ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ జగన్ సారథ్యంలోని ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఒక్కమాటలో చెప్పాలంటే వైఎస్ జగన్ ప్రభుత్వం డైరెక్ట్గా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. ఇక సుప్రీంకోర్టు తీర్పుతో పంచాయతీ ఎన్నికలకు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం సహకరించాల్సి వచ్చింది. క్షేత్రస్థాయిలో ఎన్నికలకు జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తున్న జిల్లాల పర్యటనల్లో భాగంగా కడప జిల్లాలోనూ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి వచ్చానని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులు తప్ప తనకు ఎవరి ఆశీస్సులూ లేవని వ్యాఖ్యానించారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో తాను ఆర్థిక శాఖలో ఉన్నానని, తాను చెప్పదలుచుకున్న అభిప్రాయన్ని, నిర్ణయాన్ని నిర్భయంగా చెప్పే స్వేచ్చను వైఎస్ ఇచ్చారని అన్నారు. వైఎస్ ఆశీస్సులతోనే తాను రాజ్ భవన్కు వెళ్లానని వ్యాఖ్యానించారు. అదే సమయంలో సీబీఐ కేసుల విషయంలో తాను సాక్షిగా ఉన్నానని, ఏనాడూ తాను ఇబ్బంది పడలేదని వ్యాఖ్యానించారు.
వైఎస్తో ఐదేళ్ల పాటు పని చేసి..
ఇక అప్పట్లో సీఎం వైఎస్కి, ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఉన్న అనుబంధం విషయానికి వస్తే.. దాదాపు ఐదేళ్లు ఆయన వైఎస్ వద్ద పనిచేశారని చెప్పవచ్చు. పాదయాత్రలో వైఎస్ ఇచ్చిన హామీల అమలుతో పాటు పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ పథకం,జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులకు నిధులు కేటాయింపునకు సంబంధించి కీలకమైన ఆర్థికశాఖలో ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. అప్పట్లో ఉమ్మడి ఏపీలో టీడీపీ నుంచి వైఎస్ అధికారాన్ని చేజిక్కించుకున్న నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కూడా అమలైంది. అప్పట్లో ఉమ్మడి ఏపీలో 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రెండో విడత కార్యక్రమాన్ని 2007లో అమలు చేశారు. రెండో విడతలో మరో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళిక వేశారు. ఇక జలయజ్ఞంలో భాగంగా నెట్టెంపాడు, పులిచింతల, ప్రాణహిత-చేవెళ్ల, శ్రీపాదసాగర్, శ్రీరాంగసార్ ఆయకట్టు స్థిరీకరణ, పోలవరం కుడి, ఎడమ కాల్వల నిర్మాణం, హైదరాబాద్కు తాగునీటి సరఫరా లాంటి కార్యక్రమాలు అమలయ్యాయి. ఆరోగ్యశ్రీ పథకం కూడా ఆసమయంలోనే జరిగింది. ఇందుకు సంబంధించి రూ.వేలకోట్ల నిధులు కేటాయించాల్సి ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వేతనాల చెల్లింపులు, సంక్షేమ పథకాలకు కేటాయింపులు..ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఆర్థిక మంత్రిగా రోశయ్య వ్యవహరించారు. అదే సమయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎం అయ్యే నాటికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవసాయ శాఖలో కార్యదర్శి హోదాలో ఉన్నారు. వైఎస్ సీఎం అయ్యాక డిసెంబరు 24న గృహ నిర్మాణ శాఖ పరిధిలో జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. అదే శాఖలో 2006 మే 19వరకు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. తరువాత వివిధ పథకాల అమల్లో భాగంగా ఆర్థిక శాఖలో బదిలీలు జరిగాయి. ఈ బదిలీల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ అయ్యారు. మే 19, 2006– మార్చి16, 2009 వరకు అదే పోస్టులో ఉన్నారు. తరవాత రాజ్భవన్ కార్యదర్శి నియామకం కోసం ప్రభుత్వం పంపిన జాబితాలో నిమ్మగడ్డ రమేష్ పేరును కూడా ప్రభుత్వం చేర్చింది. ప్రభుత్వ సిఫారసు మేరకు అప్పటి నుంచి ఏడేళ్లపాటు అదే పోస్టులో పనిచేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.
Must Read ;- కత్తి దూసిన నిమ్మగడ్డ.. వేటు షురూ!
కడప జిల్లాలోనే..
ఇక్కడే మరో విషయం కూడా ఉంది. వైఎస్ హయాంలో కడప జిల్లాతో పాటు పులివెందులకు కూడా చాలా నిధులు కేటాయించారని, పులివెందుకు రూ.వందల కోట్ల నిధులు కేటాయించుకున్నారని, జాతీయ రహదారుల (అప్పటి) స్థాయిలో రోడ్లు వేయించుకున్నారని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి. అయితే, ముఖ్యమంత్రి నియోజకవర్గం కావడంతో నిధుల కేటాయింపు విషయంలో అన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయని అప్పట్లో ప్రభుత్వమే పలుమార్లు చెప్పింది. ఈ కేటాయింపుల్లో నిబంధనల అతిక్రమణ జరిగి ఉంటే..ఈ విషయంలోనూ ప్రభుత్వం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చేదని అప్పటి నాయకులు చెబుతుంటారు. ఆర్థిక శాఖ ఆమోదం తెలపనిదే.. ప్రాజెక్టులకు, ఉద్యోగాల భర్తీ, ఆరోగ్యశ్రీ, లక్షల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం జరిగే పరిస్థితి లేదని చెబుతున్నారు. మొత్తం మీద దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి సొంత జిల్లా అయిన కడపకు రివ్యూకి వెళ్లిన SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన ఆశీస్సులున్నాయని చెప్పడం, తన హృదయంలో ఆయనంటే ఎప్పుడూ ఓ ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
సీబీఐ కేసుల్లో సాక్షిగా..
ఇదే ప్రెస్ మీట్లో నిమ్మగడ్డ మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పలు ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు పైళ్లపై తాను సంతకాలు చేశానని, సీబీఐ కేసుల విషయంలో సాక్షిగా ఉన్నానని, రానున్న కాలంలో సాక్ష్యం చెప్పాల్సి వస్తే చెబుతానని కూడా వ్యాఖ్యానించారు. తనకు ఎలాంటి భయం లేదని, విట్ నెస్ ప్రొటెక్షన్ యాక్ట్లో భాగంగా తనకు ఉండాల్సిన రక్షణ తనకు ఉందని వ్యాఖ్యానించారు. వ్యవస్థల కార్యకలాపాలు స్వేచ్ఛగా, నిబంధనల ప్రకారం జరిగితే సమస్యలు రావని, వైఎస్ కూడా ఆ స్వేచ్చ ఇచ్చారని చెప్పారు.
Also Read ;- థ్రెట్ ఉందా? : హై సెక్యూరిటీ జోన్ లో నిమ్మగడ్డ!











