తెలుగు సినిమా రంగానికి కొత్త వెలుగులు వచ్చాయి. మన హీరోలంతా రకరకాల సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. లాక్ డౌన్ కాలంలో ఇంటికే పరిమితమవడంతో షూటింగుల్లో ఉంటే ఎంత సరాదాగా ఉంటుందో తెలిసి వచ్చిందనుకోవాలేమో. లేదా ఒక ఏడాదిని కోల్పోవడంతో ఆ లోటును భర్తే చేసుకోడానికైనా సినిమాలు చేయాల్సిందే అనే పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. శరవేగంగా సినిమాలు చేసేస్తున్నారు. ఒక విధంగా ఇది మంచి పరిణామం అనుకోవాలి.
👉 పవర్స్టార్ పవన్కళ్యాణ్, దగ్గుబాటి రానాల ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ షూటింగ్ జనవరి 25 నుంచి ప్రారంభమైంది. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో సాయి పల్లవి, ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. దీనికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగులు అందిస్తున్నారు.
👉 సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ‘సర్కారువారి పాట షూటింగ్ దుబాయ్ లో జనవరి 25 నుంచి ప్రారంభమైంది. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

👉 యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న ‘రాధేశ్యామ్’ విడుదల తేదీపై స్పష్టత వచ్చేసింది. జులై 9న ఈ సినిమా విడుదలవుతుంది. ఫిబ్రవరిలో టీజర్ విడుదలవుతుంది.
👉 క్రాక్ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ‘పుష్ప’ నైజాం హక్కులను రూ. 40 కోట్లకు అడిగినట్టు సమాచారం. నిర్మాతలు ఇంకా ఎక్కువ ఆశిస్తున్నట్లు సమాచారం. నిజానికి ఇది చాలా పెద్ద మొత్తమే. ఇంతకుముందు బాహుబలి 2, సాహో, ట్రిపుల్ ఆర్ చిత్రాలకు మాత్రమే ఇలాంటి ఆఫర్ లభించింది.
👉 నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కోసం సారథి స్టూడియోలో భారీ సెట్ వేశారు. ఇందులో విలన్లు నటిస్తున్న సునీల్ శెట్టి, శ్రీకాంత్ లతో బాలయ్య ఫైట్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ ఏడాది దసరాకు ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది.
👉 రవితేజ క్రాక్ సినిమాను ఈ నెల 29 నుంచి ఓటీటీ ‘ఆహా’లో వీక్షించవచ్చు. ఇప్పటికే థియేటర్లలో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ ‘ఆహా’ నుంచి లభించడం విశేషం.
👉 మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ మేనేజర్ ప్రవీణ్ ఇటీవల సారథీ స్టూడియోలో అనిల్ రావిపూడిని కలిసి ఈ ప్రాజెక్టుపై చర్చించారు. ఈ ఏడాది చివరలో ఈ ప్రాజెక్టు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
👉 విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘లైగర్’ జులైలో విడుదల కానుంది. ఇంకా 60 శాతం షూటింగ్ మిగిలి ఉన్నట్లు సమాచారం. మరో మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేయగలనన్న నమ్మకంతో పూరి ఉన్నారు.
Must Read ;- తెలుగు సినీ పరిశ్రమకు విషాదాన్ని మిగిల్చిన 2020

👉 రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కిలాడి’ సినిమాకు సంబంధించి తాజ్ అప్ డేట్ రిపబ్లిక్ డేట్ రాబోతోంది. బహుశా ఈ సినిమాలో రవితేజ్ ఫస్ట్ లుక్ విడుదల చేసే అవకాశం ఉంది.
👉 సాయిధరమ్ తేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో రూపొందే సినిమా అప్ డేట్ జనవరి 25 సాయంత్రం రానుంది. ఈ సినిమా టైటిల్, ఇతర విశేషాలను ప్రకటిస్తారు.
👉 శర్వానంద్ హీరోగా రూపొందుతున్న ‘శ్రీకారం’ చిత్రం మార్చి 11న విడుదల కానుంది.
👉 ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందే ‘సలార్’ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతుంది. ఇతర భాషల్లోకి డబ్ చేస్తారు.

👉 నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులకు కచ్చితంగా ఇది శుభవార్తే. ఆయన కుమారుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా జూన్ 10న సినిమా ప్రారంభమవుతుంది. దీనికి పూరి జగన్నాథ్ దర్శకుడు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ను ‘చిరుత’గా పరిచయం చేసిన పూరి జగన్నాథ్ ఏ సింహం పేరునో ఈ సినిమాకు సూచించే అవకాశం ఉంది.
👉 విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లు చిత్రీకరిస్తున్నారు. ఈ నెలాఖరుకల్లా షూటింగ్ పూర్తవుతుంది. వేసవిలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.
👉 రామ్ పోతినేని మరో సినిమాకి సన్నద్ధమవుతున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తమిళ చిత్రం ‘జిల్లా’ దర్శకుడు నేసన్ తో ఈ సినిమా ఉండబోతోంది. పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడవుతాయి.
👉 మెగాస్టార్ చిరంజీవి ‘వేదాళం’ రీమేక్ ను భారీ ప్రాజెక్టుగా మలిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. ఈ ఏడాది రెండు రీమేక్ లతో ముందుకు రావాలని ఆ దిశగా చిరు అడుగులు వేస్తున్నారు. ‘లూసీఫర్’ ప్రారంభోత్సవం జరిగింది. షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది.
👉 రెబల్ స్టార్ కృష్ణంరాజు ‘రాధేశ్యామ్’లో ఓ పాత్ర పోషించారు. ఆ పాత్ర పేరు పరమహంస అట. ఈ విషయాన్ని ఆయనే అధికారికంగా వెల్లడించారు. ఇది ఓ రిషి పాత్ర అంటున్నారు. ఇంకా కొంత షూటింగ్ చేయాల్సి ఉంది.
👉 మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందే ‘ఉప్పెన’ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలవుతుంది.











