దేశంలో మరోసారి దేశద్రోహం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవలే ఏబీఎన్- ఆంధ్రజ్యోతి, టీవీ 5లతోపాటు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపైనా దేశద్రోహం కేసు నమోదైంది. ఈ కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశద్రోహం కేసులకు సంబంధించి మార్గదర్శకాలు అవసరమని వ్యాఖ్యానించింది. తాజాగా గురువారం 124ఎ సెక్షన్ ప్రకారం దేశద్రోహం అభియోగం మోపుతూ నమోదైన వేరే కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని విమర్శిస్తూ గతేడాది మార్చి 30 ప్రఖ్యాత జర్నలిస్టు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వినోద్ దువా యూట్యూబ్ షో లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం విధించిన కోవిడ్-19 లాక్ డౌన్, పరిణామాలు, ఇబ్బందులు, ప్రభుత్వ విధానాల్లోని లోపాలపై మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు శాంతి, మతసామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని హిమాచల్ప్రదేశ్ బీజేపీ నేత ఫిర్యాదు చేయడంతో రాజద్రోహం కేసు నమోదైంది. ఈ కేసును సవాలు చేస్తూ దువా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషిన్పై గురువారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు 1962 నాటి కేదార్నాథ్ సింగ్ తీర్పును ప్రస్తావిస్తూ ప్రభుత్వాలను విమర్శిస్తూ చేసే వ్యాఖ్యలను దేశద్రోహంగా పరిగణించలేమని జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి కేసుల్లో ప్రతి జర్నలిస్టుకు రక్షణ పొందే హక్కుందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి, టీవీ 5లకు పరోక్షంగా ఊరట లభించినట్టైంది. ఇక దేశ ద్రోహం కేసు విషయానికి వస్తే..
ఐపీసీ124-ఏ సెక్షన్ ప్రకారం..
ఇండియన్ పీనల్ కోడ్ లోని 124-ఏ సెక్షన్ ప్రకారం కేసు నమోదైతే దాన్ని దేశద్రోహంగా పరిగణిస్తారు. ఈ నేరం రుజువైతే బెయిల్ రాదు. దీంతోపాటు కనీసం మూడేళ్ల జైలు లేదా జీవితఖైదు, జరిమానా, శిక్ష విధిస్తారు. ఈ సెక్షన్లో పేర్కొన్న ప్రకారం..‘ భారత ప్రభుత్వాన్ని లేదా భారత దేశంలో చట్ట ప్రకారం నియమితులైన పాలనా వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని వ్యక్తులు, సంస్థలు, సమూహాలు చేతలతో, మాటలతో, సైగలతో, సంకేతాలతో, ప్రదర్శనలతో శత్రువులుగా భావించేలా చేయకూడదు. ప్రేరేపించరాదు. విద్వేషాలను రెచ్చగొట్టరాదు. విధేయతకు భంగం వాటిల్లే చర్యలు చేపట్టరాదు.’ దీన్ని 1837లో భారత శిక్షా స్మృతి ముసాయిదాలో పేర్కొన్నారు. భారతదేశంలో మొదటి లా కమిషన్ చైర్మన్గా థామస్ మెకాలే దీన్ని రూపొందించారు. అప్పట్లో 133 సెక్షన్ ఉండగా 1870లో దాన్ని 124-ఎతో కలిపారు.
Must Read ;- టీవీ9 ప్రసారం చేసిన కథనాలు.. పరువు నష్టం చేశారంటూ రఘురామ లీగల్ నోటీస్
బ్రిటీషు చట్టాల ఉల్లంఘన జరుగుతున్న సమయంలో..
