను ఆ దేవదేవుడికి అభిషేకాలు నిర్వహిస్తుంటారు. కొంతమంది తమ పూజా మందిరాల్లోనే చిన్నపాటి శివలింగాన్ని ఏర్పాటు చేసుకుంటూ పూజాభిషేకాలు జరుపుతుంటారు. భక్తులు తమ శక్తి కొలది బంగారం .. వెండి .. రాగి .. ఇత్తడి .. స్పటిక శివలింగాలను పూజా మందిరాల్లో పెట్టుకుని ఆరాధిస్తూ వుంటారు. కార్తిక మాసంలో ఆయా శివలింగాలను మరింత భక్తి శ్రద్ధలతో అభిషేకిస్తారు. మహాశివుడి అభిషేకానికి వివిధ రకాల అభిషేక ద్రవ్యాలను వినియోగిస్తుంటారు.
పాలు .. పెరుగు .. కొబ్బరినీళ్లు .. ఇలా ఒక్కో అభిషేక ద్రవ్యం వలన ఒక్కో విశేషమైన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు సెలవిస్తున్నారు. ధర్మబద్ధమైన తమ కోరికలు నెరవేరాలనుకునేవారు, అందుకు సంబంధించిన అభిషేక ద్రవ్యాలను ఉపయోగించడం వలన మంచి ఫలితం కనిపిస్తుందని అంటారు. ఏదో ఒక కారణంగా కొంతమంది ఎప్పుడూ బాధలు పడుతుంటారు. వాటి బారి నుంచి బయటపడటానికి వాళ్లు ఆవుపాలతో పరమశివుడిని అభిషేకించవలసి ఉంటుంది. ఇక ఆర్ధిక పరమైన ఇబ్బందులు కూడా చాలామందిని సతమతం చేస్తుంటాయి.
అవమానాలు ఎదురయ్యేలా చేసేది .. ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేవి .. అత్యవసర పరిస్థితుల్లో నిస్సహాయంగా నిలబెట్టేవి ఆర్ధిక పరమైన సమస్యలే. అలాంటి ఆర్ధిక సమస్యలతో అవస్థలు పడుతున్నవారు, కొబ్బరినీళ్లతో శివుడిని అభిషేకించాలి. ఇక ఆర్ధిక ఇబ్బంది తరువాత అందరినీ కుంగదీసే సమస్య అనారోగ్యం. ఇది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది .. నిరాశా నిస్పృహలను కలిగిస్తుంది. సంతోషాన్ని సంహరించే ఆయుధంగా ఇది కనిపిస్తుంది. అలాంటి అనారోగ్యంతో బాధలు పడేవారు, ఆవుపెరుగుతో శివుడిని అభిషేకించడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని అంటారు. అందువలన పంచామృతాలలో ఒకటైన ఆవుపెరుగుతో ఈ కార్తిక మాసాన శివుడిని అభిషేకించాలి.
అంతర్గత శత్రువులుగా చెప్పబడే కామ .. క్రోధ .. లోభ .. మోహ .. మద .. మాత్సర్యాలు ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేస్తుంటాయి. నిగ్రహంతో వ్యవహరిస్తూ వీటిపై గెలుపును సాధించడం అంతతేలికైన పనేం కాదు. అలాగే జీవితంలో ఎదుగుతూ వుంటే శత్రువులు కూడా చెద పురుగుల్లా పుట్టుకొస్తూనే వుంటారు. అలాంటివారిని గ్రహించి దూరం పెట్టడం .. వాళ్లు సృష్టించే ఆటంకాలను అధిరోహించడం కూడా కష్టమే. అలా అంతర్గత శత్రువుల కారణంగా .. బయట నుంచి ఎదురయ్యే శత్రువుల కారణంగా అవరోధాలను ఎదుర్కొంటున్నవారు, ‘అవిసె నూనె’తో శివుడిని అభిషేకించడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.
‘ఏ జన్మలో ఏ పాపం చేశామో .. ఈ జన్మలో ఇన్ని కష్టాలు పడుతున్నాం’ అని చాలామంది అనుకుంటూ వుంటారు. గతంలో తాము చేసిన పాపాలే తమని ఇంతగా అవస్థలు పెడుతున్నాయని వాళ్లు భావిస్తూ వుంటారు. అలాంటివారు ‘భస్మ జలం’తో ముక్కంటిని అభిషేకించడం వలన, సమస్త పాపాలు నశిస్తాయి. ఇక మోక్షాన్ని కోరుకునేవారు ‘గంగాజలం’తో ఆ గంగాధరుడిని అభిషేకించవలసి ఉంటుంది.
ఎవరి జీవితంలోనైనా విజయమే కీలకం. అందుకే తాము ఎంచుకున్న రంగాల్లో విజయాలు సాధించడానికి ఎవరికి వారు ఎంతో కృషి చేస్తుంటారు. విజయాలు ఒక్కో మెట్టుగా పరచుకుంటూ వ్యక్తిని ఉన్నతమైన స్థాయికి తీసుకువెళతాయి. విజయం వల్లనే కీర్తి లభిస్తుంది .. విజయం వల్లనే సంపదలు సమకూరుతాయి. అలాంటి విజయాలను సాధించాలనుకునేవారు, ఆ దేవదేవుడిని నేరేడుపండ్ల రసంతో అభిషేకించాలి. అయితే శివుడికి పూజాభిషేకాలు చేసేవారు భస్మధారణ చేసి .. రుద్రాక్షమాలను ధరించి ఉండాలి. అప్పుడే ఆశించిన ఫలితం చేకూరుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.
– పెద్దింటి గోపీకృష్ణ











