సినిమాకి స్టార్ హీరో కాల్షీట్లు దొరికాయి.. కానీ సినిమా పట్టాల పైకి ఎక్కలేదు. చేతిలో వందలాది కథలు ఉన్నాయి.. కానీ హీరోకి ఒక్క కథ కూడా నచ్చడం లేదు. అది ఏ భాష సినిమా అయినా ఇదే పరిస్థితి.
సినిమా రంగంలో కథకు ఉన్న విలువ మామూలుది కాదు. ఒక సినిమాకి రెండు వేల కోట్లు కలెక్షన్లు రాబట్టాలన్నా, 500 కోట్లు పోగొట్టాలన్నా అది కథ చేతిలోనే ఉంది. మంచి కథ లేకపోవడం వల్లే సినిమాలు ముందుకు కథలకు. దర్శకుడు దాన్ని ఎలా తీయగలిగాడన్నది తర్వాత సంగతి.. ముందు ఓ మంచి కథ కావాలి.. అంతే. కథ అవసరం ఎలాంటిదో తెలిసిన కొందరు దర్శకులు ఏకంగా కథల కార్ఖానానే తెరిచేశారు. సినిమాలు తీయాలనుకున్నవారు కథల కోసం ఎక్కడెక్కడికో పరుగులు తీయాల్సిన పనిలేదు.
ఈ కార్ఖానాలో సంప్రదిస్తే వారికి మంచి కథను ఇవ్వడమే కాకుండా దానికి దర్శకుడిని అందించడం, ప్రమోషన్ బాధ్యతలు తలకెత్తుకోవడం కూడా చేస్తుంటారు. అలాంటి వారిలో అగ్రదర్శకులే ఉన్నారు. ప్రధానంగా ఈ విషయంలో పూరి జగన్నాధ్, సుకుమార్, గుణశేఖర్ లను చెప్పుకోవాలి. వీరెప్పుడూ మంచి కథల కోసం తాపత్రయపడుతుంటారు. అవసరమైతే ఓ టీమ్ ను చేరదీసి మంచి కథ కోసం కసరత్తులు చేయిస్తూ ఉంటారు.
కథ మింగేసే బాపతు ఎక్కువ..
సినిమా రంగంలో కథలు చెప్పగలిగే వారే బాగా రాణిస్తుంటారు. ఏదైనా విషయం చెబితే కథలు చెబుతున్నావా? అంటూ మనవారు ఆటపట్టిస్తుంటారుగానీ సినిమా రంగంలో కథలే చెప్పాలి. దాన్ని అందంగా చెక్కగలగాలి. కత కత కంగు దిగదీసి మింగు అనే పొడుపు కథను వినే ఉంటారు. కథలను లాగేసుకుని మింగేసే జనాలూ ఇక్కడ ఎక్కువే. సాధారణంగా దెయ్యాలు శ్శశానంలో తిరుగుతాయన్నది జనాల నమ్మకం.. సినిమా రంగంలో మాత్రం ఈ దెయ్యాలు చాలా ఎక్కువ. వీరిని ఘోస్ట్ లు అంటూ ఉంటారు.
Must Read ;- ‘లైగర్’ విజయ్ దేవరకొండ తో శివగామి
అవకాశాలు దొరకని వారు ఘోస్టులుగా మారిపోయి ఈ కథల కార్ఖానాల్లో పనిచేస్తుంటారు. అంతెందుకు కథ రాయలేకపోతే, లేదా రాయించలేకపోతే కోడైరెక్టర్ కూడా ఎప్పటికీ డైరెక్టర్ కాలేడు. అందుకే టాలెంట్ హంట్ ఉండాల్సిందే. కథ తయారైంది.. దాన్ని సినిమాగా వండాలంటే మంచి మాస్టర్ కూడా కావాల్సిందే. సినిమా అనేది సక్సెస్ వెంటే పరుగులు తీస్తుంది. ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టె వేరే దారి ఎందుకు వెతుక్కుంటుంది. కథల కోసం అందరూ ఇప్పుడు ఒకే దారి ఎంచుకుంటున్నారు.
కథ రాయగలిగే సత్తాలేకపోతే కొరియన్ సినిమాలు ఉండనే ఉన్నాయి. ఓ కొరియా సినిమా చూసి పారేసి దాన్ని తెలుగీకరించేస్తే మంచి సినిమా రెడీ. డైరెక్షన్ చేసే సత్తాలేకపోయినా కథ ఉన్నవాడు డైరెక్టర్ కావడం పెద్ద కష్టం కూడా కాదు. ఈ సమస్యలన్నీ బాగా తెలిసిన డైరెక్టర్లు ఈ కథల కార్ఖానాలు తెరిచారు. వీటికి తమాషా అయిన పేర్లు కూడా పెట్టేశారు. ‘success has many fathers.. failure is an orphan..’ అంటారు. సినిమా రంగానికి ఈ మాట అక్షరాలా వర్తిస్తుంది. ఇక్కడ సక్సెస్ తప్ప ఇంకోటి ఏదీ మాట్లాడదు.