స్వాతంత్రోద్యమంతో పాటు సత్యాగ్రహాలు, బ్రిటీషు చట్టాల ఉల్లంఘన జరుగుతున్న సమయంలో ఉద్యమకారులను, పోరాటయోధులను జైల్లో పెట్టేందుకు ఈ సెక్షన్ను వినియోగించారని చెబుతారు. 1897లో బాలగంగాధర తిలక్ మీద తొలిసారిగా ఈ సెక్షన్ అమలు చేయగా తరువాత మరో రెండుసార్లు అమలు చేశారు. ఈ సెక్షన్ కింద కేసు పెట్టిన కారణంగా తిలక్ ఏడేళ్లు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. తరువాతి కాలంలో 1922లో మహాత్మాగాంధీ యంగ్ ఇండియా పత్రికలో బ్రిటీషు వారికి వ్యతిరేకంగా ఆర్టికల్ రాసినందుకు ఈ సెక్షన్ ప్రకారం కేసు నమోదైంది. అప్పట్లోనే మహాత్మాగాంధీ ఈ సెక్షన్ను వ్యతిరేకించారు. పౌరుడి స్వేచ్ఛను అణచి వేయటానికి రూపొందించిన చట్టంగా పేర్కొన్నారు. తరువాతి కాలంలో ఈ సెక్షన్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.1941లో అప్పటి ఫెడరల్ కోర్ట్ గా చెప్పే భారతీయ సర్వోన్నత న్యాయస్థానం ఈ సెక్షన్పై పలు వ్యాఖ్యలు చేసింది. బెంగాల్లో నిహారేందు దత్ మజుందార్ అనే ఉద్యమకారుడు బ్రిటీష్ వారిచేత నియమితులైన బెంగాల్ గవర్నర్ను, కలెక్టర్ను విమర్శించినందుకు ఈ కేసు నమోదు కాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం పలు వ్యాఖ్యలు చేసింది. సదరు వ్యక్తి చేసిన వ్యాఖ్యల ద్వారా శాంతికి విఘాతం కలిగినప్పుడు లేదా హింస చెలరేగినప్పుడు వర్తిస్తుందని, అలాంటి ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలని భావించినా ఈ సెక్షన్ వర్తిస్తుందని తెలిపింది.
స్వాతంత్రయానంతరం..
కాగా స్వాతంత్రయానంతరం 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఓ కేసు విచారణలో భాగంగా ఈ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని పంజాబ్ హైకోర్టు 1950 నవంబర్లో తీర్పు చెప్పడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ తీర్పు ప్రకారమే భారత రాజ్యాంగానికి 1951 జూన్ 18న మొట్టమొదటి సవరణ జరిగింది. ఆ సవరణలో ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్న చట్టాల్లో మార్పులు, షెడ్యూల్ 9, జమిందారి వ్యవస్థ రద్దు, ఆస్తి హక్కులు, వాక్ స్వాతంత్ర్యానికి కొత్త మినహాయింపులు, చట్టం ముందు సమానత్వం అనే అంశాల ప్రకారం సవరణలు జరిగాయి. మొదటి సవరణలో భాగంగా ఆర్టికల్ 15, 19, 85, 87, 174, 176, 341, 342, 372, 376తో పాటు ఆర్టికల్స్ 31A, 31B. షెడ్యూల్ 9 మార్పులు జరిగాయి. వాక్ స్వాతంత్ర్య హక్కుకు మినహాయింపుగా శాంతి భద్రతలు అనే అంశాన్ని చేర్చారు. తరువాత పార్లమెంటులో నాటి ప్రధాని నెహ్రూ ప్రసంగిస్తూ ఈ సెక్షన్ అమలు చేయదగిన అర్హత లేనిదని వ్యాఖ్యానించారు.
మిశ్రమ తీర్పులు..
కాగా ఈ సెక్షన్కు సంబంధించి గతంలో పలు తీర్పులు వచ్చాయి. మిశ్రమ తీర్పులు వెలువడ్డాయి. కేదార్నాథ్ వర్సెస్ స్టేట్ ఆప్ బీహార్ కేసులో వాక్ స్వాతంత్ర్య హక్కుకు పరిమితిని విధించే ఈ సెక్షన్ సరైనదేనని 1962లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ నాటి కేదార్ నాథ్ ప్రసంగంలో హింసాయుత మార్గంలో ప్రభుత్వాన్ని కూలదోసేలా ‘కాంగ్రెస్ నాయకులు కాలి బూడిద అవుతారు’ అనే పదం వాడడంతో ఈ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయడాన్ని సమర్థించింది. ఆ తరువాత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యకు గురైన రోజున ‘ఖలిస్తాన్ జిందాబాద్’ నినాదాలు చేసి ప్రజలను రెచ్చగొట్టి వేర్పాటువాదాన్ని ఉసిగొల్పేలా వ్యవహరించిన బల్వంత్సింగ్ తదితరుల మీద దేశద్రోహం కేసు నమోదు కాగా 1995లో తుది తీర్పు వచ్చింది. ప్రజల నుంచి ఎటువంటి స్పందన లేదా ప్రతిస్పందన లేని వ్యాఖ్యలను ఇద్దరు వ్యక్తులు చేస్తే ఈ సెక్షన్ వర్తించదని, అలా వర్తింపజేయాలంటే ఆ చర్యల తీవ్రతను పరిగణనలోకి తీసుకోవాలని, ఈ కేసులో ఆ తీవ్రత లేదని చెబుతూ సర్వోన్నత న్యాయస్థానం బల్వంత్ సింగ్ నిర్దోషిగా తీర్పు చెప్పింది. ఈ సెక్షన్కు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ 2016లో కామన్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసింది. కేదార్ నాథ్ కేసుతో పాటు బల్వంత్ సింగ్ కేసులో ఇచ్చిన తీర్పును విచారణాధికారులు పాటించాలని సుప్రీం తీర్పు నిచ్చింది.
