తమిళ హీరో సూర్య ‘ఆకాశం నీ హద్దురా‘ సినిమా విజయోత్సాహంతో ఉన్నాడు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాకి సూర్య నటన పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి. ఇందులో కొత్త సూర్యను చూశామని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా అభిప్రాయపడ్డారు. ఈ జోష్ తోనే సూర్య మరో మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు.
తమిళ దర్శకులు పాండిరాజ్, హరి, వెట్రిమారన్ లతో వరుసగా సూర్య తన తదుపరి సినిమాలు చేయనున్నాడు. ఈ మూడు సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు రిలీజ్ అయ్యాయి. అంతేకాకుండా ఈ మూడు సినిమాల తర్వాత.. గౌతమ్ మీనన్, విక్రమ్ కుమార్ సినిమాలు కూడా సూర్య లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ముందుగా సూర్య పాండిరాజ్ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నాడని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు పాండిరాజ్ రష్మిక మందన్నను హీరోయిన్ గా ఫైనల్ చేసాడని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత షూటింగ్ ప్రారంభం అవుతుందని కోలివుడ్ లో టాక్.
ఇక దర్శకుడు హరితో సూర్య సినిమా ఉంటుందో లేదో అని అందరూ భావించారు. అందుకు కారణం ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు సూర్య ప్రకటించిన నేపథ్యంలో ఆయనపై దర్శకుడు హరి తీవ్ర విమర్శలు చేశాడు. అందుకనే వీరిద్దరి కలయికపై సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆ సందేహాలను పటాపంచలు చేస్తు హరితో సినిమా చేయనున్నాని సూర్య ప్రకటించాడు. సూర్య, హరి కలయికలో సింగం సిరీస్ మూవీస్ ఏ రేంజ్ లో హిట్టయ్యాయో అందరికీ తెలిసిందే. ఇలా సూర్య వరుస సినిమాలను ఓకే చేస్తూ కోలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. వచ్చే ఏడాది కనీసం రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాలని సూర్య భావిస్తున్నాడు. మరి సూర్య ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.
Must Read ;- గాయాలను లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొంటున్న తమిళ తల