ఎన్టిఆర్.. ఈ పేరు తెలియని వారు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశంలో కూడా ఎవ్వరూ ఉండరనుకుంట బహుశా. అలా ఎందుకనాల్సి వస్తుందంటే తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో వినిపించిన మహానాయకుడతను కాబట్టి. తెలుగు వాడి పౌరుషానికి నిలువెత్తు నిదర్శనమే ఎన్టిఆర్ అనే ఈ మూడు అక్షరాలు. దశాబ్దాలుగా దేశంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ పాలనకింద తెలుగోడి ఆత్మగౌరవం నలుగుతున్న తరుణంలో తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం నేనున్నానంటూ కేవలం 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి సీఎంగా అధికారం చేపట్టి ఢిల్లీ పీఠాన్ని ఎన్టీఆర్ గడగడలాడించాడు. తెలగోడి ఆత్మగౌరవాన్ని దేశ నలువైపులా చాటిన వ్యక్తి. ఎన్టీఆర్ అధికారం చేపట్టడం.. తిరిగి ఓడిపోవడం.. మళ్లీ సీఎంగా గెలవడం జరుగుతూ వచ్చింది. ఇలా కొన్నేళ్ల తరువాత ఎన్టీఆర్ మరణం.. పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడి చేతిలోకి వెళ్లడం ఆయన కూడా పలుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఈ మధ్యలోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడడం జరిగిపోయాయి. ఆ తరువాత టీడీపీ తెలంగాణలో క్రమంగా కనుమరుగైపోయే స్థితికి చేరడం జరుగుతూ వచ్చింది.
అయితే తెలంగాణలో టీడీపీకి ఇప్పటికీ కొంత క్యాడర్, క్రీయాశీలక పార్టీ కార్యకర్తలున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అంటే అభిమానం ఉన్నవాళ్లు, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ అంటే అభిమానం ఉన్నవారూ తెలంగాణలో చాలామందే ఉన్నారు. ఇక్కడ సీన్ కట్చేస్తే.. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సమాధులను కూల్చివేయాలని ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఓవైసీ ఈ మధ్య చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. అక్బరుద్ధీన్ చేసిన ఈ వ్యాఖ్యలపై అందరికంటే ముందు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయే స్పందించారు. కేవలం స్పందించడమే కాదు. తన స్టైల్లో అక్బరుద్ధీన్కు తీవ్ర స్థాయిలో కౌంటరిచ్చారు కూడా. ఎన్టీఆర్ సమాధి మీద నువ్వు చేయివేసిన అరగంటలోనే దారూసలేంను తమ పార్టీ కార్యకర్తలు నేలమట్టం చేసేస్తారని సంచలన వ్యాఖ్యలను సంజయ్ చేశారు. టీడీపీ నాయకులకు ఎవ్వరికీ ఆ ఛాన్సును ఇవ్వకుండా పార్టీలకు అతీతంగా అక్బరుద్ధీన్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటరిచ్చి టీడీపీ నాయకులను ఆలోచింపజేశాడు. ఇంతటితో ఆగకుండా అక్బరుద్ధీన్ చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలుపుతూ ఈ రోజు ఎన్టీఆర్, పీవీ ఘాట్లను బండి సంజయ్ సందర్శించి తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్, పీవీ అభిమానుల దృష్టిని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. ఇక చేసేది లేక టీడీపీ, కాంగ్రెస్ నాయకులు సైతం ఒక్కొక్కరుగా అక్బరుద్ధీన్ వ్యాఖ్యలపై స్పందించడం మొదలుపెట్టారు.
Must Read ;- గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి బాలయ్య, లోకేష్!
సైలెంట్ గా ఎందుకున్నారు?
తెలగుజాతికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ అంటే పార్టీలకు అతీతంగా అభిమానించేవారున్నారు. మరి అలాంటి మహానేతపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు స్పాంటినియస్గా స్పందించాల్సిన ఎక్కువ బాధ్యత టీడీపీ నేతలపైనే ఉంది. కానీ బీజేపీ స్పందించినంతగా టీడీపీ నేతలెవ్వరూ అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై అంతగా స్పందించలేదనే చర్చ జరుగుతోంది. బండి సంజయ్ కూడా ఈ స్థాయిలో స్పందించడానికి కారణం కూడా లేకపోలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లను రాల్చడం కోసమే ఎన్టీఆర్పై అభిమానాన్ని ఒలకబోస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఎన్టీఆర్, టీడీపీ అభిమానుల ఓట్లను తమవైపు తిప్పుకునేందుకే ఎన్టీఆర్ను తన భుజంపై బండి సంజయ్ ఎత్తుకున్నారని పలువురు అంటున్నారు. ఎన్టీఆర్ను తమ ఆరాధ్య దైవంగా చెప్పుకునే టీడీపీ నేతలు అక్బరుద్ధీన్ చేసిన సంచలన వ్యాఖ్యలపై సైలెంట్గా ఉండడం వెనుకాల అంతరార్థం ఏమై ఉంటుందనే చర్చ కూడా ఆ పార్టీ కార్యకర్తల్లో జరుగుతోంది. గ్రేటర్లో టీడీపీ కూడా పోటీ చేస్తుంది. మైనార్టీల ఓట్ల కోసమే సైలెంట్ గా ఉంటూ అక్బరుద్ధీన్ మాటలపై అంతగా స్పందించలేదనే ప్రచారం సైతం జరుగుతోంది.
Also Read ;- ఎన్టీఆర్, పీవీ సమాధులపై సంచలన వ్యాఖ్యలు చేసిన అక్బరుద్ధీన్ ఓవైసీ