బ్రిటన్లో ప్రస్తుతం అమల్లో లేదు..
కాగా ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. బ్రిటీష్ వారు ప్రవేశపెట్టిన ఈ చట్టం ప్రస్తుతం బ్రిటన్లో అమల్లో లేదు. ఆ దేశ న్యాయకమిషన్ 1977లోనే ఈ సెక్షన్ను రద్దుచేయాలని సిఫారసు చేయగా 2009లో రద్దైంది. సౌదీ అరేబియా, మలేసియా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్, సూడాన్, సెనెగల్, టర్కీ దేశాల్లో కూడా దేశద్రోహానికి సంబంధించి సెక్షన్లు ఉన్నా వీటిలో చాలావరకు అతివాద కార్యక్రమాలు, హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడినట్టు పక్కా ఆధారాలు ఉండడం, ప్రాథమిక విచారణ పూర్తయ్యాక ఈ సెక్షన్ను వర్తింపజేస్తారు. అమెరికాలో దేశ ద్రోహ చట్టం ఉన్నా అమల్లోకి తెచ్చిన సందర్భాలు ఇటీవలి కాలంలో లేవని చెప్పవచ్చు.
2015 తరువాత పెరిగిన వినియోగం
ఇక మన దేశంలో 1947నుంచి 2014 వరకు దేశద్రోహ కేసులు ఎన్ని నమోదయ్యాయనే విషయంపై ప్రత్యేక రికార్డులు లేవు. గతంలో పార్లమెంటులో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు అప్పటి ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఈ సెక్షన్ను ఇప్పటి ప్రభుత్వమే కాదు.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు అప్పుడప్పుడు కొన్ని రాష్ట్రాలు కూడా వినియోగించి కేసులు నమోదు చేస్తున్నా 2015 తరువాత ఈ సెక్షన్ వినియోగం 30 శాతం మేర పెరిగినట్టు అంచనా. గతంలో పుల్వామాలో ఉగ్రవాద దాడి నేపథ్యంలో మీడియా, సోషల్ మీడియాలో భారతదేశానికి వ్యతిరేకంగా కామెంట్లు చేసిన వారిపై ఈ కేసులు నమోదు చేశారు. తరువాత 2016లో జేఎన్యూ విద్యార్థి నాయకుడు కన్హయ్యకుమార్తోపాటు పలువురు హక్కుల ఉద్యమకారులపైనా ఈ సెక్షన్లు అమలు చేశారు. ఉద్యమకారుడు దిశా రవిపైనా ఇలాంటి కేసే నమోదైంది. ఈ సెక్షన్పై సమీక్ష అవసరమని ఎప్పటి నుంచో డిమాండ్ వస్తోంది కూడా. తాజగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5లపై ఈ సెక్షన్ల ప్రకారం ఏపీ ప్రభుత్వం కేసు పెట్టిన నేపథ్యంలో ఆ మీడియా సంస్థలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఈ కేసు విచారణలో భాగంగా సర్వోన్నత న్యాయస్థానం పలు వ్యాఖ్యలు చేసింది. మీడియా, భావ ప్రకటన స్వేచ్ఛ కోణంలో ‘రాజద్రోహం’ కేసులు మోపడానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయాల్సిన సమయం వచ్చిందని చెబుతూ 124-ఎతో పాటు అనుబంధ సెక్షన్లుగా చెప్పే 153, 505 సెక్షన్లకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తామని పేర్కొంది.జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్ర భట్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసే మార్గదర్శకాలు ఎలా ఉంటాయనే చర్చ నడుస్తోంది.
Must Read ;- ప్రతి జర్నలిస్టుకు రక్షణ పొందే హక్కు.. వినోద్ దువాపై రాజద్రోహం కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు










