తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఎన్నో ఒడిదొడుకులు, సవాళ్లు, సంక్షోభాలను ఎదుర్కొని నిలబడింది. ‘సమాజమే దేవాలయం..ప్రజలే దేవుళ్లు’ నినాదంతో..తెలుగుదేశం పిలుస్తోంది..రా కదలిరా.. పిలుపుతో హైదరాబాద్లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ.. దేశంలో ఎన్నో రికార్డులను నెలకొల్పింది. ఎన్నో సంక్షోభాలను ఎదుర్కోంది. సంక్షోభాన్ని అధిగమించిన ప్రతిసారి విజయం సొంతమైంది.
9నెలల్లోనే తిరుగులేని విజయం
1982 మార్చి 29న ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ 9నెలల్లోనే తిరుగులేని విజయాన్ని సాధించింది. అప్పటివరకు సీల్డ్ కవర్ల ద్వారా సీఎంలను రాత్రికి రాత్రే మార్చేసిన అనుభవాలను ఎదుర్కొన్న ఉమ్మడి ఏపీలో రాజకీయ సమీకరణాలు మారాయి. మద్రాసీలు అనే చిన్నచూపు చూస్తున్న వారికి టీడీపీ సమాధానమైంది. బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారానికి దగ్గర చేసేవైపు అడుగులు పడ్డాయి. స్త్రీలకు ఆస్తిలో వాటాతోపాటు బీసీలకు ప్రాధాన్యం, రెండురూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాలు లాంటి ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీనుంచి వచ్చిన పథకాలే. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ స్వీకరించిన భృతి కేవలం రూపాయి మాత్రమే. దేశం మొత్తం ఇందిరే ఇండియా , ఇండియాయే ఇందిర..నినాదం కొనసాగుతున్న వేళ ఆ పార్టీ దేశం మొత్తం మీద 544స్థానాలకు 400 స్థానాల్లో గెలిచింది. అయితే ఏపీలో మాత్రం 42లో 35స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలిచింది. రాష్ట్రంలో 203 స్థానాలు గెలుపొందింది. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ బాటలో చాలామంది పయనించారు. నేటికి కొన్ని పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఇంకా ఉన్నాయంటే ఎన్టీఆర్ ఇచ్చిన మార్గదర్శకాలే అని చెప్పవచ్చు.
ఎన్నో పరిణామాలు..
పార్టీ 40ఏళ్ల ప్రస్థానంలో 1983లో నాదెండ్ల తిరుగుబాటు, 1984లో ఎన్నికల్లో గెలుపు, 1989లో పార్టీకి ఓటమి, 1994లో పార్టీలో తిరుగుబాటు, 1995లో చంద్రబాబు చేతికి పార్టీ పగ్గాలు రావడం, ఆ తరువాత జరిగిన ఎన్నికల్లోనూ అంటే 1999లోనూ టీడీపీ గెలుపులాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2004నుంచి 2014 వరకు పార్టీ ప్రతిపక్షంలోనే ఉండాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన తరవాత 2014లో ఏపీలో అధకారంలోకి రాగా, తెలంగాణలో15 అసెంబ్లీ స్థానాలను గెలిచింది. అయితే పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడడంతో ప్రస్తుతం తెలంగాణలో పార్టీ ఇబ్బందుల్లో పడింది.
క్రమశిక్షణకు మారుపేరు..
తెలుగు రాజకీయాల్లో టీడీపీ కంటే ముందు, టీడీపీ తరువాత అనే విశ్లేషణల ఇప్పటికీ ఉన్నాయంటే.. టీడీపీ విధానాలు ఏంటో అర్థం చేసుకోవచ్చు. క్రమశిక్షణ, అంకితభావం, సమాజ శ్రేయస్సు, అట్టడుగు వర్గాలకు చేయూత, శ్రమదానం, జన్మభూమి లాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను భాగస్వాములను చేయడం, చెరువుల పూడిక తీత, ఇలా..ఎన్నో కార్యక్రమాలు ఆ పార్టీనుంచి వచ్చాయి. ఇప్పటికీ రెండు తెలుగురాష్ట్రాల్లో వివిధ పార్టీల్లో ఉన్న నాయకుల్లో చాలా మంది టీడీపీ నుంచి వచ్చినవారే. దేశ రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే మరో కీలక నిర్ణయం తీసుకుంది టీడీపీ. చంద్రబాబు హయాంలో స్వీయ ఆస్తుల ప్రకటన విధానానికి నాంది పలికారు. వ్యక్తిగత ఆస్తులతో పాటు కుటుంబ ఆస్తులను ఎప్పటికప్పుడు బహిరంగంగా వెల్లడించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం చంద్రబాబును, టీడీపీని హేళన చేస్తున్నవారు..ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆస్తుల ప్రకటన చేయకపోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. పార్టీ విధానాలను మహానాడు వేదికగా నిర్ణయిస్తూ.. ఓపెన్ ప్లాట్ ఫాంపై పార్టీ నిర్ణయాలను ప్రకటించడంతోపాటు లోపాలను చర్చించుకోవడం లాంటి అవకాశాలను పార్టీ కల్పిస్తోంది. అందుకే పార్టీ వ్యవస్థాగతంగా అంత బలపడింది. కేంద్ర స్థాయిలో నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్, నేషనల్ ఫ్రంట్ల ఏర్పాటుకు టీడీపీ సారథ్యం వహించిందంటే..జాతీయ స్థాయిలోనూ తెలుగుదేశం పార్టీ ఎలాంటి కీలక భూమిక పోషించిందో అర్థం చేసుకోవచ్చు.
