దుబ్బాక ఓటమి, జీహెచ్ఎంసీలో ఆశించిన సీట్లు రాకపోవడం టీఆర్ఎస్ను షాక్కి గురి చేసింది. టీఆర్ఎస్కు ఎదురుగాలి మొదలైందని, ఆ ఎదురుగాలిని ఆపాలంటే.. రాజకీయ సమీకరణాల్లో మార్పు తేవాలనే అంశంపై కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారన్న చర్చ మొదలైంది. అందులో భాగంగానే రెండు రోజులుగా రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. అందులో వైసీపీని తెలంగాణలో మరింత విస్తరించేలా జగన్ని ప్రోత్సహించడం ఒక అంశమైతే, కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా పోరాడేందుకు జాతీయ స్థాయిలో వామపక్షాలను కలుపు కోవడం రెండో అంశం. మొదటి అంశానికి వస్తే.. తెలంగాణలో విస్తరణకు షర్మిల సారధ్యంలో పార్టీ కార్యకలాపాలు నడపాలని భావిస్తున్నట్లు కొన్ని కథనాలు వస్తున్నాయి.
షర్మిల పాదయాత్ర..
గతంలో జగన్ జైలుకి వెళ్లిన సమయంలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేశారు. తెలంగాణలోనూ పర్యటించారు. ఇక వైఎస్ అభిమానులు, ఆ సామాజిక వర్గానికి చెందినవారు కూడా తెలంగాణలో భారీగానే ఉన్నారు. వారిని వైసీపీ తన వైపు తిప్పుకుంటే.. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు అటు కాంగ్రెస్కు, ఇటు బీజేపీకి వెళ్లకుండా వైసీపీకి వస్తుందని, తద్వారా తమకు లాభం చేకూరుతుందని టీఆర్ఎస్ అంచనా వేసినట్లు ప్రచారం జరగుతోంది. ఇదంతా ప్రచారమే.. పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక వైసీపీ తెలంగాణలో తమ పార్టీని విస్తరించాలంటే..కొన్ని ప్రధాన అడ్డంకులున్నాయి.
Must Read ;- తెలంగాణ వైసీపీ.. అలాంటిది ఒకటి ఉందా?
- టీఆర్ఎస్కు సీమాంధ్రుల్లో చాలామంది ఓట్లు వేశారని, అందుకే కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలిచిందని, టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు మాత్రమే బీజేపీకి పడ్డాయని గులాబీ దళం భావిస్తోంది. అయితే టీఆర్ఎస్కు పడిన సీమాంధ్ర ఓట్లలో అన్ని పార్టీలవీ ఉండే అవకాశం ఉంది. అంటే ఇక్కడ టీడీపీ, జనసేన, వైసీపీ ఓటు బ్యాంకులు, సీమాంధ్రకు చెందిన తటస్థ ఓటర్లు, వైఎస్ అభిమాన ఓటు బ్యాంకు, సామాజిక వర్గాల ఓటు బ్యాంకులను వేర్వేరుగా చూడాల్సి ఉంటుంది.
- గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వైసీపీ వ్యతిరేకించింది. మానుకోట ఘటనను తెలంగాణలో చాలామంది ఇప్పటికీ మర్చిపోలేదు. తెలంగాణ ఉద్యమంలో మానుకోట ఘటన కీలక పరిణామమని చెప్పవచ్చు. అప్పటి వరకు జరుగుతున్న తెలంగాణ ఉద్యమం..కొత్త పోకడలకు దారి తీసిన ఘటన అది.
- ‘తెలంగాణలో వైసీపీ క్రియాశీలంగా మారితే..ఆ సామాజిక వర్గం ఓట్లలో చీలిక వస్తుంది. ఆ సామాజిక వర్గంలో ఉన్న టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లలో చీలిక వస్తుందనే అంచనా పార్టీలో ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే తెలంగాణ వైసీపీలో ఉన్న నాయకులు, నేతలు క్షేత్రస్థాయిలో ఆ పని ఎంతవరకు చేయగలరు అనే ప్రశ్న తలెత్తుతోంది. పాదయాత్రకు, బహిరంగ సభలకు రావడం వేరు.. ఓట్లు వేయడం వేరు.. ఈ నేపథ్యంలో 2023 టార్గెట్గా వెళ్తే.. ఈ రెండేళ్ల టైంలో (2021 మరో 23రోజుల్లోనే వస్తుంది) పార్టీ క్షేత్రస్థాయి పునర్నిర్మాణం ఎంతవరకు సాధ్యమవుతుందనే ప్రశ్న తలెత్తుతోంది.
- వైఎస్ రాజశేఖర్రెడ్డి వెనుక అన్ని వర్గాలవారూ ఉన్నారు. అభిమానుల్లో అన్ని పార్టీలవారూ ఉన్నారు. వారిలో తెలంగాణలోని ఆయన సామాజిక వర్గానికి చెందినవారు ఒక భాగం. అయితే జగన్, షర్మిల లాంటివారు వైఎస్ రాజశేఖర్రెడ్డి తరహాలో ఆ వర్గాన్ని ఎంత వరకు తమవైపు తిప్పుకోగలరనే ప్రశ్న తలెత్తుతోంది.
- వైసీపీ కేవలం సామాజికవర్గ పరంగా ఆలోచిస్తే..మిగతా పార్టీల్లో, మిగతా కులాల్లో ఉన్న వైఎస్ అభిమానులు కచ్చితంగా దూరం అవుతారు. అది పరోక్షంగా ఏపీలోనూ ఆ పార్టీకి నష్టం చేయనుంది.
- తెలంగాణలో పార్టీని విస్తరించాలంటే.. పార్టీని పూర్తిస్థాయిలో అధికారంలోకి తీసుకొస్తామనే నమ్మకం పార్టీలోకి వచ్చేవారికి కలిగించాలి. అలాంటప్పుడు ఇక్కడున్న ప్రభుత్వాలను కచ్చితంగా విమర్శించాల్సి ఉంటుంది. అది రాజకీయంగా ఇబ్బంది కానుంది.
- అదే సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది కాంగ్రెస్కు ఉపయోగపడుతుంది. వైఎస్ను తెలంగాణలో కాంగ్రెస్కు చెందిన వ్యక్తిగా చూసేవారు కూడా చాలా మంది ఉన్నారు.
- రాష్ట్ర విభజన అనంతరం 2017 నుంచి తెలంగాణలో వైసీపీ కార్యక్రమాలు దాదాపు నిల్ అని చెప్పాలి. ఇప్పుడు తెలంగాణలో పార్టీని విస్తరించే కార్యక్రమాలు ప్రారంభించాలంటేనే.. చాలా బలమైన కారణం కావాలి. అది తెలంగాణలో జగన్ పార్టీకి ఎంతవరకు దొరుకుతుందనేది చూడాలి.
- ఇక కేసీఆర్కు లబ్ధి చేకూర్చే విధంగా వైసీపీ డైరక్ట్గా వ్యవహరిస్తే.. బీజేపీ కూడా జగన్పై డైరెక్ట్ వార్కు దిగడం ఖాయంగా కనిపిస్తుందనే అంచనా ఉంది.
ఇన్ని పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ విస్తరించే ప్రణాళికను మొదలు పెడితే.. లాభం కంటే నష్టం ఎక్కువగా జరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రధాన యుద్ధక్షేత్రమైన ఏపీని వదిలి వైసీపీ ఇక్కడ వ్యూహాలు అమలు చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాకపోవచ్చని చెప్పవచ్చు.
Also Read ;- ఎస్కేప్ : తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మిస్సింగ్ కనిపించడంలేదు