ఏపీలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిని, ప్రభుత్వాన్ని విమర్శించే వారిని అన్నిరకాలుగా దెబ్బతీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్నవారిని ఆర్థికంగా దెబ్బతీసి తమవైపు తిప్పుకునే వ్యూహాన్ని అధికార వైసీపీ అమలు చేస్తోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి రవికుమార్ విషయంలోనూ అదే జరిగిందన్న విమర్శలున్నాయి. ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం, వారి వ్యాపారాలను, సంస్థలను దెబ్బతీయడం, వందల కోట్ల జరిమానాలు విధించడం కొన్నాళ్లుగా జరుగుతోంది. ఇటీవల గొట్టిపాటి రవికుమార్ క్వారీలు సీజ్ కాగా గతంలో పలువురు నాయకుల వ్యాపారాలను ప్రభుత్వం టార్గెట్ చేసిందనే చర్చ నడుస్తోంది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ఈ ఒత్తిళ్లు, వేధింపులు మొదలయ్యాయని నాయకులు చెబుతున్నారు. ఆ ఒత్తిళ్లు తట్టుకోలేక కొందరు నాయకులు వైసీపీలో చేరగా కొందరు బీజేపీ వైపు మొగ్గుచూపారు.
- రాయలసీమలో ప్రధానమైన నేతగా ఉన్న మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరులను వైసీపీ టార్గెట్ చేసింది. జేసీ దివాకర్ రెడ్డి క్వారీలను సీజ్ చేసింది. రూ.వందకోట్లకు పైగా జరిమానాలు విధించింది. ఇక దివాకర్ ట్రావెల్స్ బస్సుల రిజిస్ట్రరేషన్ విషయంలో దివాకర్రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్రెడ్డిని ఏకంగా జైలుకు పంపించింది ప్రభుత్వం.
- సినీ నటుడు బాలకృష్ణ చిన్నఅల్లుడు, టీడీపీ నేత అయిన శ్రీభరత్ ఛైర్మన్గా ఉన్న గీతం వర్సిటీని కూడా టార్గెట్ చేసింది వైసీపీ ప్రభుత్వం. రిషికొండ, ఎండాడ పరిధిలో 40.51 ఎకరాల్లో ఉన్నయూనివర్సిటీ.. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిందని ఆరోపిస్తూ ప్రహరీని కూల్చేశారు. అదే సమయంలో యూనివర్సిటీ కార్యకలాపాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని వైసీపీ ఎంసీ విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి రమేష్ పోక్రియాల్కు ఫిర్యాదు చేయడంతో పాటు యూజీసీ ఛైర్మన్ ఇంద్రపాల్ సింగ్కి లేఖ కూడా రాశారు. డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందేందుకు భూ యాజమాన్య హక్కుల పత్రాల్లో తప్పుడు వివరాలు నమోదు చేశారని, యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని కోరారు.
- Also Read ;- జగన్ జమానా.. హత్యలు, అరెస్టులు, దాడులు, బెదిరింపులు
- ప్రకాశం జిల్లాలోనే మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు గ్రానైట్ క్వారీ లీజులను ఏపీ సర్కార్ రద్దు చేసింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్కి సన్నిహితంగా ఉండడంతోపాటు వైసీపీలోకి వచ్చేందుకు విముఖత వ్యక్తం చేయడంతో క్వారీల అనుమతులు రద్దయ్యాయి. ఇక అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి ఉన్న పలు క్వారీలను సీజ్ చేయడంతో పాటు రూ.324 కోట్ల జరిమానా విధించారు.
- గతంలో టీడీపీలో ఉండి తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపికై, ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ ఎంపీ గరికపాటి మోహన్రావు క్వారీని కూడా వైసీపీ ప్రభుత్వం సీజ్ చేసింది. ప్రకాశం జిల్లా బల్లికురువ ప్రాంతంలో ఉన్నక్వారీ గతంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు నోటీసులు ఇవ్వడంతో పాటు రూ.200 కోట్ల జరిమానా విధించారు. అయితే, ఆయన న్యాయస్థానానికి వెళ్లి స్టే తెచ్చుకోగా రెండోసారి నోటీసులు ఇచ్చి, వెంటనే పర్మిట్లు నిలిపి వేశారు.
- విశాఖ జిల్లాలో టీడీపీ నేతలు, టీడీపీ నేతల సన్నిహితులను కూడా టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీకి సన్నిహితంగా ఉంటున్నారన్న కారణంతో హర్షవర్దన్ యజమానిగా ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ లీజును అర్థంతరంగా రద్దు చేయడం, నోటీసులు ఇచ్చిన వెంటనే సామాన్లు రోడ్డమీద పడేయడం చర్చనీయాంశమైంది. VRMDAకు చెందిన స్థలాన్ని 2024 వరకు లీజుకు తీసుకోగా బలవంతంగా ఖాళీ చేయించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
- మరో టీడీపీ నేత సబ్బం హరి ఇంటి ప్రహరీని కూడా మున్సిపల్ స్థలం ఆక్రమించారన్న ఆరోపణతో కూల్చేశారు. ఈ విషయంలో తమకు నోటీసులు కూడా ఇవ్వలేదని సబ్బం హరి చెబుతున్నారు. అప్పట్లోనే ఆయన వైసీపీ కీలకనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు.
- ఇక టీడీపీలో గతంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రులు, వియ్యంకులు గంటా శ్రీనివాసరావు, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ సైలెంట్గా ఉండేందుకు కూడా ఆర్థికపరమైన అంశాలే కారణమని తెలుస్తోంది. శిద్దా రాఘవరావు, కరణం బలరాం తదితరులు కూడా ఆర్థికపరమైన అంశాల వల్లనే వైసీపీలో చేరినట్టు ప్రచారం జరుగుతోంది.
- ఇక టీడీపీ ఎంపీ, అమరరాజా గ్రూపు అధినేత గల్లా జయదేవ్ని కూడా వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందనే ఆరోపణలున్నాయి. అమరరాజా గ్రూపునకు చెందిన అమరరాజా ఇన్ ఫ్రా టెక్ సంస్థకు గతంలో ఇచ్చిన భూ కేటాయింపులను వైసీపీ ప్రభుత్వం గత ఏడాది రద్దు చేసింది. వైఎస్ హయాంలో 253.6 ఎకరాల ప్రభుత్వ భూమిని సదరు సంస్థకు కేటాయించారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..భూములు వినియోగించడం లేదన్న కారణం చూపుతూ భూములు వెనక్కి తీసుకుంది.
- ఇక టీడీపీలో కీలక నేతగా ఉన్న అశోక్ గజపతిరాజు విషయంలో అన్ని మార్గాలను ఎంచుకుంది వైసీపీ. మన్సాస్ ట్రస్ట్ , సింహాచలం బోర్డు, 120కి పైగా దేవాలయాల్లో అనువంశిక ఛైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజును తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన కామెంట్లు కూడా ఈ కోణంలోనే ఉన్నాయి. టీడీపీ నుంచి చాలామంది లీడర్లు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, బీజేపీలో చేరితే వారి ఆస్తులు సేఫ్గా ఉంటాయనే అర్థం వచ్చే కామెంట్లు చేశారంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
Must Read ;- సర్కార్కు మరో చెంపదెబ్బ : అశోక్ పైచేయి