సంక్షేమ కార్యక్రమాలు..
అధికారంలో ఉన్నా లేకున్నా.. పార్టీ కార్యకర్తలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకూ అండగా ఉండడం కోసం పార్టీలో ఓ ప్రత్యేక విభాగం పనిచేస్తుంది. అంకితభావం కలిగిన కార్యకర్తల కుటుంబాలకు చేయూతనిస్తోంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గెలుపుతో బాధ్యత పెంచుకుంటూ.. ఓటమితో పాఠాలను నేర్చుకుంటూ వస్తున్న టీడీపీకి ఆటుపోట్లు కొత్తకాదని చెప్పవచ్చు. అంతేకాదు..ప్రస్తుతం కొన్ని పార్టీలు, కొందరు నాయకులు ప్రజలను తప్పుదోవపట్టించే విధంగా సామాజిక కోణంలో చేస్తున్న విమర్శలను పరిశీలిస్తే.. పార్టీలో కీలక స్థానాలు, పొలిట్ బ్యూరోల్లాంటి కార్యవర్గాల్లో ఆ సామాజికవర్గానికి చెందినవారు 4శాతం లోపే ఉన్నారు. అయినా విషప్రచారమే లక్ష్యంగా విమర్శలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు.
భవిష్యత్ ఏంటి..
ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ భవిష్యత్ పై చర్చ నడుస్తోంది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి రావడం, కొందరు నాయకులు కనీస విచక్షణ లేకుండా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ చర్చ నడుస్తోంది. అయితే పార్టీ ఇప్పుడున్న సంక్షోభాన్ని ఎదుర్కోవడం కష్టమే కాని..అసాధ్యం మాత్రం కాదని చెప్పవచ్చు. బలమైన నాయకత్వం, అంకితభావం ఉన్న నాయకులు ఉన్న పార్టీకి ఓటు బ్యాంకు తక్కువేమీ లేదు. 2019లో పార్టీ ఓటు బ్యాంకు 40శాతం ఉంది. అయితే 2009లో 28.12 శాతం, 2004లో 37.59 శాతం, 1989లో 36.5శాతం ఓట్లు రాబట్టింది. 1989లో కేవలం రెండు లోక్ సభ స్థానాలు మాత్రమే గెలవగా 2004లో 5, 2009లో 6 స్థానాలు గెలిచింది. అప్పుడూ ఇదే చర్చ పార్టీల్లో నడిచింది. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా ఉండడంతో ఈ చర్చ ఎక్కువైంది. తెలంగాణలోనూ బలమైన నాయకత్వం, కొన్ని విధానాలను పార్టీ మార్చుకుంటే.. కేడర్ ఇప్పటికీ పసుపు జెండా మోసేందుకు సిద్ధంగానే ఉందని ఇతర పార్టీల్లోనూ చర్చ నడుస్తోంది.
ఏది ఏమైనా.. పార్టీకి నాయకులకంటే..కార్యకర్తలే బలం అని నమ్మే పార్టీ కావడంతో టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమేమీ కాదు. అయితే విధానపరంగా తప్పటడుగులు, వ్యూహాత్మక వైఫల్యాలను సరిచేసుకోవడంతో పాటు గతంలో అనుసరించిన నాన్చివేత ధోరణుల్లాంటి విమర్శలను అధిగమిస్తే..పార్టీకి పూర్వవైభవం ఖాయమని చెప్పవచ్చు.
లోకేష్ లేఖ..
పార్టీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పార్టీ కార్యకర్తలకు రాసిన లేఖలో కీలకమైన అంశాలను, పార్టీ విధానాన్ని ప్రస్తావించారు. టీడీపీ ఒక పార్టీగా కాకుండా కోట్లాది మందితో కూడిన అతి పెద్ద ఉమ్మడి తెలుగు కుటుంబంగా వ్యాఖ్యానించారు. అందరితో ఆత్మీయత, అనుబంధం ముడిపడింది అని పేర్కొన్నారు. అధికారంలో వున్నా లేకున్నా పార్టీ కోసం పనిచేస్తున్న తెలుగుదేశం కుటుంబసభ్యులందరి సంక్షేమానికి పాటుపడుతున్నాం. ప్రమాద బీమా, విద్యా సాయం, పెళ్లికానుక వంటి ఎన్నో సౌకర్యాలు అందిస్తున్నామన్నారు.
Also Read:తెలుగుదేశం ముద్ర ఉంటే.. భయపడుతూ బతకాలా?