తెలంగాణలో బీజేపీకి, అధికార టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ తారస్థాయిలో నడుస్తున్న తరుణంలో ప్రధాని మోదీకి కేసీఆర్ రాసిన ఓ లేఖ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. కొత్తగా నిర్మించనున్న పార్లమెంటు భవనం విషయంలో ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఆ లేఖలో‘కొత్తగా నిర్మించనున్న పార్లమెంటు భవన శంకుస్థాపన కార్యక్రమానికి వర్చువల్ ద్వారా హాజరు’ అవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కొత్త పార్లమెంటు భవనం దేశ ఔన్నత్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక. జాతికే గర్వకారణం. ఈ భవన నిర్మాణం వేగంగా పూర్తి కావాలని ఆకాంక్షిస్తున్నా అని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీకగా భావించే పార్లమెంటు భవనం విషయంలో ఓ రాష్ట్ర సీఎం ఇలా ఆకాంక్షించడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ ఉండదు. కాని ఇటీవల జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటేనే.. కేసీఆర్ లేఖ చర్చనీయాంశమైంది.
విమర్శలు.. ప్రతి విమర్శలు
వాస్తవానికి 2015 నుంచి 2018 వరకు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్లు బీజేపీపై విమర్శలు చేయడం, బీజేపీ ప్రతి విమర్శలు, ఆరోపణలు చేయడంతోనే ఆగినా.. 2019లో లోక్ సభ ఎన్నికల సమయంలో ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగినట్టు కనిపించింది. ఆ ఎన్నికల్లో సారు..కారు..16 నినాదంతో టీఆర్ఎస్ ఎన్నికలకు వెళ్లినా.. 9తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీజేపీ 4 గెలిచింది. నిజామాబాద్లో కేసీఆర్ కుమార్తె కవిత ఓటమి చెందాల్సి వచ్చింది. ఆ ఎన్నికల తరువాత తెలంగాణలో బీజేపీ ఎంపీలు టీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో విమర్శలు మొదలు పెట్టారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్తో హోరాహోరీగా బీజేపీ సీట్లు గెలవడంతో తెలంగాణలో తామే ప్రత్యామ్నాయమని ఆ పార్టీ చెబుతోంది. అదే టైంలో కేసీఆర్ కూడా బీజేపీని తూర్పర పడుతున్నారు.
బంద్కు టీఆర్ఎస్ మద్దతు
మంగళవారం వ్యవసాయ బిల్లుపై భారత్ బంద్కు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్బంగా సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. వరద సాయం రూ.1350కోట్లు ఇవ్వాలని లేఖ రాసినా పైసా ఇవ్వలేదని చెబుతూనే..త్వరలోనే జాతీయస్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలను ఏకం చేస్తానని, హైదరాబాద్లోనే మీటింగ్ పెడతానని, మోడీతో ఇక యుద్దమే అని వ్యాఖ్యానించారు కేసీఆర్. ఓ వైపు టీఆర్ఎస్ విమర్శలు, బీజేపీ ప్రతి విమర్శలు నడుస్తూనే ఉన్నాయి.
Must Read ;- కేంద్రంపై కాలుదువ్వుతున్న టీఆర్ఎస్!
గతంలోకి వెళ్తే..
కొత్త భవనాల నిర్మాణ అంశంపై టీఆర్ఎస్పై గతంలో తెలంగాణలో పార్టీలు విమర్శలు చేశాయి. సెక్రటేరియట్ కూల్చివేత టైంలో కాంగ్రెస్, బీజేపీతోపాటు అన్ని పార్టీలూ టీఆర్ఎస్ను విమర్శించాయి. దీనికి కౌంటర్గా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. లాక్ డౌన్ ల సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లిన సంక్షిష్ట పరిస్థితుల్లో భారీ బడ్జెట్తో కొత్త పార్లమెంటు భవనం అవసరం ఏంటని ప్రశ్నించారు. అక్కడ బీజేపీ కట్టుకోవచ్చు.. ఇక్కడ మాత్రం పాత భవనాల్లోనే పాలన ఉండాలా అని కూడా ప్రశ్నించారు. మరికొందరు టీఆర్ఎస్ నాయకులు.. వల్లభాయ్ పటేల్ విగ్రహానికి (స్టాట్య్చూ ఆఫ్ యునిటీ) అయిన వ్యయంపై ప్రస్తావించారు. ఎన్ని విమర్శలు వచ్చినా తెలంగాణలో కొత్త సచివాలయ నిర్మాణంపైవే టీఆర్ఎస్ మొగ్గు చూపింది.తాజాగా కేసీఆర్ కొత్త పార్లమెంటు భవనం విషయంలో లేఖ రాయడంతో మళ్లీ చర్చ మొదలైంది
ఇతర విషయాలపైనే వారి ఆసక్తి
ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు స్పందిస్తూ.. అటు కేసీఆర్, ఇటు మోడీ..ప్రజాసమస్యల పరిష్కారం కంటే.. ఇతర విషయాలపై ఆసక్తి చూపుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. టీఆర్ఎస్కి చెందిన నాయకులతో ప్రస్తావిస్తే..కొన్ని నిర్ణయాలతో ప్రజా సంక్షేమం కోసం, దేశ ఔన్నత్యం కోసం ఎవరితోనైనా కలుస్తుందని, అవసరమైతే ఎవరితోనైనా పోరాడుతుందని చెబుతూనే కొవిడ్ టైంలో మోడీ ఇచ్చిన ప్రతి పిలుపుపైనా కేసీఆర్ ప్రభుత్వం స్పందించిందని వ్యాఖ్యానిస్తున్నారు.కేంద్రంలో కొన్ని బిల్లుల విషయంలో టీఆర్ఎస్ ఎంపీలు.. బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఆ బిల్లుల ప్రత్యేకతను బట్టి కొన్నిసార్లు మద్దతు పలికామని టీఆర్ఎస్ నాయకులు గతంలోనూ వ్యాఖ్యానించారు.
మొత్తం మీద కేసీఆర్ రాసిన లేఖ విషయంలో ‘కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా.. దానికి ఓ ఈక్వేషన్ ఉంటుందని, రానున్న కాలంలో తీసుకునే నిర్ణయాలను బట్టి..ఆ ఈక్వేషన్ ఏంటనేది అంచనావేయవచ్చ’నే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది.
Also Read ;- దూకుడు తగ్గని బీజేపీ.. గులాబీ శిబిరంలో గుబులు