కథలో దమ్ముంటే కలెక్షన్ల ఉప్పెనే
కథలో ఓ కొత్త పాయింట్ ఉంటే చాలు.. దాన్ని హృదయానికి హత్తుకునేలా తీయగలిగితే వంద కోట్లు వసూలు చేసేయవచ్చని ఇటీవల వచ్చిన ‘ఉప్పెన’ నిరూపించింది. ఈ కథ సుకుమార్ రైటింగ్స్ అనే కార్ఖానాలో తయారైంది. ఇలాంటి కథను తనే తెరకెక్కించాలని కూడా సుకుమార్ అనుకోలేదు. తన శిష్య బృందంలో బుచ్చిబాబు సానాని దర్శకుడిగా ఎంచుకుని బాధ్యతలు అప్పగించారు. ఫలితం ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇటీవల అనేక విజయాలను అందించి అగ్రస్థాయికి చేరిన అనిల్ రావిపూడి కూడా తక్కువ తినలేదు.
తన దగ్గర ఉండే ఎస్. కృష్ణ అనే అతను రాసిన కథ బాగా నచ్చి అతనికే దర్శకత్వ బాధ్యతలు అప్పగించి ‘గాలి సంపత్’ అనే సినిమా నిర్మిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహించడం కూడా మన సినిమా రంగంలో జరుగుతుంది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ప్రోత్సహించకపోతే ఎస్.ఎస్. రాజమౌళి గురించి మనకు తెలిసేది కాదు కదా. అలాగే కె. విజయ్ భాస్కర్ అనే దర్శకుడు కూడా తన దగ్గర రచయితగా పనిచేసిన త్రివిక్రమ్ ను ప్రోత్సహించారు. కాకపోతే ఇలాంటి ప్రతిభా వంతుల వల్ల ఆ దర్శకులు లాభపడుతున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.
సుకుమార్ రైటింగ్స్ మొదటిసారిగా ‘కుమారి 21 ఎఫ్’ అనే సినిమా చేసింది. ఆ తర్వాత దర్శకుడు, ఉప్పెన చిత్రాలు ఆ కోవలోనే వచ్చాయి. దర్శకుడు గుణశేఖర్ కూడా గుణ టీమ్ వర్క్ ప్రారంభించారుగానీ ఆయనకు సరైన విజయం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ బ్యానర్ లో ఆయనే సినిమాలు నిర్మించి రిస్క్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇంతకుముందు రుద్రమదేవి చేసిన ఆయన ఇప్పుడు ‘శాకుంతలం’ చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ పూరి జగన్నాథ్ గురించి మాట్లాడుకోవాలి. పూరి కనెక్ట్స్ పేరుతో పూరి జగన్నాథ్ ఛార్మితో కలిసి ఓ సంస్థను నెలకొల్పారు. అది ఎలాంటి కనెక్ట్సో తెలియదుగానీ ముఖ్యంగా కథల విషయంలో మాత్రం మంచి ఫలితాలే ఇస్తోంది.
ఇద్దరి కెరీర్ వేర్వేరుగా ప్రారంభమైనా ఈ కనెక్ట్స్ తో దగ్గరయ్యారు. ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో కలిసి ముందుకు సాగారు. పూరి కనెక్ట్స్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉందని చెప్పవచ్చు. ‘ఇస్మార్ట్ శంకర్’ రాకముందు ఎవరూ వీరిని అంతగా పట్టించుకోలేదు. ఈ రంగంలో సక్సెస్ తప్ప ఇంకోటి మాట్లాడదని ఇంతకుముందే మాట్లాడుకున్నాం. విజయదేవరకొండతో సినిమా చేయడానికి కూడా ఈ సక్సెస్ చాలావరకు ఉపయోగపడింది. పూరి కనెక్ట్స్ నుంచి వచ్చిన కథే ‘లైగర్’ కూడా. పూరి, చార్మి మధ్య కెమెస్ట్రీ బాగానే వర్కవుట్ అవుతోంది. మున్ముందు ఈ దర్శకుల కార్ఖానాలు మరింత బిజీ అయ్యే అవకాశం ఎక్కువగానే ఉంది.
– హేమసుందర్ పామర్తి
Also Read ;- సూపర్ స్టార్ మహేష్ పై రామబాణం ఎక్కుపెట్టిన రాజమౌళి