(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రామతీర్థం కోదండరాముని శిరశ్ఛేదన ఘటన చుట్టూ తిరిగి .. జిల్లా మంత్రి, వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ పై ప్రభావం చూపుతున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో కీలక నేతగా, వైసీపీలో మంచి వక్తగా, విజయనగరం జిల్లాలో తిరుగులేని నేతగా కొనసాగుతున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ .. రామతీర్థం వ్యవహారంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించలేదని, ఆ ఘటనకు గల కారణాలు, అనంతర పరిణామాలు.. తద్వారా ప్రభుత్వానికి, పార్టీకి చేకూరిన డేమేజ్ అంచనా వెయ్యడంలోనూ, తిప్పికొట్టడంలోనూ విఫలమయ్యారని ముఖ్యమంత్రికి అందిన సమాచారం మేరకు .. ఈ విషయంలో బొత్సకు సీఎం వివరణ కోరినట్లు .. కొంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
బొత్సకు రాములోరి సెగ ..
విజయనగరం జిల్లాలో అంతా తానై వ్యవహరిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణకు ఇటీవల జరిగిన రామతీర్థంలో రాముల వారికి జరిగిన ఘోర అవమానం ఘటన సెగ బాగానే తలుగుతోందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ అధినేత, సీఎం జగన్ మంత్రి బొత్స సత్యనారాయణ నుంచి వివరణ కోరినట్టు వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నిజానికి రాష్ట్రంలో అనేక ఆలయాలపై దాడులు జరిగినా రామతీర్థంలో జరిగిన ఘటన మాత్రం పరాకాష్టగా మారింది. హిందువులు ఎంతో ఆరాధనా భావంతో పూజించుకునే రాముడి తలను కొందరు దుండగులు ఛేదించడాన్ని హిందూ సామాజిక వర్గం జీర్ణించుకోలేక పోతున్న మాట వాస్తవం. పైకి దీనికి ఎన్ని రాజకీయాలు అంటగట్టినా వాస్తవంగా మాత్రం ప్రజల్లో చాలా ఆవేదన ఉంది.
Must Read ;- అర్రెర్రే.. కూల్చివేతల దూకుడులో ఝలక్ బొత్సకే పడ్డదే!
ఇంటిలిజెన్స్ నివేదకల్లోనూ ..
రామతీర్థం ఘటనపై సీఎం జగన్ తెప్పించుకున్న ఇంటిలిజెన్స్ నివేదికలో ఇవే విషయాలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందని ఇది ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామం సృష్టించే అవకాశం ఉందని నివేదికలు అందాయని తెలిసింది. దీంతో ఒకింత ఉలిక్కి పడిన ప్రభుత్వం.. హుటాహుటిన.. ఈ వివాదం నుంచి తప్పించుకునేందుకు కాయకల్ప చికిత్సకు దిగింది. ఈ క్రమంలోనే విజయవాడలో ఆలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయినప్పటికీ.. విజయనగరం జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణపై జగన్ ఒకింత ఆగ్రహంతో ఉన్నారనేది వైసీపీ నేతల మాట. ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ కన్వీనర్గా విజయసాయిరెడ్డి ఉన్నప్పటికీ.. విజయనగరంలో బొత్స సత్యనారాయణ దూకుడే ఎక్కువగా ఉందని సమాచారం. దీంతో అన్నీ బొత్స సత్యనారాయణ కనుసన్నల్లోనే సాగుతున్నాయి.
రామతీర్థం ఘటనలో ..
రామతీర్థం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో ఈ విషయాన్ని పసిగట్టడంలోను, లేదా.. ఘటన జరిగిన తర్వాత.. దాని నుంచి ప్రభుత్వంపై విమర్శల బాణాలు పడకుండా నిలువరించడంలోను.. బొత్స సత్యనారాయణ విఫలమయ్యారనేది వైసీపీ అధినేత భావిస్తున్నారని అంటున్నారు సీనియర్లు. ఈ క్రమంలోనే అసలు ఏం జరిగింది? విజయనగరంలో ఘటనకు ముందు తర్వాత.. జరిగిన పరిణామాలు.. వంటివాటిపై నివేదిక ఇవ్వాలంటూ బొత్స సత్యనారాయణను ఆదేశించారని తెలిసింది.
లోపించిన వ్యూహం
విజయనగరంపై బొత్స సత్యనారాయణకు ఉన్న పట్టు నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత.. అవి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారకముందుగానే.. వ్యూహాత్మకంగా బొత్స వ్యవహరించి, ప్రతిపక్షాల దూకుడుకు చెక్ పెట్టేలా వ్యవహరించి ఉంటే బాగుండేదనేది జగన్ మాటగా సీనియర్లు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. బొత్స సత్యనారాయణ నివేదికను కోరారనేది విషయం సుస్పష్టమవుతోంది. ఈ విషయంపై మంత్రి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
Must Read ;- సీఎం జగన్తో పీకే భేటీ: రాజకీయ వ్యూహాల కోసమేనా?